Apsara case: అప్సరను చంపి, డ్రైనేజీలో పూడ్చి, మ్యాన్హోల్ను మట్టితో నింపిన కేసు.. పూజారికి జీవిత ఖైదు
ఇంటి సమీపంలో డ్రైనేజీలో పూడ్చి పెట్టి, మ్యాన్హోల్ను మట్టితో నింపి సిమెంట్తో మూసేశాడు.

హైదరాబాద్లోని సరూర్ నగర్కు చెందిన అప్సర హత్య కేసులో దోషిగా తేలిన పూజారి సాయికృష్ణకు రంగారెడ్డి కోర్టు జీవత ఖైదు విధించింది. 2023లో అప్సర హత్య కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పెళ్లి చేసుకోవాలని అప్సర అడుగుతుండడంతో ఆమెను పూజారి శంషాబాద్కు కారులో తీసుకెళ్లి హత్య చేశాడు.
ఆ తర్వాత తన ఇంటి సమీపంలో డ్రైనేజీలో పూడ్చి పెట్టి, మ్యాన్హోల్ను మట్టితో నింపి సిమెంట్తో మూసేశాడు. కేసు దర్యాప్తు చేసి సాక్ష్యాలను శంషాబాద్ పోలీసులు కోర్టుకు సమర్పించారు. దీంతో సాయికృష్ణకు జీవిత ఖైదు విధిస్తూ రంగారెడ్డి కోర్టు శిక్ష ఖరారు చేసింది. సాక్ష్యాలు తారుమారు చేసినందుకు మరో ఏడేళ్లు జైలు శిక్ష విధించింది.
Also Read: కేటీఆర్ వ్యాఖ్యలపై భట్టి ఫైర్.. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలంటూ..
పూజారిగా పనిచేస్తూనే అప్సరతో పరిచయం..
పూజారి సాయికృష్ణ సరూర్ నగర్లో ఓ దేవాలయంలో పూజారి. అతడికి అప్పటికే పెళ్లి అయినప్పటికీ అప్సరతో అతడు పరిచయం పెంచుకుని, సన్నిహిత సంబంధం పెట్టుకున్నాడు. నాలుగేళ్లుగా వాళ్లు హాయిగా తిరిగారు. అప్సర గర్భం దాల్చడంతో అసలు సమస్య మొదలైంది.
తనను పెళ్లి చేసుకోవాలని పూజారికి అప్సర చెప్పింది. అయితే, దేవాలయంలో పూజారిగా పనిచేస్తూ తాను ఇటువంటి పనులు చేస్తున్నానని ఎవరికైనా తెలిస్తే పరువు పోతుందని అప్సరను పూజారి చంపాలని ప్రణాళిక వేసుకున్నాడు. 2023 జూన్ 3న అప్సరతో కోయంబత్తూరు వెళ్దామని చెప్పాడు.
రాత్రి సమయంలో అప్సరను కారులో అతడు సరూర్నగర్ నుంచి తీసుకెళ్లి, శంషాబాద్ మండలం రాళ్లగూడలో ఓ హోటల్లో డిన్నర్ చేశాడు. ఓ గోశాలలో బెల్లం దంచే రాయిని తీసుకుని, కారులో పెట్టుకున్నాడు. ఆ తర్వాతి రోజు తెల్లవారుజామున నర్కుడలో కారులో అప్సర నిద్రపోయింది.
అదే అదునుగా భావించి కారు సీటు కవర్తో ఆమెకు ఊపిరాడకుండా చేసి, అలాగే, ఆమె తలపై బెల్లం దంచే రాయితో బాదాడు. ఆమె మృతి చెందడంతో మృతదేహంపై కారు కవర్ కప్పి, సరూర్నగర్లోని తన ఇంటికి చేరుకున్నాడు. అప్సర మృతదేహాన్ని డ్రైనేజీలో పూడ్చి, మ్యాన్హోల్ను మట్టితో నింపి, దానిపై సిమెంట్ కూడా వేయించాడు. ఆ తర్వాత అప్సర కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు జరిపి పూజారే నిందితుడని గుర్తించారు.