Southwest Monsoon : ఖమ్మం జిల్లాను తాకిన నైరుతి రుతుపవనాలు.. మూడు రోజులపాటు భారీ వర్షాలు
ఉమ్మడి ఖమ్మంతో పాటు ములుగు, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ మూడు రోజులపాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.
Heavy Rains : తీవ్రమైన ఎండలు, వడగాలులతో అల్లాడుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లటి కబురు అందించింది. రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా వరకు నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్లు తెలిపింది. రెండు, మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని పేర్కొంది.
ఉమ్మడి ఖమ్మంతో పాటు ములుగు, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ మూడు రోజులపాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనంతో మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది.
చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. జూన్ 25, 26 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు రాష్ట్రానికి ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటనతో రైతులు సాగుకు సమాయత్తం కానున్నారు.