తెలంగాణ ప్రజల డేటాబేస్ను రూపొందించాలని సర్కారు యోచన.. మీ నుంచి ఏయే వివరాలు సేకరిస్తారు?
దీనివల్ల ప్రభుత్వ పథకాలను అర్హులైన వారికి పంపిణీ చేయడంలో పొరపాట్లు జరగవు.

తెలంగాణ ప్రభుత్వం సమీకృత రాష్ట్ర పౌరుల డేటాబేస్ను రూపొందించాలని యోచిస్తోంది. ఇప్పటికే దీని కోసం అధికారులు డీపీఆర్ను సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్టు కోసం రూ.30 కోట్లు అవసరమని ప్రభుత్వం అంటోంది.
ఇందులో కేంద్ర సర్కారు రూ.25 కోట్లు కేటాయిస్తే, తాము రూ.5 కోట్లు వెచ్చిస్తామని చెబుతోంది. రెండేళ్లలో ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నట్లు పేర్కొంది. ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా, కచ్చితత్వంతో అర్హులైన వారికి చేరవేయడానికి ఈ డేటాబేస్ కీలక వనరుగా ఉంటుందని వివరించింది.
తెలంగాణ ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ గత ఏడాది కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శి ఎస్.కృష్ణన్కు లేఖ రాశారు. ప్రాజెక్టు వివరాలను తెలిపారు. ప్రాజెక్టులో భాగంగా తెలంగాణలోని ప్రతి కుటుంబానికి సంంధించి సమగ్ర వివరాలు సేకరించాలి.
Also Read: ఐఫోన్ 17 సిరీస్ డమ్మీ ఫోన్లు చూశారా? వామ్మో.. డిజైన్లో ఎన్నెన్ని మార్పులో..
ప్రతి ఫ్యామిలీకి ప్రత్యేక ఐడీ నంబర్ జారీ చేస్తారు. దీని కింద ప్యామిలీ వివరాలను రిజిస్ట్రర్ చేస్తారు. కుటుంబంలో ఎవరు, ఏ ప్రభుత్వ పథకాన్ని పొందుతున్నారు అనే వివరాలు పొందుపరుస్తారు. కుటుంబ సభ్యుల డాక్యుమెంట్లు (పథకాలకు అవసరమైన మేరకు) అందులో భద్రంగా ఉంటాయి.
జనన, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో పాటు ఆధార్ కార్డు వంటి సమాచారాన్ని డిజిటలైజ్ చేస్తారు. ప్రోటోకాల్ ద్వారా కేవలం అనుమతి ఉన్నవారికి మాత్రమే వివరాలు అందుబాటులో ఉంటాయి. ఇప్పటికే ఉన్న డేటాను ఈ కొత్త డేటాబేస్కు బదిలీ చేస్తారు. డేటా ఎప్పుడూ కోల్పోకుండా రికవరీ ఏర్పాట్లు చేస్తారు.
దీనివల్ల ప్రభుత్వ పథకాలను అర్హులైన వారికి పంపిణీ చేయడంలో పొరపాట్లు జరగవు. అలాగే, లబ్ధిదారుల దరఖాస్తులను త్వరగా పరిష్కరించవచ్చు. దరఖాస్తుల స్థితిగతులు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. పథకాల అమలుకు అవసరమైన నిధుల వివరాలు సులువుగా పొందవచ్చు.