YS Sharmila : పాలేరు నుంచి బరిలోకి వైఎస్ షర్మిల.. ఈ నెల 6న నామినేషన్
ఎక్కడెక్కడ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు ఉన్నారో, వైఎస్ఆర్ టీపీకి కొంత ఓటు బ్యాంకు ఉందో అటువంటి స్థానాల్లో మాత్రమే పోటీ చేయాలని షర్మిల భావిస్తున్నట్లు సమాచారం. YS Sharmila

YS Sharmila Paleru
YS Sharmila Paleru : పాలేరు నుంచి ఎన్నికల బరిలో దిగనున్నారు వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఈ నెల 6న పాలేరులో నామినేషన్ వేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 50 సభలకు సన్నాహాలు చేస్తున్నారు వైఎస్ షర్మిల. తొలుత కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఏకాభిప్రాయం కుదరకపోవడంతో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని తెలంగాణ ఎన్నికల బరిలో నిలిపారు షర్మిల.
పాలేరు నుంచి పోటీ చేయాలని ఇదివరకే షర్మిల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు చివరివరకు ప్రయత్నించారు. కానీ, ఆ ప్రయత్నాలు బెడిసికొట్టాయి. దీంతో ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించారు షర్మిల. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని షర్మిల నిర్ణయం తీసుకున్నా ఎన్ని స్థానాల్లో వైఎస్ఆర్ టీపీ పోటీ చేస్తుంది అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
Also Read : ఏపీలో చీకట్లు, సింగిల్ రోడ్లు.. సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని షర్మిల ప్రకటించినప్పటికీ.. అభ్యర్థుల నుంచి అంతగా స్పందన రాలేదని తెలుస్తోంది. పోటీ చేసేందుకు పలువురు ముందుకు వచ్చినా వారిలో ప్రముఖులు, గట్టి పోటీ ఇచ్చే వారు ఎవరూ లేరట. దీంతో ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి అనే దానిపై షర్మిల నిర్ణయానికి రాలేదు. కాగా, 15 నుంచి 20 స్థానాల్లో వైఎస్ఆర్ టీపీ పోటీ చేసే చాన్సుంది. ఎక్కడెక్కడ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు ఉన్నారో, వైఎస్ఆర్ టీపీకి కొంత ఓటు బ్యాంకు ఉందో అటువంటి స్థానాల్లో మాత్రమే పోటీ చేయాలని షర్మిల భావిస్తున్నట్లు సమాచారం. మొత్తంగా పూర్తి స్థాయి అభ్యర్థుల ప్రకటన కావొచ్చు, మేనిఫెస్టో ప్రకటన కావొచ్చు వీటన్నింటిపై ఒకటి రెండు రోజుల్లో వైఎస్ షర్మిల ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది.
Also Read : బీకేర్ ఫుల్.. అక్కడ 5 నెలలుగా కరెంట్ లేదు.. తెలంగాణ ప్రజలను హెచ్చరించిన కిషన్ రెడ్డి