పోలీసులు మా గొంతులు నులిమి..బూటు కాళ్లతో తన్నారు : అమరావతి మహిళల ఆవేదన

మందడంలో సకల జనుల సమ్మెలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.ధర్నాలో పాల్గొన్న మహిళలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. చేతికి అందిన మహిళల్ని ఈడ్చిపడేశారు. మహిళల్ని పోలీస్ వ్యాన్ లోకి ఎక్కించే క్రమంలో మహిళలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో మరింతగా రెచ్చిపోయిన పోలీసులు మహిళల్ని అందిన చోటల్లా పట్టుకుని లాగిపడేశారు. దీంతో మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆడవారి కూడా చూడకుండా మగ పోలీసులు గొంతు పట్టుకుని నులిమేశారనీ దీంతో శ్వాస ఆడక ఉక్కిరిబిక్కిరి అయిపోయి తీవ్ర అస్వస్థతకు గురయ్యారనీ..పలువురికి గాయాలయ్యాయని మండిపడ్డారు.
సీఎం జగన్ పాలనలో మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. మా కష్టాలు చెప్పుకుంటుంటే పోలీసులు ఇష్టానుసారంగా మహిళలపై విరుచుకుపడి నానా గలాటా సృష్టించారనీ…మెడలో ఉండి బంగారు గొలుసుల్ని..గాజుల్ని కూడా పోలీసులు లాక్కున్నారనీ..ఆవేదన వ్యక్తంచేశారు. ఆందోళనలో పాల్గొనని మహిళలపై కూడా పోలీసులు జులుం ప్రదర్శించారనీ ఆరోపించారు. గొంతు పట్టుకుని నులిమేసి..బూటు కాళ్లతో తన్నారనీ..మహిళల్ని కొట్టారని ఆవేదన వ్యక్తంచేశారు.
ఓట్లు వేసి జగన్ ని సీఎంగా చేస్తే తాను రూమ్ లో కూర్చుని అధికారాన్ని కట్టబెట్టిన మహిళలపై పోలీసులతో దాడులు చేయిస్తారా? సీఎం కాన్వాయ్ వెళ్లాలంటే పోలీసులతో ప్రజలపై దాడిచేయిస్తారా? ఇదేనా మీ పాలనా? ఇదేనా మహిళలకు మీరిచ్చే గౌరవం? రైతుల్ని..మహిళల్ని బాధ పెట్టిన ప్రభుత్వం మనుగడ సాగించలేదని..దీనికి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు.