విశాఖలో సచివాలయం, సీఎంవో, వేసవి అసెంబ్లీ, హైకోర్టు బెంచ్ : జీఎన్ రావు కమిటీ సంచలన సిఫార్సులు

అసెంబ్లీలో సీఎం జగన్ చెప్పినదాన్నే తన నివేదికలో ప్రస్తావించారు రాజధాని అధ్యయనంపై ఏర్పాటైన నిపుణుల కమిటీ కన్వీనర్ జీఎన్ రావు. జగన్ ఆశించినట్లుగా పరిపాలన వికేంద్రీకరణ, మూడు రాజధానుల ప్రతిపాదనకు మొగ్గుచూపారు. ఏపీ రాజధాని అంశంపై సీఎం జగన్ కు నివేదిక ఇచ్చిన తర్వాత జీఎన్ రావు కమిటీ మీడియాతో మాట్లాడింది. సీఎంకు ఇచ్చిన నివేదికలో చేసిన సూచనలను, సిఫార్సులను కమిటీ సభ్యులు మీడియాకు వివరించారు. విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలని తాము నివేదికలో సూచించామని కమిటీ సభ్యులు తెలిపారు. విశాఖలో సీఎంవో, సచివాలయం, వేసవి అసెంబ్లీ, హైకోర్టు బెంచ్.. అమరావతిలో అసెంబ్లీ, రాజ్ భవన్, మంత్రుల క్వార్టర్స్, హైకోర్టు బెంచ్, సీఎం క్యాంప్ ఆఫీస్.. కర్నూలులో హైకోర్టు, సీఎం క్యాంప్ ఆఫీస్, శీతాకాల అసెంబ్లీ ఏర్పాటు చేయాలని నివేదికలో సూచించామన్నారు. అంతేకాదు.. పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్రాన్ని 4 రీజియన్ లుగా విభజించాలని తాము సిఫార్సు చేసినట్టు కమిటీ సభ్యులు వివరించారు. ఉత్తర, మధ్య, దక్షిణ కోస్తా, రాయలసీమ రీజియన్ లుగా రాష్ట్రాన్ని విభజించాలని కోరామన్నారు.
సెప్టెంబర్ నుంచి శోధించిన అంశాలపై నివేదిక రూపొందించామని, దాన్ని సీఎంకు ఇచ్చామని కమిటీ సభ్యులు తెలిపారు. ప్రధానంగా రెండు అంశాలపై (రాజధాని, అభివృద్ధి) తాము అధ్యయనం జరిపామని, మూడు ప్రాంతాల ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నామని కమిటీ సభ్యులు వివరించారు. ఏపీలో ప్రాంతీయ అసమానతలు ఉన్నట్టు తాము గుర్తించామన్నారు. మూడు ప్రాంతాల సమస్యలపై తాము పరిశీలన చేశామన్నారు. రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా జరగాలి, అందుకోసం ఏం చేస్తే బాగుంటుంది అనే సూచనలు, సిఫార్సులు నివేదికలో పొందుపరిచామని కమిటీ సభ్యులు చెప్పారు.
రాజధానిపై జీఎన్ రావు కమిటీ సిఫార్సులు:
* పరిపాలన సౌలభ్యం కోసం 4 రీజియన్ లుగా ఏపీ విభజన
* ఉత్తర, మధ్య, దక్షిణ కోస్తా, రాయలసీమ రీజియన్ లుగా విభజన
* పరిపాలన రాజధానిగా విశాఖ
* విశాఖలో సీఎంవో, సచివాలయం, వేసవి అసెంబ్లీ, హైకోర్టు బెంచ్
* అమరావతిలో అసెంబ్లీ, రాజ్ భవన్, మంత్రుల క్వార్టర్స్, హైకోర్టు బెంచ్, సీఎం క్యాంప్ ఆఫీస్
* కర్నూలులో హైకోర్టు, సీఎం క్యాంప్ ఆఫీస్, శీతాకాల అసెంబ్లీ సమావేశాలు
* రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించాము
* ఏపీలో ప్రాంతీయ అసమానతలు ఉన్నాయి
* కొన్ని ప్రాంతాలు బాగా వెనుకబడి ఉన్నాయి
* వరద ముంపులేని ప్రాంతంలో రాజధాని ఉండాలని సూచించాం
* సహజ వనరులు అన్ని ప్రాంతాలకు అందాలి
* అభివృద్ధి ఫలాలు అందరికీ దక్కాలి
* జిల్లాల్లోని అన్ని వర్గాలతో సమావేశం అయ్యాం
* తుళ్లూరులో కొన్ని జోన్లు వరద ప్రభావానికి గురవుతాయి
* ఆ ప్రాంతాల్లో తప్పు మిగతా ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలని సూచించాం