ఓపెన్ గానే తిట్లు : చింతలపూడిలో అంబికా వర్సెస్ పీతల సుజాత

పోలింగ్ తేదీ దగ్గరపడుతుంటే ఏపీలోని అధికార పార్టీ టీడీపీ నేతలు మాత్రం బాహాటంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. చింతలపూడి నియోజకవర్గం టీడీపీలో ఇదే పరిస్థితి బయట పడింది. నియోజకవర్గం జంగారెడ్డిగూడెంలో జరిగిన టీడీపీ ఆర్యవైశ్య సభ రసాభసగా మారింది. మాజీమంత్రి పీతల సుజాత నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ అనడంతో.. అక్కడే ఉన్న సుజాత అనుచరులు అంబికా కృష్ణతో వాగ్వాదానికి దిగారు. దీంతో మంత్రిగా ఉండి సూజాత నియోజకవర్గంలో చేసిందేమి లేదని, అభివృద్ధి శూన్యమని, పాపాలు తగలకూడదనే సీఎం చంద్రబాబు సుజాతకు సీటు ఇవ్వలేదంటూ అంబికా కృష్ణ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
రెండు రెండు వర్గాలుగా చీలిన టీడీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. కొట్టుకోబోయారు. తోపులాట జరిగింది. పోలింగ్ సమయంలో నియోజకవర్గం అభివృద్ధి లేదంటూ.. సొంతపార్టీ నేతలే ఆరోపిస్తే ప్రచారానికి ఎలా వెళ్లాలంటూ ఆమె అనుచరులు మండిపడ్డారు.
పార్టీ పరువును రోడ్డున పడేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నేతలు, కార్యకర్తలు. ఈ పరిణామాలు, వర్గపోరుతో సొంత క్యాడరే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధికి ప్రతికూల అంశాలుగా మారినట్లు చెబుతున్నారు. ఇక ప్రస్తుతం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న పీతల సుజాతకు కాకుండా కర్రా రాజారావుకు టికెట్ ఇచ్చారు. టీడీపీ అభ్యర్ధి కర్రా రాజారావుకు వైసీపీ అభ్యర్ధి వీఆర్ ఎలిజకు ఈ నియోజకవర్గంలో గట్టి పోటీ ఉంది. అంబికా కృష్ణ బహిరంగంగానే పీతల సుజాతపై విమర్శలు, ఆరోపణలు చేయటంతో.. బరిలో ఉన్న అభ్యర్థికి ఇది ఇబ్బందిగా మారింది.