శ్రీశైలం జలాశయంకు భారీగా చేరుకుంటున్న వరద ప్రవాహం

  • Published By: vamsi ,Published On : September 27, 2019 / 02:02 AM IST
శ్రీశైలం జలాశయంకు భారీగా చేరుకుంటున్న వరద ప్రవాహం

Updated On : September 27, 2019 / 2:02 AM IST

శ్రీశైలం జలాశయంకు ఎగువ ప్రాజెక్టుల నుంచి వరద ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తుంది. శ్రీశైలానికి గురువారం(26 సెప్టెంబర్ 2019) నుంచి భారీగా వరద నీరు ప్రవహిస్తుండడంతో నిన్న(26 సెప్టెంబర్ 2019) ఉదయం 6గంటలకు మూడు క్రస్ట్‌గేట్లను తెరచి దిగువ సాగర్‌కు నీటిని వదులుతున్నారు. జలాశయానికి వరద ప్రవాహ ఉధృతి పెరగడంతో తెరచిన మూడు క్రస్ట్‌గేట్లను తెరిచారు.

అనంతరం ఉదయం 9 గంటలకు మరో గేట్‌, 10 గంటలకు మరో గేట్‌, మధ్యాహ్నం 2గంటలకు మరో గేట్‌ ఎత్తి దిగువ సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ ఏడాదిలో డ్యాం క్రస్ట్‌గేట్లను ఎత్తి దిగువ సాగర్‌కు నీటిని విడుదల చేయడం నాల్గవ సారి. శ్రీశైలం డ్యాం నీటిమట్టం గురువారం సాయంత్రం 6గంటల వరకు 884.80 అడుగులు, జలాశయ నీటినిల్వ సామర్థ్యం 214.3637 టీఎంసీలుగా నమోదైంది.

శ్రీశైలం డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు, నీటినిల్వలు 215.8070 టీఎంసీలు. జూరాల విద్యుదుత్పత్తి ద్వారా 42,606 క్యూసెక్కులు, క్రస్ట్‌గేట్ల ద్వారా 68,842 క్యూసెక్కులు, తుంగభద్ర నుంచి 66,176 క్యూసెక్కులు మొత్తం జలాశయానికి  లక్షా 77వేల 624 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ప్రవహిస్తుంది. శ్రీశైలం కుడిగట్టు విద్యుత్‌ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ జలాశయం నుంచి 26,042 క్యూసెక్కులను వాడుకుంటున్నారు.

ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్‌ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ జలాశయం నుంచి 42,378 క్యూసెక్కులను వినియోగించుకుంటున్నారు. డ్యాం 6 రేడియల్‌ క్రస్ట్‌గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 1,67,898 క్యూసెక్కుల నీటిని మొత్తం జలాశయం నుంచి ఔట్‌ఫ్లోగా 2,36,318 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.