కుళ్లిన చికెన్ తో బిర్యానీ : బావర్చి హోటల్ కు జరిమానా
రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని మంగల్పల్లి గేట్ దగ్గర ఉన్న రెడ్ బావర్చి రెస్టారెంట్లో మున్సిపల్ అధికారులు దాడులు నిర్వహించారు. ఆహార పదార్ధాల నాణ్యతను పరిశీలించారు. కుళ్లిపోయిన, నిల్వ ఉన్న చికెన్ స్వాధీనం చేసుకున్నారు. దాంతోనే బిర్యానీ చేస్తున్నట్టు గుర్తించారు. హోటల్ నిర్వాహకులకు అధికారులు రూ.20వేలు జరిమానా విధించారు. శాంపిల్స్ను సేకరించి ల్యాబ్కు పంపారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
మంగల్పల్లి గేట్ దగ్గర ఇటీవల రెడ్ బావర్చి హోటల్ ప్రారంభమైంది. ఈ హోటల్లో కుళ్లిన కోడి మాంసం వాడుతున్నట్లు మున్సిపల్ అధికారులకు సమాచారం అందింది. దీంతో వారు శుక్రవారం(నవంబర్ 1,2019) ఆ హోటల్పై మెరుపు దాడి చేసి పరిశీలించారు. ఈ పరిశీలనలో హోటల్లో కుళ్లిన మాంసం లభించింది. హోటల్ నిర్వాహకులపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బు కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడం సరికాదన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు రిపీట్ అయితే చర్యలు తప్పవని హెచ్చరించారు.