ఎగ్గొడితే ఊరుకోం..GST బకాయిలు చెల్లించాల్సిందే.. కేంద్రంపై హరీష్ రావు సీరియస్
Pay GST funds in full: T Harish Rao కరోనా కష్ట సమయంలో రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. కరోనా పేరటి రాష్ట్రాలకు రావాల్సిన రూ.1.35లక్షల కోట్ల జీఎస్టీ పరిహారాన్ని ఎగ్గొట్టాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్రావు. కరోనా కారణంగా ఆర్థికంగా రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయాయని ఆయన అన్నారు.
కరోనాతో గత నాలుగు నెలల్లో రాష్ట్రం సుమారు రూ.8వేల కోట్ల ఆదాయం కోల్పోయిందని అన్నారు. జీఎస్టీపై 10 రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన తర్వాత జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన హరీశ్రావు.. కరోనా పేరిట రూ. 1.35లక్షల కోట్లు ఎగ్గొట్టాలని కేంద్రం చూస్తుందని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కేంద్రంపై సీరియస్ అయ్యారు. నష్టపరిహారాన్ని రాష్ట్రానికి ఇవ్వాల్సిందే అని ఆప్షన్లు లేవు అని అన్నారు. అందుకోసం కోర్టుకైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు.
ఇలాంటి విపత్కర సమయంలో రాష్ట్రాలను ఆదుకునేందుకు కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలని హరీష్ డిమాండ్ చేశారు. రాష్ట్రాలకు హక్కుగా రావాల్సిన సెస్ను ఎగ్గొట్టాలని కేంద్రం చూస్తోందని, ఆ రోజు జీఎస్టీలో చేరేటప్పుడే సెస్ తగ్గినా కేంద్రమే బాధ్యత తీసుకుని రాష్ట్రాలకు పరిహారం చెల్లిస్తామంటూ నాటి కేంద్ర ఆర్థిక మంత్రి దివంగత అరుణ్జైట్లీ చెప్పారని హరీశ్ గుర్తు చేశారు. ఎలాంటి షరతులు లేకుండా రాష్ట్రానికి రావాల్సిన పరిహారాన్ని ఇవ్వాలని కేంద్రాన్ని ఆయన కోరారు. కేంద్రం వందశాతం జీఎస్టీ పరిహారం చెల్లించాలని అన్నారు.