Chandrababu Calls Rajinikanth: రజనీకాంత్కు చంద్రబాబు ఫోన్.. వైసీపీ రచ్చపై సూపర్ స్టార్ కీలక వ్యాఖ్యలు
ఏపీలో రజనీకాంత్ పై వైసీపీ నేతలు విమర్శల డోస్ పెంచుతున్న క్రమంలో.. రజనీకాంత్కు చంద్రబాబు ఫోన్ చేశారు. వైసీపీ నేతల విమర్శలను పట్టించుకోవద్దంటూ రజనీకాంత్కి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
Chandrababu Calls Rajinikanth: ఏపీలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ వ్యవహారం రాజకీయ రచ్చను రేపుతోంది. రజనీపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తుండగా.. టీడీపీ నేతలు వారికి కౌంటర్ ఇస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఏపీలో రజనీకాంత్ ఇటీవల చేసిన వ్యాఖ్యల చుట్టూనే రాజకీయం తిరుగుతోంది. టీడీపీ వ్యవస్థాపకులు, నట సార్వభౌమ నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుతున్నారు. ఈ ఉత్సవాల అంకురార్పణ కార్యక్రమం విజయవాడలో వేడుకగా జరిగింది. ఈ వేడుకలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలక్రిష్ణలతో పాటు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా పాల్గొన్నారు.
ఈ వేడుకలో పాల్గొన్న రజనీకాంత్ సీనియర్ ఎన్టీఆర్తో అనుబంధాన్ని చెబుతూనే.. చంద్రబాబుపై పొగడ్తల వర్షం కురిపించారు. చంద్రబాబు విజన్ ఏంటో ప్రపంచం మొత్తానికి తెలుసని అన్నారు. చంద్రబాబుకు ఏపీని దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిపే శక్తిసామర్థ్యాలు ఉన్నాయని, అలాంటి వ్యక్తి ద్వారా అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. చంద్రబాబు తనకు 30ఏళ్లుగా స్నేహితుడని చెప్పిన రజనీ.. హైదరాబాద్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని అన్నారు. జనాల బాగోగులకోసం 24గంటలూ ఆలోచించే నేత చంద్రబాబు. ఆయన టాలెంట్ ఇక్కడి వారికంటే బయటివారికే ఎక్కువ తెలుసు. ఏపీకోసం చంద్రబాబు విజన్ 2047 రెడీ చేస్తున్నారని, అది కార్యచరణలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ దేశంలో ఎక్కడికో వెళ్లిపోతుందని రజనీకాంత్ చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తారు.
రజనీకాంత్ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైసీపీ నేతలు, వైసీపీ ప్రభుత్వంపై రజనీకాంత్ ఎలాంటి వ్యాఖ్యలు చేయనప్పటికీ.. చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తడాన్ని వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో తప్పుబట్టారు. పలువురు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు రజనీకాంత్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విమర్శలుసైతం చేశారు. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. రజనీకాంత్ ఫ్యాన్స్ సైతం వైసీపీ నేతల తీరుపై మండిపడుతున్నారు.
NTR 100 Years : ఎన్టీఆర్తో చిరంజీవి సినిమా.. రాజకీయాల్లోకి రావడానికి 2 ఏళ్ళ ముందు..
ఏపీలో రజనీకాంత్ పై వైసీపీ నేతలు విమర్శల డోస్ పెంచుతున్న క్రమంలో.. రజనీకాంత్కు చంద్రబాబు ఫోన్ చేశారు. వైసీపీ నేతల విమర్శలను పట్టించుకోవద్దంటూ రజనీకాంత్కి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. వైసీపీ నేతల వ్యాఖ్యలకు తాను విచారం వ్యక్తం చేస్తున్నానని ఫోన్ లో తెలిపారు. రజనీకాంత్ స్పందిస్తూ.. ఎవరెన్ని విమర్శలు చేసినా నావాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, నా అభిప్రాయం మారదని చంద్రబాబుకు స్పష్టం చేశారు. తన అభిమాన సంఘాలని సంయమనం పాటించమని విజ్ఞప్తి చేశానని రజనీ చంద్రబాబుతో చెప్పారు.