R Krishnaiah: ఆర్. కృష్ణయ్యతో మాణిక్‌రావ్ ఠాక్రే భేటీపై కాంగ్రెస్ నేతల రుసరుస.. కారణం అదేనా?

బీసీ నాయకులకు మాటమాత్రం చెప్పకుండా.. అసలు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఠాక్రే.. నేరుగా కృష్ణయ్యకు ఇంటికి వెళ్లడంపై అభ్యంతరం వ్యక్తమవుతోంది.

R Krishnaiah: ఆర్. కృష్ణయ్యతో మాణిక్‌రావ్ ఠాక్రే భేటీపై కాంగ్రెస్ నేతల రుసరుస.. కారణం అదేనా?

manikrao thakre meet r krishnaiah

R Krishnaiah – Thakre Meet : తెలంగాణ కాంగ్రెస్ బీసీ అస్త్రానికి పదునుపెడుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో రెండు అసెంబ్లీ సీట్లను బీసీలకు కేటాయిస్తున్నట్లు నిర్ణయించిన హస్తం పార్టీ.. ప్రత్యేకంగా బీసీ నేతలతో భేటీలు జరుపుతోంది. ఈ క్రమంలో వైసీపీ ఎంపీ, బీసీ ఉద్యమ నేత ఆర్. కృష్ణయ్యతో సమావేశమయ్యారు రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే (Manikrao Thakre). ఐతే ఈ భేటీయే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌ (Telangana Congress)లో అగ్గిరాజేస్తోంది. బీజేపీతో అంటకాగుతున్న వైసీపీకి చెందిన ఎంపీని కలవడంపై రుసరుసలాడుతున్నారు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు.. అసలు కృష్ణయ్య, ఠాక్రే ముచ్చట్ల వెనుక మర్మమేంటి?

వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని అవకాశాలను వాడుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది. ముఖ్యంగా బీసీ ఓటర్లను మచ్చిక చేసుకోవడంపై ప్రధానంగా దృష్టి పెట్టింది. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక (Karnataka) లో గెలుపును అందించిన బీసీలు.. తెలంగాణలో కూడా ప్రభావశీల వర్గంగా గుర్తించింద కాంగ్రెస్. రాష్ట్రంలో 50 శాతం ఉన్న బీసీలను మచ్చిక చేసుకుంటే విజయం సాధించవచ్చుననే లెక్కలు వేస్తోంది. త్వరలో బీసీ డిక్లరేషన్ ప్రకటించాలని నిర్ణయించింది కాంగ్రెస్ పార్టీ. బీసీ డిక్లరేషన్ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తోంది. సీనియర్ నేతలు వి.హనుమంతరావు, చెరుకు సుధాకర్, కత్తి వెంకటస్వామి వరుసగా చర్చలు జరుపుతున్నారు. బీసీ డిక్లరేషన్లో ఏయే అంశాలు ఉండాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు. ఇంతలో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్ రావు ఠాక్రే వైసీపీ ఎంపీ ఆర్ కృష్ణయ్యను కలవడంపై కాంగ్రెస్‌లో వాడివేడి చర్చకు దారితీసింది.

Also Read: హీరో నితిన్ పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం.. పోటీగా దిల్‌రాజు రెడీ!

బీసీ నాయకులకు మాటమాత్రం చెప్పకుండా.. అసలు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఠాక్రే.. నేరుగా కృష్ణయ్యకు ఇంటికి వెళ్లడంపై అభ్యంతరం వ్యక్తమవుతోంది. ఠాక్రే తీరు సొంత పార్టీ నేతలను అవమానపరిచేలా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఠాక్రే మాత్రం ఆర్.కృష్ణయ్య చేస్తున్న పోరాటం.. కాంగ్రెస్ లక్ష్యం ఒకటే అని సర్ది చెబుతున్నారు. కృష్ణయ్య 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున మిర్యాలగూడ నుంచి బరిలో దిగిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అయితే ఠాక్రే వివరణను కాంగ్రెస్ శ్రేణులు అంగీకరించడం లేదు. కృష్ణయ్య ప్రస్తుతం వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారని… ఇతర పార్టీ నేతలను రాష్ట్ర ఇన్‌చార్జి ఎలా కలుస్తారని ప్రశ్నిస్తున్నారు. ఏపీలో పార్టీని చావు దెబ్బ తీసిన జగన్ పార్టీకి చెందిన వ్యక్తితో ఎలా భేటీ అవుతారంటూ మండిపడుతున్నారు. ఠాక్రే చర్యలు పార్టీకి రాజకీయంగా నష్టం కలిగించేలా ఉన్నాయంటున్నారు.

Also Read: బీజేపీకి గూటికి మాజీ మంత్రి కృష్ణ యాదవ్?

అయితే తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఠాక్రే.. మరో పార్టీ ఎంపీతో భేటీ కావడం అంతా ఈజీగా జరిగే పనికాదంటూ కాంగ్రెస్లో చర్చ జరుగుతోంది. పార్టీ హైకమాండ్ ఆదేశాలతోనే కృష్ణయ్యతో ఠాక్రే భేటీ జరిగి ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. బీసీ అజెండాతోనే కృష్ణయ్యతో భేటీ అయ్యారని.. అందుకే సీనియర్ నేత వి.హనుమంతరావును వెంటబెట్టుకొని వెళ్లినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇలా ఎన్ని వివరణలు ఇచ్చినా కృష్ణయ్యతో భేటీని సహించడంలేదు కాంగ్రెస్ కార్యకర్తలు.. తెలంగాణకు చెందిన నేతకు వైసీపీ ఏ లెక్కల్లో రాజ్యసభ సీటు ఇచ్చిందో ఇప్పటివరకు తేలలేదు. అదే రాజకీయంగా మిలియన్ డాలర్ ప్రశ్నగా మారితే.. ఇప్పుడు కాంగ్రెస్ కూడా కృష్ణయ్యతో చర్చించడం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ కృష్ణయ్య చేతిలో అల్లావుద్దీన్ అద్భుత దీపం ఏమైనా ఉందా.. ఇక్కడ కాంగ్రెస్‌ను.. అక్కడ వైసీపీని గెలిపించే సత్తాయే ఉంటే గత ఎన్నికల్లో మిర్యాలగూడలో కృష్ణయ్య స్వయంగా ఓటమి పాలవడం ఏ లెక్కల్లో చూడాలని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు.