RCB : దురదృష్టం అంటే ఆర్సీబీదే..! ఆ జట్టు వదిలేసిన ఆటగాళ్లు ఇతర ఫ్రాంచైజీల్లో మెరుగైన ప్రదర్శన
Royal Challengers Bangalore : తదుపరి సీజన్లో ఏ ఆటగాడు రాణిస్తాడో ఊహించడంలో ఆర్సీబీ మేనేజ్మెంట్ విఫలమవుతూ వస్తోంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత ఆదరణ కలిగిన జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఒకటి. ఐపీఎల్ ఆరంభ సీజన్ అయిన 2008 నుంచి ఆ జట్టు ఆడుతోంది. అద్భుతమైన ఆటగాళ్లు ఆ జట్టు సొంతం. అయినప్పటికీ ప్రతీసారి కప్పు మనదే అంటూ సీజన్ను ఆరంభించడం చివరకు ఊసూరు మనిపించడం ఆ జట్టుకు అలవాటుగా మారింది. ఐపీఎల్ 2024 కోసం ఆర్సీబీ సన్నద్ధం అవుతోంది.
మినీ వేలంలో మెరుగైన ఆటగాళ్లను దక్కించుకునే ప్రయత్నాల్లో ఉంది. ఈ క్రమంలో జోష్ హేజిల్వుడ్, వనిందు హసరంగా, హర్షల్ పటేల్ వంటి ఆటగాళ్లను ఆ జట్టు వదులుకుంది. ఈ నిర్ణయం ఆర్సీబీ అభిమానులను ఆశ్చర్యపరిచింది. తదుపరి సీజన్లో ఏ ఆటగాడు రాణిస్తాడో ఊహించడంలో ఆర్సీబీ మేనేజ్మెంట్ విఫలమవుతూ వస్తోంది. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు ఆర్సీబీ వదిలివేసిన ఆటగాళ్లు మిగతా ప్రాంఛైజీల తరుపున తదుపరి సీజన్లో అద్భుతంగా రాణించారు. వారు ఎవరో ఓ సారి చూసేద్దాం..
కేఎల్ రాహుల్..
టీమ్ఇండియా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాహుల్ను 2016లో ఆర్సీబీ కొనుగోలు చేసింది. ఆ సీజన్లో 14 మ్యాచులు ఆడిన రాహుల్ నాలుగు హాఫ్ సెంచరీలు చేసి 397 పరుగులు చేశాడు. అయితే.. భుజ గాయంతో 2017 సీజన్కు దూరం అయ్యాడు. 2018లో రిటెన్షన్ లిస్ట్లో ఆర్సీబీ అతడిని అట్టి పెట్టుకోలేదు.. వదిలివేసింది. దీంతో పంజాబ్ కింగ్స్ అతడిని దక్కించుకుంది. 2018లో అతడు పంజాబ్ తరుపున 14 మ్యాచుల్లో 158.41 స్ట్రైక్ రేటుతో ఆరు హాఫ్ సెంచరీలు చేశాడు. ఇక 2020లో అయితే ఆరెంజ్ క్యాప్ను సొంతం చేసుకున్నాడు. ఆ సీజన్లో14 మ్యాచుల్లో ఓ సెంచరీ, ఐదు అర్ధశతకాల సాయంతో 670 పరుగులు చేశాడు.
ISPL : మార్చి 2 నుంచి ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్.. ఇలా నమోదు చేసుకోండి
షేన్ వాట్సన్..
ఆస్ట్రేలియా మాజీ ఆల్రౌండర్ అయిన షేన్ వాట్సన్ను 2016లో ఆర్సీబీ 9.5 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది. ఆ సీజన్లో అతడు 16 మ్యాచులు ఆడాడు 133.58 స్ట్రైక్రేటుతో 179 పరుగులు చేశాడు. బౌలింగ్లో 20 వికెట్లు పడగొట్టాడు. అయితే.. 2017 సీజన్లో అతడు అంతగా రాణించలేదు. పరుగులు చేయడంలో, వికెట్లు తీయడంలో విఫలం అయ్యాడు. దీంతో ఆర్సీబీ అతడిని వదులుకుంది. 2018లో వేలంలోకి వచ్చిన అతడిని చెన్నై సూపర్ కింగ్స్ రూ.4కోట్లకు సొంతం చేసుకుంది. ఈ సీజన్లో వాట్సన్ 15 మ్యాచుల్లో 154.59 స్ట్రైక్రేటుతో రెండు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 555 పరుగులు చేశాడు.
క్రిస్గేల్..
బెంగళూరు జట్టుతో వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్గేల్కు ఎంతో అనుబంధం ఉంది. చాలా ఏళ్ల పాటు ఆ జట్టుకు ఆడాడు. ఎన్నో మ్యాచుల్లో ఒంటి చేత్తో జట్టుకు విజయాలను అందించాడు. ఇక బెంగళూరు హోం గ్రౌండ్ అయిన చిన్నస్వామి స్టేడింలో 43.33 సగటుతో 5 సెంచరీలు, 19 అర్ధశతకాలతో 3,163 పరుగులు చేశాడు. 2018లో అతడు కేఎల్ రాహుల్తో కలిసి పంజాబ్లో చేరాడు. ఆ సీజన్లో తనదైన శైలిలో బ్యాటింగ్ చేసి 11 మ్యాచుల్లో ఓ సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలతో 368 పరుగులు చేశాడు. ఇక ఆ తరువాతి సీజన్లో అయితే.. తన అనుభవాన్ని అంతా ప్రదర్శించాడు. 13 మ్యాచుల్లో 153.60 స్ట్రైక్రేటుతో 490 పరుగులు చేశాడు.
ICC Champions Trophy 2025 : పాకిస్తాన్కు భారీ షాక్..? దుబాయ్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ..!
క్వింటన్ డికాక్..
quinton de kock
2019 ఐపీఎల్ సీజన్కు ముందు ఆర్సీబీ ట్రేడ్ విండో ద్వారా ముంబై ఇండియన్స్కు క్వింటన్ డికాక్ను బదిలీ చేసింది. 2019లో అతను ముంబై తరుపు 16 మ్యాచుల్లో 35.26 సగటుతో 529 పరుగులు సాధించాడు. అంతేనా 2020 సీజన్లో 16 మ్యాచుల్లో 35.92 సగటుతో 503 పరుగులు చేశాడు.
యుజ్వేంద్ర చాహల్..
2014 వేలంలో ఆర్సీబీ అతడిని సొంతం చేసుకుంది. ఇదే అతడికి తొలి ఐపీఎల్ సీజన్. తన స్పిన్ మాయాజాలంతో అందరిని ఆకట్టుకున్నాడు. 14 మ్యాచుల్లో 12 వికెట్లు తీశాడు. కొన్నాళ్ల పాటు ఆర్సీబీ తరుపున అతడు ఆడాడు. అయితే.. 2022లో ఆశ్చర్యకరంగా ఆర్సీబీ అతడిని విడుదల చేసింది. రాజస్థాన్ రాయల్స్ అతడిని 6.5కోట్లకు దక్కింది. 2022 సీజన్లో చాహల్ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడు. 17 మ్యాచుల్లో 27 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ను అందుకున్నాడు.
Dog Attacks Bowler : బౌలర్ వెంట పడిన కుక్క.. ఆ తరువాత ఏం జరిగిందంటే..? వీడియో
వేలానికి ముందు ఆర్సీబీ వదిలివేసిన ఆటగాళ్లు తరువాతి సీజన్లలో వేరే ప్రాంఛైజీల తరుపున అద్భుతంగా ఆడుతున్నారు. ఈ సారి జోష్ హేజిల్వుడ్, వనిందు హసరంగా, హర్షల్ పటేల్ వంటి ఆటగాళ్లను ఆర్సీబీ వదిలేసింది. వీరు తదుపరి సీజన్లో వేరే ప్రాంచైజీల తరుపున ఎలాంటి ప్రదర్శన ఇస్తారో వేచి చూడాల్సిందే.