KL Rahul : కేఎల్ రాహుల్ టీ20లకు పనికిరాడా..? జట్టులో చోటు దక్కకపోవడానికి కారణమేంటి..?
మరో సీనియర్ ఆటగాడు కేఎల్ రాహుల్ను ఎంపిక చేయకపోవడం పై ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
Team India cricketer KL Rahul : దాదాపు 14 నెలల విరామం తరువాత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు తిరిగి టీ20 జట్టులోకి వచ్చారు. జనవరి 11 నుంచి అఫ్గానిస్తాన్తో జరగనున్న మూడు మ్యాచుల టీ20 సిరీస్ కోసం బీసీసీఐ ఆదివారం జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ నాయకత్వంలో టీమ్ఇండియా బరిలోకి దిగనుంది. రోహిత్, కోహ్లీలు జట్టులోకి రావడం సంతోషాన్ని కలిగిస్తున్నప్పటికీ మరో సీనియర్ ఆటగాడు కేఎల్ రాహుల్ను ఎంపిక చేయకపోవడం పై ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
గాయం నుంచి కోలుకుని రీ ఎంట్రీ ఇచ్చిన తరువాత నుంచి కేఎల్ రాహుల్ ప్రదర్శన అద్భుతంగా ఉంది. వన్డే ప్రపంచకప్లో క్లిష్ట పరిస్థితుల్లోనూ బ్యాటింగ్లో పలు కీలక ఇన్నింగ్స్లు ఆడాడు. అంతేకాకుండా వికెట్ కీపింగ్లోనూ అదరగొట్టాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్లోనూ రాణించాడు. ఈ క్రమంలో మంచి ఫామ్లో ఉన్న రాహుల్ను ఎందుకు పక్కన పెట్టారనే ప్రశ్నలు వస్తున్నాయి.
జట్టులో చోటు లేదా..?
టెస్టులు, వన్డేల్లో కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్లో ఆడుతుండగా టీ20ల్లో ఓపెనర్గా బరిలోకి దిగుతున్నాడు. అయితే.. అఫ్గానిస్తాన్తో టీ20 సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్లు ఉన్నారు. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి వీరిద్దరిలో ఎవరో ఒకరు ఇన్నింగ్స్ ఆరంభించాల్సి ఉంది. దీంతో ఓపెనింగ్ స్లాట్లో ఎలాంటి ఖాళీ లేదు. కోహ్లీ, రోహిత్లు ఉండడంతో టాప్ ఆర్డర్లోనూ రాహుల్కు ప్లేస్ లేదు.
అటు సంజు శాంసన్, ఇటు జితేశ్ శర్మలను వికెట్ కీపర్లుగా ఎంపిక చేశారు. వీరిద్దరిలో తుది జట్టులో ఎవరు స్థానం దక్కించుకుంటారో వేచి చూడాల్సిందే. మిడిల్ ఆర్డర్లో రింకూసింగ్, శివమ్ దూబెలను తీసుకున్నారు. గత కొంతకాలంగా రింకూ సింగ్ అద్భుతమైన షినిషర్గా మారిన సంగతి తెలిసిందే.
విశ్రాంతి ఇచ్చారా..?
అఫ్గానిస్తాన్తో టీ20 సిరీస్ అనంతరం భారత జట్టు ఇంగ్లాండ్తో ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ ఆడనుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ)2023-2025 సైకిల్లో ఫైనల్కు చేరుకోవాలంటే భారత్కు ఈ సిరీస్ ఎంతో కీలకం. ఈ సిరీస్కు రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగేందుకే బుమ్రా, సిరాజ్ వంటి పేసర్లకు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. వికెట్ కీపింగ్తో పాటు మిడిలార్డర్లో కీలకమైన కేఎల్ రాహుల్ సైతం నూతనోత్సాహంతో ఉండేందుకు విశ్రాంతి ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇదే జట్టుతో టీ20 ప్రపంచకప్లో బరిలోకి..!
జూన్లో జరగనున్న టీ20 ప్రపంచకప్ 2024 ముందు టీమ్ఇండియా ఆడనున్న చివరి టీ20 సిరీస్ ఇదే కావడం గమనార్హం. ఆ తరువాత ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్, ఐపీఎల్ 2024 జరగనుంది. అఫ్గానిస్తాన్తో సిరీస్కు ఎంపిక చేసిన జట్టుతోనే టీ20 ప్రపంచకప్లో బరిలోకి దిగే అవకాశాలు చాలా స్పల్పంగా ఉన్నాయి.
Rishabh Pant : రిషబ్ పంత్ ఇంట త్వరలో మోగనున్న పెళ్లి బాజాలు.. 9 ఏళ్ల నుంచి లవ్..
ఐపీఎల్లో రాణిస్తే టీ20 ప్రపంచకప్లోనూ చోటు దక్కించుకోవచ్చు. ఐపీఎల్లో లక్నో కెప్టెన్గా కేఎల్ ఆడుతున్నాడు. ఐపీఎల్లో సత్తా చాటితే పొట్టి ప్రపంచకప్లో ఆడేందుకు రాహుల్కు మార్గం సుగమమం అవుతుంది.
అఫ్గానిస్తాన్తో సిరీస్కు భారత జట్టు ఇదే..
రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్ , అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.