టీ20 జట్టులోకి కోహ్లీ, రోహిత్ల ఎంపిక పై సురేశ్ రైనా ఆసక్తికర వ్యాఖ్యలు
టీమ్ఇండియా స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను అఫ్గానిస్తాన్తో టీ20 సిరీస్కు ఎంపిక చేయడం పై భారత మాజీ ఆటగాడు సురేశ్ రైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు
Suresh Raina : టీమ్ఇండియా స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను అఫ్గానిస్తాన్తో టీ20 సిరీస్కు ఎంపిక చేయడం పై భారత మాజీ ఆటగాడు సురేశ్ రైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వీరిద్దరి ఎంపిక చేయడాన్ని అతడు సమర్థించాడు. ఈ నిర్ణయంతో టీ20 ప్రపంచకప్2024లో భారత విజయావకాశాలు మరింత మెరుగు అయ్యాయని చెప్పాడు.
టీ20 ప్రపంచకప్ 2022 సెమీఫైనల్ మ్యాచులో విరాట్, రోహిత్ లు చివరి సారిగా టీమ్ఇండియా తరుపున టీ20 మ్యాచ్ ఆడారు. 2024 టీ20ప్రపంచకప్ ముందు భారత జట్టు ఆడనున్న చివర సిరీస్కు ముందు వీరిద్దరికి సెలక్టర్లు చోటు ఇచ్చారు. అఫ్గానిస్తాన్తో టీ20 సిరీస్కు వీరిద్దరిని ఎంపిక చేయడాన్ని పలువురు స్వాగతిస్తుండగా మరికొందరు మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. భారత జట్టు తిరోగమన దిశగా వెలుతుందని వ్యాఖ్యానించారు.
దీనిపై రైనా స్పందించాడు. సీనియర్ ఆటగాళ్లను ఎంపిక చేయడాన్ని ప్రశంసించారు. ఇది ఒక తెలివైన నిర్ణయంగా చెప్పాడు. టీ20 ప్రపంచకప్ 2024 కు వెండీస్, యూఎస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ‘మీరు ఒక్కసారి టీ20 ప్రపంచకప్ జరగనున్న ప్రపంచకప్ వేదికలను గమనించండి. వికెట్ల కాస్త గమ్మత్తుగా ఉంటాయి. అలాంటి చోట రోహిత్, కోహ్లీ అనుభవం భారత్కు ఎంతో అవసరం. ఇక విరాట్ టీ20 క్రికెట్లో 12వేల పరుగులకు మైలురాయికి దగ్గరగా ఉన్నాడు.’ అని రైనా అన్నాడు.
Also Read: ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్కు షెమీ సిద్ధమయ్యాడా? బీసీసీఐ వర్గాలు ఏం చెప్పాయంటే..
వన్డే ప్రపంచకప్లో వీరిద్దరి ఫామ్ అద్భుతంగా ఉందని, ఇక కెప్టెన్గా రోహిత్ డ్రెస్సింగ్ రూమ్లో తనదైన ముద్రను వేశాడన్నాడు. ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్విజైస్వాల్లు వన్డౌన్లో విరాట్ కోహ్లీ లు రావాలని సూచించాడు. ప్రపంచకప్ పిచ్లు సవాల్లను విసురుతాయన్నాడు. జైస్వాల్, రింకూ సింగ్ లేదా శుభ్మన్ గిల్ వంటి యువ ఆటగాళ్లు నిర్భయంగా క్రికెట్ ఆడుతారని, వీరికి రోహిత్, కోహ్లీ వంటి అనుభవజ్ఞులు తోడైతే భారత్కు తిరుగుఉండదని అన్నారు. ముఖ్యంగా లక్ష్యాన్ని ఛేదించాల్సిన సమంలో వీరికి పాత్ర చాలా కీలకమన్నాడు.