కాంగ్రెస్ హైకమాండ్‌కు డబ్బు సంచులు మోస్తున్నారు- బాల్క సుమన్

మళ్ళీ కుంగిన పిల్లర్ల దగ్గరకు నీళ్లు మళ్లించి డ్యామ్ బాగోలేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీని వెనుక కుట్రలు జరుగుతున్నట్లు అనుమానం వస్తుంది

కాంగ్రెస్ హైకమాండ్‌కు డబ్బు సంచులు మోస్తున్నారు- బాల్క సుమన్

Balka Suman

Balka Suman : కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ నేత బాల్క సుమన్. ప్రత్యేక విమానాల్లో ఢిల్లీకి పోతున్నారని, డబ్బు సంచులు మోసుకుపోతున్నారని బాల్క సుమన్ అన్నారు. ఢిల్లీలోని కాంగ్రెస్ హైకమాండ్ కు డబ్బు సంచులు మోస్తున్నారని ఆయన ఆరోపించారు.

”గడిచిన 15 రోజుల్లో నలుగురు గురుకుల విద్యార్థినిలు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించ లేదు. అక్కడ ప్రజా సంఘాలు ధర్నాలు చేస్తున్నా మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదు. యూట్యూబ్ ఛానెళ్లు, మేధావులకు ఈ విద్యార్థుల ఆత్మహత్యలు కనిపించడం లేదా? మేధావులు స్పందించాలి. తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటే.. రాష్ట్రంలో సమస్యలు లేనట్టు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారు. రాష్ట్రంలో అనేక హామీలు ఇచ్చి ఒక్క హామీ మాత్రమే అమలు చేశారు. అది మహిళకు ఉచిత బస్ ప్రయాణం. చాలా గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. ఇప్పటివరకు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. కానీ మేము ఇచ్చిన నోటిఫికేషన్లకు నియామకపత్రాలు ఇస్తున్నారు.

స్టాఫ్ నర్స్ పోస్టులు మేమే ఇచ్చాము. గురుకుల పోస్టులు మేమే ఇచ్చాము. అవన్నీ ఆయన ఖాతాలో వేసుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయలేదు. ఒక్క ఫ్రీ బస్ మాత్రమే పెట్టారు. అది కూడా అనేక గ్రామాలకు బస్సులు లేవు. ఎన్నికల షెడ్యూల్ ఎంత తొందరగా వస్తే అంత మేలు అన్నట్లు చూస్తున్నారు ఈ ముఖ్యమంత్రి. రోజూ వచ్చేటప్పుడు పెద్దమ్మ తల్లికి ఎన్నికల షెడ్యూల్ తొందరగా రావాలని అద్దం దించి మొక్కుతున్నాడంట. ఎందుకంటే షెడ్యూల్ వస్తే హామీలు ఎగ్గొట్టచ్చని చూస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

ఒక్క మేడిగడ్డ డ్యామ్ ను బూచిగా చూపెట్టి పదే పదే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. 3 పిల్లర్లు కుంగాయి. అయితే వాటి పునరుద్ధరణ పనులు చేయకుండా, నాటి మా ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. మేడిగడ్డ డ్యామ్ పై మాకు అనుమానం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు కుంగిన పిల్లర్ల దగ్గరకు మళ్ళీ నీళ్లు వదులుతున్నారు.

డ్యామ్ సేఫ్టీ వాళ్ళు వస్తున్నారు, పోతున్నారు. మళ్ళీ కుంగిన పిల్లర్ల దగ్గరకు నీళ్లు మళ్లించి డ్యామ్ బాగోలేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీని వెనుక కుట్రలు జరుగుతున్నట్లు మాకు అనుమానం వస్తుంది. రాజకీయపరంగా కోపం ఉంటే మాపై తీర్చుకోండి. కానీ రైతులపై మీ కోపం చూపించకండి. ఇప్పటికే అనేక ఎకరాలకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. వాళ్లకు నీళ్లు ఇవ్వండి. మా ప్రాంతంలో 15 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే కాళేశ్వరం ప్రాజెక్టు వృథా అని చూపించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చూస్తోంది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నేను సూటిగా అడుగుతున్నా.. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీ లతోపాటు 420 హామీలను వెంటనే అమలు చేయండి. పార్లమెంట్ ఎన్నికల ముందే అమలు చేయండి. ఎందుకంటే ఎన్నికల కోడ్ పేరు తో మీరు ఇచ్చిన హామీలు అమలు చేయలేము అని చెప్పే ప్రయత్నం చేస్తోంది.

అసలు కిషన్ రెడ్డితో ఎవరన్నారు మేము అన్నామా? ఎందుకు బీజేపీ నాయకులు ఎగిరెగిరి పడుతున్నారు? పదేపదే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇతర నాయకులు బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు అంటున్నారు. అసలు బీజేపీతో పొత్తు పెట్టుకుంటాం అని ఎవరు చెప్పారు? మాది సెక్యులర్ పార్టీ. మా కేసీఆర్ సెక్యులర్ నాయకుడు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటామని ఎవరు అన్నారు? వాళ్ళే మీడియా కు లీకులు ఇస్తున్నారు. వాళ్లే పేపర్ లో రాపిస్తున్నారు. వాళ్ళే వచ్చి మీడియాతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు అంటున్నారు” అని మండిపడ్డారు బాల్క సుమన్.

Also Read : బీఆర్ఎస్ ఎంపీలు మాతో ట‌చ్‌లో ఉన్నారు.. తెలంగాణలో పొత్తులపై లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు