చంద్రబాబు కోసమే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టారు : ఎంపీ మార్గాని భరత్
కందుల దుర్గేష్ లాంటి మంచి నేతలు కూడా జనసేన పక్కన పెట్టింది. అలాంటి వ్యక్తులు వైసీపీలో ఉంటే ఇప్పటికీ ఎమ్మెల్యే అయ్యి మంత్రి పదవి కూడా దక్కేది.
Bharat Margani జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నమ్ముకుని ఉన్న నేతలంతా ఈరోజు టిక్కెట్ లేక రోడ్డున పడ్డారని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ కేవలం చంద్రబాబు కోసమే జనసేన పార్టీ పెట్టారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఎవరూ ఆపలేరని విశ్వాసం వ్యక్తం చేశారు.
పవన్ పార్టీ పెట్టి 10 ఏళ్ళు అయింది ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాడని కార్యకర్తలు ఎదురు చూశారు. అంత ఆదరణ ఉన్న పవన్ కళ్యాణ్.. చంద్రబాబు కొమ్ముకాస్తున్నారు. ప్రజలు జనసేన, టీడీపీకి ఎందుకు ఓట్లేయ్యాలి? కందుల దుర్గేష్ లాంటి మంచి నేతలు కూడా జనసేన పక్కన పెట్టింది. అలాంటి వ్యక్తులు వైసీపీలో ఉంటే ఇప్పటికీ ఎమ్మెల్యే అయ్యి మంత్రి పదవి కూడా దక్కేది. దుర్గేష్ మా పార్టీలోకి వస్తే కచ్చితంగా అలాంటి వ్యక్తులను ఆహ్వానిస్తామని ఎంపీ భరత్ వ్యాఖ్యానించారు.
కాగా, టీడీపీ సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజమండ్రి రూరల్ సీటును కందుల దుర్గేష్ ఆశించారు. రాజమండ్రి రూరల్ నుంచి జనసేన పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ హామీ ఇవ్వడంతో దుర్గేష్ చాలా కాలం నుంచి ఈ నియోజకవర్గంలో పనిచేస్తున్నారు. అయితే బుచ్చయ్య చౌదరి పోటీ నుంచి తప్పుకోవడానికి నిరాకరించడంతో నిడదవోలు నుంచి పోటీ చేయాలని దుర్గేష్ ను తాజాగా ఆదేశించినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎంపీ భరత్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
Also Read: స్పీకర్ సంచలన నిర్ణయం.. ఆ 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు