చంద్రబాబు.. నీకు చేతనైంది చేసుకో.. జోగి రాజీవ్ అరెస్టుపై పేర్ని నాని ఫైర్

మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి ర‌మేశ్ కుమారుడు జోగి రాజీవ్ ను ఏసీబీ అధికారులు అరెస్టు చేయడం పట్ల మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు.. నీకు చేతనైంది చేసుకో.. జోగి రాజీవ్ అరెస్టుపై పేర్ని నాని ఫైర్

Former minister Perni Nani

Jogi Rajeev Arrest : మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి ర‌మేశ్ కుమారుడు జోగి రాజీవ్ ను మంగ‌ళ‌వారం ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. రాజీవ్ అరెస్టును మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రంగా ఖండించారు. ఈ మేర‌కు ఆయ‌న మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ చంద్ర‌బాబు ప్ర‌భుత్వం తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వైసీపీ నేతల్ని అక్రమ అరెస్టులు చెయ్యడానికే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందా అంటూ ప్ర‌శ్నించారు. ప్రశ్నించే గొంతులని నొక్కే పనితప్ప ప్రజలకి ఉపయోగపడేది ఒక్కటి చెయ్యలేదు. 60 రోజుల్లో ఒక్క పథకం అమలు చెయ్యకుండా కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని పేర్ని నాని తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Also Read : తప్పు చేసివుంటే విజయవాడ నడిబొడ్డున ఉరేసుకుంటా: జోగి రమేశ్

అగ్రిగోల్డ్ ఆస్తులు అన్ని జప్తులో ఉన్నాయి. ప్రభుత్వం జీవో లు ఇచ్చింది. జోగి రమేష్ కుమారుడు కొనుగోలు చేసిన స్థ‌లంకు సరిహద్దుల్లోకూడా అగ్రిగోల్డ్ ఆస్తులు లేవు. అగ్రిగోల్డ్ ఆస్తులకు జోగి రాజీవ్ కొనుగోలు చేసిన స్థలానికి సంబంధం లేద‌ని పేర్ని నాని అన్నారు. పేపర్ ప్రకటన ఇచ్చి కొనుగోలు చేశారు. పేపర్ ప్రకటన ఇచ్చి అమ్మారు. చట్ట ప్రకారమే భూమి లావాదేవీ జరిగింది. చట్ట వ్యతిరేకంగా ఏమీ జరగలేదు. రాజకీయంగా జోగి రమేష్ ను ఏమీ చెయ్యలేక ఇలాంటి అక్రమ కేసు పెట్టారంటూ పేర్ని నాని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 175 నియోజకవర్గాల్లో ఉన్న అందరినీ జైలులో పెట్టేయ్యండి. చంద్రబాబు.. నీకు చేతనైనది చేసుకో.. మా పోరాటాలు చేస్తూనే ఉంటాం. జోగి రమేష్ కు అమ్మిన వాళ్ళు ముద్దాయిలుగా లేరు. కొనుకున్న వాళ్ళు లేరు. జోగి రమేశ్ ఒక్క‌డినే ముద్దాయిగా చేర్చారు. అక్రమ అరెస్టుల వల్ల మీకు మానసిక ఆనందం తప్ప మ‌రొక‌టి ఉండ‌దు. చివ‌రికి న్యాయం గెలుస్తుంది. ఈ వ్యవహారంలో జోగి రమేష్ కుటుంబం బాధితులుని పేర్ని నాని అన్నారు.

Also Read : వైసీపీ నేత జోగి రమేశ్ కుమారుడు అరెస్ట్.. చంద్రబాబు ప్రభుత్వంపై మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. జోగి రమేష్ గొంతు నొక్కడానికి ఆయ‌న‌ కుమారుడిని అరెస్టు చేశారు. రాజీవ్ అరెస్టును వైసీపీ తీవ్రంగా ఖండిస్తుంద‌ని అన్నారు. 2022 నవంబర్ 22 తేదీన పేపర్ లో ప్రకటన ఇచ్చి భూములు కొనుగోలు చేశారు. స్థలం అమ్మేటప్పుడు కూడా పేపర్ లో ప్రకటన ఇచ్చి అమ్మకం జరిగింది. జోగి రమేష్ పై కేసు పెట్టడానికి లేకపోవడంతో కుమారుడిపై తప్పుడు కేసు పెట్టారు. అక్రమ అరెస్టులకు మేము భయపడము. జోగి కుటుంబానికి వైఎస్ జగన్ అండగా ఉంటారు. న్యాయపరంగా పోరాటం చేస్తామ‌ని చెప్పారు.