Andhra Pradesh : ఏపీలో ఎంపీపీ ఎలక్షన్స్..చేతులు ఎత్తి ఎన్నుకునే విధానం
ఏపీలో ఎంపీపీ ఎన్నికలు ఇవాళ జరుగనున్నాయి. ఎంపీపీతో పాటు ప్రతి మండలానికి ఒకరు చొప్పున కో ఆప్టెడ్ సభ్యునితో పాటు మండల ఉపాధ్యక్ష పదవులకు కూడా ఎన్నికలు నిర్వహించనున్నారు.
MPP elections in AP : ఏపీలో మండల పరిషత్ అధ్యక్షుల(ఎంపీపీ) ఎన్నికలు ఇవాళ జరుగనున్నాయి. ఎంపీపీతో పాటు ప్రతి మండలానికి ఒకరు చొప్పున కో ఆప్టెడ్ సభ్యునితో పాటు మండల ఉపాధ్యక్ష పదవులకు కూడా ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎంపీటీసీ సభ్యులుగా ఎన్నికైన వారు చేతులు ఎత్తే విధానంలో ఈ ఎన్నికలను జరుగనున్నాయి. ఇందుకు సంబంధించి అన్ని చోట్ల ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రత్యేక సమావేశాల నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్తో పాటు జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. నిర్ణీత కోరం ప్రకారం మండల పరిధిలో కొత్తగా ఎన్నికైన మొత్తం ఎంపీటీసీ సభ్యుల్లో కనీసం సగం మంది హాజరైతేనే ఎంపీపీ, ఉపాధ్యక్ష పదవితో పాటు కో ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక జరుగుతుందని అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో మొత్తం 10,047 ఎంపీటీసీ స్థానాలకుగానూ 9,583 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. మధ్యాహ్నం 1 గంటకు జరిగే ప్రత్యేక సమావేశాల్లో ఎన్నిక ప్రక్రియ జరుగుతుంది. ఏకగ్రీవంగా ఎన్నికైన వారితో సహా కొత్తగా ఎన్నికైన సభ్యులందరూ ఆ సమావేశంలోనే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత కో ఆప్టెడ్ సభ్యుని ఎన్నిక జరుగనుంది. సాయంత్రం 3 గంటలకు మరోసారి సమావేశం నిర్వహించి, తొలుత ఎంపీపీ పదవికి ఆ తర్వాత ఉపాధ్యక్ష పదవికి ఎన్నిక నిర్వహిస్తారు. ఉదయం 10 గంటల నుంచే ఎన్నికలు ప్రారంభం అవుతాయి.
Registrations : ఇక సచివాలయాల్లోనే భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లు.. జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఏదైనా కారణం వల్ల కో ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక జరగని పక్షంలో ఆయా మండలాల్లో తదుపరి జరగాల్సిన ఎంపీపీ, ఉపాధ్యక్ష ఎన్నికలు వాయిదా పడుతాయి. ఒకవేళ కో ఆప్టెడ్ ఎన్నిక పూర్తై, ఎంపీపీ ఎన్నికకు ఆటంకం ఏర్పడితే, సంబంధిత మండలంలో ఆ తర్వాత జరగాల్సిన ఉపాధ్యక్ష పదవికి ఎన్నిక వాయిదా పడుతుందని రాష్ట్ర కమిషన్ కార్యాలయ అధికారులు పేర్కొన్నారు.
ఇవాళ జరగాల్సిన ఎన్నిక వాయిదా పడిన మండలాల్లో రేపు ఎన్నిక నిర్వహించుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలంసాహ్ని అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. రెండో రోజు కూడా వివిధ కారణాలతో కోఆప్టెడ్ సభ్యుల ఎన్నిక వాయిదా పడినప్పటికీ, సరిపడా కోరం ఉంటే ఎంపీపీ, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికలు నిర్వహించవచ్చని ఉత్తర్వులు జారీ చేశారు.