AP Cabinet : ఏపీ కేబినెట్కు కౌంట్డౌన్.. కొత్తమంత్రివర్గంలో ఎవరెవరికి చోటు.. తేలేది నేడే..!
AP Cabinet : ఏపీలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు కౌంట్డౌన్ మొదలైంది. మరికొన్ని గంటల్లో ప్రస్తుత మంత్రులందరూ మాజీలుగా మారిపోనున్నారు.

Ap Cabinet
AP Cabinet : ఏపీలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు కౌంట్డౌన్ మొదలైంది. మరికొన్ని గంటల్లో ప్రస్తుత మంత్రులందరూ మాజీలుగా మారిపోనున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీలో కొత్త మంత్రిమండలి కొలువుదీరేందుకు ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటన ముగిసిన తర్వాత సీఎం జగన్ మంత్రివర్గ మార్పులపై వివరణ ఇచ్చారు. గవర్నర్తో సమావేశంలో సీఎం జగన్ కొత్తమంత్రివర్గ కూర్పుపై వివరాలు తెలియజేశారు. ఈ నెల 11న కొత్త కేబినెట్ ప్రమాణ స్వీకారానికి గవర్నర్ను సీఎం జగన్ ఆహ్వానించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర కేంద్ర మంత్రులతో జగన్ సమావేశమై చర్చించిన పలు అంశాలను గవర్నర్కు సీఎం వివరించారు. గురువారం (ఏప్రిల్ 7) మధ్యాహ్నమే ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది.
ప్రస్తుత జగన్ కేబినెట్ లో మంత్రులుగా ఉన్నవారికి ఇదే చివరి సమావేశం కానుంది. జగన్ కేబినెట్లో కొందరిని తొలగించి కొత్తవారికి మంత్రి పదవులు అప్పగించనున్నట్టు సీఎం ప్రకటించారు. ప్రస్తుత మంత్రివర్గంలో ఎవరు ఉంటారు? ఎవరు ఉద్వాసన పలకునున్నారో నేటితో తేలిపోనుంది. కొత్తగా ఎవరెవరికీ మంత్రివర్గంలో చోటు కల్పిస్తారనే చర్చ ఏపీ వ్యాప్తంగా జోరుగా కొనసాగుతోంది. ఈ రోజు జరగబోయే భేటీలో ఎవరు మంత్రి వర్గంలో చోటు కోల్పోనున్నారో తేలనుంది. ప్రస్తుత మంత్రుల్లో ఎవరు కొనసాగుతారనే దానిపై సీఎం జగన్ క్లారిటీ ఇవ్వనున్నారు. మంత్రి వర్గ విస్తరణ ఎందుకు చేయాల్సి వస్తుందో కూడా సీఎం వివరణ ఇవ్వనున్నారు. జగన్ కేబినెట్లో మంత్రులుగా కొందరిని మాత్రమే ఎందుకు కొనసాగించాలనుకుంటున్నారో కూడా సీఎం జగన్ వివరణ ఇవ్వనున్నారు.

Ap Cabinet Andhra Pradesh Cabinet To Meet Today In Amaravati
ఇదేరోజున సమావేశం అనంతరం ప్రస్తుత మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయనున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి తమ రాజీనామా పత్రాలను అందజేయనున్నారు. ఏప్రిల్ 10న కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చేవారికి సీఎం ముందుగా సమాచారం అందించనున్నారు. ఈనెల 11న మంత్రి వర్గ విస్తరణ, అదే రోజు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా.. మంత్రి వర్గంలో తీసుకొనేవారి విషయంలో సీఎం జగన్ ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రాంతాలు, జిల్లాలు, కులాల సమీకరణలను దృష్టిలో ఉంచుకొని మంత్రి వర్గంలో కొత్తవారికి అవకాశం కల్పించనున్నట్టు తెలుస్తోంది. ఏపీ కేబినెట్లో చోటుపై ఆశావహులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మంత్రి పదవి ఉన్నా.. తొలగించినా స్వాగతిస్తామని అంటున్నారు మంత్రులు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సీఎం ఇష్టమని.. ఆయన కేబినెట్లో ఎవరు ఉండాలనేది నిర్ణయించుకునే స్వేచ్ఛ ఆయనకే ఉందని అంటున్నారు. మంత్రులుగా తమను కొనసాగించినా లేదా కొత్తవారికి అవకాశం ఇచ్చినా సంతోషమేనని అంటున్నారు. సీఎం తమకు ఎలాంటి బాధ్యత అప్పగించినా చేసేందుకు రెడీ అంటున్నారు.