బొత్స సత్యనారాయణ ఇంట్లో విషాదం

  • Published By: murthy ,Published On : August 16, 2020 / 07:32 AM IST
బొత్స సత్యనారాయణ ఇంట్లో విషాదం

ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. బొత్స మాతృమూర్తి ఈశ్వరమ్మ(84) ఆదివారం తెల్లవారుఝూమున కన్ను మూశారు. గత నెలరోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆమె విశాఖపట్నంలోని పినాకిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్లవారు ఝూమున తుదిశ్వాస విడిచారు.



ఆమెకు ఏడుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు సంతానం. మంత్రి బొత్స సత్యనారాయణ పెద్ద కుమరుడు కాగా రెండో కుమారుడు బొత్స అప్పల నరసయ్య ఎమ్మెల్యేగా ఉన్నారు.  విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం నుంచి బొత్స సత్యనారాయణ గెలుపొందగా.. గజపతినగరం నియోజకవర్గం నుంచి నరసయ్య ఎమ్మెల్యేగా  విజయం సాధించారు. విజయనగరంలోని స్వర్ఘధామంలో ఆమె అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నాం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.


ఈశ్వరమ్మ మరణంతో బొత్స కుటుంబంలో  విషాదం నెలకొంది. ఇంటి పెద్ద మరణించటంతో  కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈశ్వరమ్మ ఇకలేరన్న విషయం తెలుసుకున్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సహా… పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు.. బొత్సకు ఫోన్ చేసి పరామర్శించారు.