గంటాకు షాక్.. ఆస్తులు వేలం.. రూ.248కోట్ల కోసం!
మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు షాక్ ఇచ్చింది ఇండియన్ బ్యాంకు. బ్యాంకు నుంచి గతంలో రూ.248కోట్ల మేర రుణం తీసుకున్న ప్రత్యూష కంపెనీ బ్యాంకుకు రుణం కట్టకుండా నాలుగేళ్ల నుంచి ఉండడంతో.. చెల్లించకుండా ప్రత్యూష డైరెక్టర్లు ముఖం చాటేయగా బకాయిలను రాబట్టే క్రమంలో గంటా ఆస్తులను వేలం వెయ్యాలని నిర్ణయం తీసుకుంది బ్యాంకు యాజమాన్యం.
విశాఖ నగరంతో పాటు పలు ప్రాంతాల్లో బ్యాంకు గ్యారెంటీగా పెట్టిన ఆస్తులను నవంబర్ 25వ తేదీన వేలం వేయ్యాలని బ్యాంకు నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన e-AUCTION సేల్ నోటీసును హైదరాబాద్లోని ఇండియన్ బ్యాంకు సామ్(ఎస్ఏఎం) బ్రాంచ్ జారీ చేసింది. నాలుగేళ్లుగా అప్పు చెల్లించని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా బ్యాంకు నోటీసులో వెల్లడించింది.
ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్ఫ్రా సంస్థ గతంలో తీసుకున్న రుణానికి సంబంధించి రూ.141.68 కోట్లు మేర బకాయి పడింది. దీనిని చెల్లించాలని ఇండియన్ బ్యాంకు 2016, అక్టోబరు 4వ తేదీన తొలుత నోటీసులు పంపగా.. అప్పు చెల్లించే విషయంలో కంపెనీ చేతులెత్తేసింది. తదుపరి వడ్డీ సహా ఆ బకాయి రూ.248.03 కోట్లకు (రూ.248,03,85,547) చేరుకుంది.
దీంతో రుణం కోసం కుదువ పెట్టిన ప్రత్యూష గ్రూప్ ఆస్తులను వేలం వేయాలని బ్యాంకు నిర్ణయం తీసుకుంది. రుణాల చెల్లింపునకు బాధ్యులుగా గంటా శ్రీనివాసరావుతో పాటు పీవీ ప్రభాకరరావు, పీవీ భాస్కరరావు, నార్ని అమూల్య, పి.రాజారావు, కేబీ సుబ్రహ్మణ్యం, ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్ఫ్రా, ప్రత్యూష గ్లోబల్ ట్రేడ్ లిమిటెడ్ సంస్థలను వేలం వెయ్యనున్నట్లుగా ఇండియన్ బ్యాంకు తన నోటీసులో స్పష్టం చేసింది.
అయితే 2011వ సంవత్సరంలోనే సంస్థ నుంచి తప్పుకున్నట్లుగా గంటా ప్రకటించారు. అయితే వేలం వేయనున్న ఆస్తుల్లో గంటా శ్రీనివాస్ ఆస్తులు కూడా ఉన్నాయి. విశాఖలోని గంగులవారి వీధిలో ప్రత్యూష అసోసియేట్స్ పేరుతో ఉన్న కమర్షియల్ భవనం(దీని రిజర్వు విలువ రూ.154.72 లక్షలు) గంటా శ్రీనివాసరావు పేరుతో విశాఖలోని బాలయ్యశాస్త్రి లేఅవుట్లో త్రివేణి టవర్స్లోనున్న ఫ్లాట్, అదేచోట పి.రాజారావు పేరుతో ఉన్న 444 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న మరో ఫ్లాట్ (వీటి విలువ రూ.150.75 లక్షలు), ఎండాడ రెవెన్యూ గ్రామ పరిధిలో రుషికొండ గ్రామం వద్ద కేబీ సుబ్రహ్మణ్యం పేరుతో ఉన్న 503.53 చదరపు గజాల స్థలం (దీని రిజర్వు విలువ రూ.171.21 లక్షలు)
ఇక ప్రత్యూష అసోసియేట్స్ పేరుతో ద్వారకానగర్ మొదటి లైన్లోని శ్రీశాంతా కాంప్లెక్స్లో ఉన్న ఆస్తి (రిజర్వు విలువ రూ.94.19 లక్షలు), పీవీ భాస్కరరావు పేరుతో తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో షోలింగ నల్లూరులో 6వేల చదరపు గజాల భూమి (రూ.240 లక్షలు), ప్రత్యూష అసోసియేట్స్ షిప్పింగ్ సంస్థకు తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నగరంలోని సాంబమూర్తినగర్లో ఉన్న 1101 చదరపు అడుగుల విస్తీర్ణంలోనున్న ఆస్తి (రూ.308.46 లక్షలు), అదే సంస్థకు అక్కడే ఉన్న మరో 333.33 చదరపు గజాల విస్తీర్ణంలోని ఆస్తి (రూ.66.67 లక్షలు), ఆనందపురం మండలం వేములవలసలో పీవీ భాస్కరరావు పేరుతో ఉన్న 4.61 ఎకరాల భూమి (రూ.2103.07 లక్షలు), ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్ఫ్రా సంస్థకు హైదరాబాద్లోని మణికొండలోని ల్యాంకో హిల్స్లో ఉన్న ఫ్లాట్ (రూ.247.69 లక్షలు)