చంద్రబాబు ముందు పెద్ద సవాల్, విజయనగరంలో అసెంబ్లీ ఇంఛార్జిల మార్పు

  • Published By: naveen ,Published On : October 24, 2020 / 12:09 PM IST
చంద్రబాబు ముందు పెద్ద సవాల్, విజయనగరంలో అసెంబ్లీ ఇంఛార్జిల మార్పు

vizianagaram assembly incharges change: విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జిల మార్పుపై టీడీపీ అధిష్టానం విస్తృతంగా చర్చలు జరుపుతోందని అంటున్నారు. కొత్త ఇన్‌ఛార్జిల నియామకం, పాతవారిని కొనసాగించడం వంటి కీలక నిర్ణయాలపై తర్జనభర్జనలు పడుతోందని టాక్‌. ఒకవేళ కొత్తవారిని నియమిస్తే తలెత్తే పరిణామాలు, పాతవారిని యథావిధిగా కొనసాగించే నియోజకవర్గాల విరాలను సేకరించే పనిలో పార్టీ అధిష్టానం ఉందంటున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఉన్న కీలక నేతలు, పార్టీ శ్రేణుల అభిప్రాయాలను కూడా తెలుసుకునే ప్రయత్నాలు మొదలయ్యాయట.




కిమిడి నాగార్జున పరిస్థితి ఏంటి?
నియోజకవర్గ ఇన్‌ఛార్జిలుగా వ్యవహరించే వారినే రాబోయే ఎన్నికల్లో అధిష్టానం ఎమ్మెల్యే అభ్యర్థులుగా గుర్తిస్తుందని భావిస్తున్నారు. దీంతో వారి నియామకం రసవత్తరంగా మారింది. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో వాడీవేడిగా రాజకీయ చర్చలు మొదలయ్యాయి. ప్రధానంగా అందరి దృష్టి చీపురుపల్లి, నెల్లిమర్ల, గజపతినగరం నియోజకవర్గాలపై పడింది. చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఇప్పటి వరకు కిమిడి నాగార్జున కొనసాగారు. తాజాగా ఆయన విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ జిల్లా ఇన్‌ఛార్జిగా నియమితులు కావడంతో ఆయన జోడు పదవుల్లో కొనసాగుతారా? లేక మరెవరికైనా ఈ పదవిని కట్టబెడతారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
https://10tv.in/chandrababu-follows-cm-jagan-in-east-godavari-district/
ఆ కారణంతో చీపురుపల్లిలో కిమిడి కుటుంబం నుంచే నియోజకవర్గ ఇన్‌చార్జి:
జిల్లాలోనే చీపురుపల్లి కీలక నియోజకవర్గం. రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ ఇక్కడ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో ఈ నియోజకవర్గం విషయంలో టీడీపీ అధిష్టానం ఆచితూచి అడుగేయాలని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. బొత్స వంటి నేతను ఢీకొట్టాలంటే స్థానికంగా గట్టి పట్టున్న నేత అవసరం. గత ఎన్నికల్లో కిమిడి నాగార్జున బొత్సపై ఓటమి పాలైనా గట్టి పోటీ ఇచ్చారు. 2014 ఎన్నికల్లో బొత్సపై నాగార్జున తల్లి కిమిడి మృణాళిని విజయం సాధించి, మంత్రి పదవిని కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలో చీపురుపల్లిలో కిమిడి కుటుంబం నుంచే నియోజకవర్గ ఇన్‌చార్జి ఉంటారన్న చర్చ నడుస్తోంది. అయితే, మరో సీనియర్ నేత కె.త్రిమూర్తుల రాజు కూడా ఈ పదవిపై ఎప్పటి నుంచో ఆశలు పెట్టుకున్నారని అంటున్నారు.

వచ్చే ఎన్నికల వరకు పతివాడను కొనసాగించాలా? లేక కొత్త వారికి అవకాశం ఇవ్వాలా?
మరో కీలక నియోజకవర్గం నెల్లిమర్ల. మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామి నాయుడుకు వయసు మీద పడుతుండటంతో ఇక్కడ కొత్త ఇన్‌చార్జి నియామకం అనివార్యమన్న వాదనలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల వరకు పతివాడను కొనసాగించాలా? లేక కొత్త వారికి అవకాశం ఇవ్వాలా అన్న మీమాంశలో అధిష్టానం ఉన్నట్లు సమాచారం. పతివాడ కాకపోతే ఆయన కుమారుడు తమ్మినాయుడు, డెంకాడ మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖర్, భోగాపురం మాజీ ఎంపీపీ కర్రోతు బంగార్రాజు పేర్లు వినిపిస్తున్నాయి. పతివాడ కుమారుడు తమ్మినాయుడు పట్ల అధిష్టానం అంత సానుకూలంగా లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో చంద్రశేఖర్ గానీ, బంగార్రాజుకి గానీ అవకాశం ఇస్తారన్న ప్రచారం సాగుతోంది.

ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న బంగార్రాజు:
భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు భూసేకరణలో అప్పటి టీడీపీ ప్రభుత్వానికి తనవంతు సహకారాన్ని అందించిన బంగార్రాజు కూడా గత ఎన్నికల నుంచే టికెట్‌ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో నెల్లిమర్లకు ఇన్‌చార్జి బాధ్యతలను ఎవరికి అప్పగిస్తారోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. గజపతినగరం నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే కె.ఎ.నాయుడు కొనసాగుతున్నారు. ఆయన ఎప్పటి నుంచో విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పదవి కోసం ఎదురు చూస్తున్నారు.




నాగార్జునకు బాధ్యతలు ఇవ్వడంతో మనస్తాపం:
అధిష్టానం మాత్రం అనూహ్యంగా నాగార్జునకు బాధ్యతలు కట్టబెట్టడంతో తీవ్ర మనస్తాపం చెందిన నాయుడు.. తిరుగుబావుటా ఎగురవేశారు. తన కార్యాలయానికి ఏకంగా పార్లమెంటరీ నియోజకవర్గ బోర్డు తగలించి మరీ నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గ ఇన్‌ఛార్జి విషయమై ఆసక్తి నెలకొంది. అధిష్టానం అభిప్రాయాన్ని లెక్క చేయకుండా తిరుగుబావుటా ఎగురవేసిన కేఏ నాయుడిని పక్కనబెట్టి కొత్తవారిని నియమిస్తారా? ఆయన్నే కొనసాగిస్తారా అన్నది చర్చనీయాంశమైంది. మరో సీనియర్ లీడర్ కరణం శివరామకృష్ణ కూడా ఎప్పటి నుంచో ఆశలు పెట్టుకొని ఎదురు చూస్తున్నారు. ఒకవేళ ఇన్‌ఛార్జిని మారిస్తే శివరామకృష్ణకే వస్తుందన్న ప్రచారం జరుగుతోంది.

గీతను కాదని అదితి గజపతిరాజుకు టికెట్‌ ఇవ్వడంతో తీవ్ర విమర్శలు:
ఇక విజయనగరం నియోజకవర్గ ఇన్‌చార్జిగా అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజే కొనసాగుతున్నారు. మరో సీనియర్ మీసాల గీత పరిస్థితి మాత్రం ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన గీతకు, 2019 ఎన్నికల్లో మాత్రం టికెట్‌ ఇవ్వకుండా అవమానపరిచారన్న విమర్శలు వచ్చాయి. అశోక్ గజపతిరాజు తన కుమార్తె అదితి గజపతిరాజుకు టికెట్‌ ఇప్పించుకోవడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. వచ్చే ఎన్నికల్లో అదితికి టికెట్‌ ఇస్తే గీతను ఎలా సర్ది చెబుతారన్న విషయమై చర్చ జరుగుతోంది. ఇప్పటికే అశోక్ గజపతిరాజు కుటుంబంతో మీసాల గీత దూరంగా ఉంటున్నారు. మొత్తం మీద అసెంబ్లీ ఇన్‌ఛార్జిల మార్పు వ్యవహారం టీడీపీ అధిష్టానానికి పెద్ద సవాల్ గానే మారిందని అంటున్నారు. మరి అధినేత చంద్రబాబు ఈ వ్యవహారంలో ఏం చేస్తారో చూడాలి.