కుట్ర అంటూ హైకోర్టుకు చంద్రబాబు.. కేసు కొట్టేయాలంటూ పిటీషన్!
Chandrababu Naidu:అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సీఐడీ నోటీసుల సంగతి తెలిసిందే. హైదరాబాద్లో నివాసానికి వెళ్లిన సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చి వెళ్లారు. ఈ నోటీసులపై హైకోర్టు మెట్లెక్కారు చంద్రబాబు. చంద్రబాబు సీబీఐ నోటీసులపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకుని, నిపుణులతో, నేతలతో చర్చించి.. ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని పిటిషన్ వేశారు.
మాజీ మంత్రి నారాయణతో పాటు తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలంటూ తన పిటిషన్లో కోరారు చంద్రబాబు. చంద్రబాబు నాయుడు కోర్టుకు హాజరు కావాలా? లేకపోతే తన తరపున ఎవరైనా హాజరు కావచ్చా? అనే విషయాలపై కోర్టు నిర్ణయం తీసుకోనుంది. చంద్రబాబుపై ఇప్పటివరకు బెయిలబుల్ సెక్షన్లే పెట్టగా.. పార్టీ సీనియర్ నేతలు పయ్యావుల కేశవ్, నల్లారి కిషోర్కుమార్రెడ్డి, రావుల చంద్రశేఖర్రెడ్డిలు హైదరాబాద్లోని ఆయన ఇంట్లో కలసినప్పుడు.. సీఐడీ నోటీసుల అశం ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది.
ప్రభుత్వం కక్షపూరితంగా వెళ్తోందని.. మొదట పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టారని.. ఇప్పుడు తన వరకూ వచ్చారని అన్నారు చంద్రబాబు. ఈ సంధర్భంలోనే తనపై కుట్ర కోణం ఉందని కేసు కొట్టివేయాలని అందులో కోరారు. చంద్రబాబు సహా మాజీ మంత్రి నారాయణ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఐపీసీ సెక్షన్ 120బీ, 166,167, 217 సహా అసైన్డ్ భూముల అమ్మకం నిరోధక చట్టం 1977, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కూడా సీఐడీ కేసు నమోదుచేసింది.