బాగానే టెస్ట్ లు చేస్తున్నాం…టెలీ మెడిసన్ పై పర్యవేక్షణ ఉండాలి…. సీఎం జగన్
దేశవ్యాప్తంగా కరోనా పాజిటివిటీ రేటు 8.87శాతం, ఏపీలో పాజిటివిటీ రేటు 8.56శాతం, కర్ణాటకలో 9.88శాతం, తమిళనాడులో 9.26శాతం, మహారాష్ట్రలో 19.36శాతం, ఢిల్లీలో 12.75శాతంగా ఉంది. మరణాల రేటు దేశంలో 2.07 శాతం, ఏపీలో 0.89 శాతం, కర్ణాటకలో 1.85 శాతం, తమిళనాడులో 1.63శాతం, మహారాష్ట్రలో 3.52శాతంగా ఉంది. ప్రతి 10 లక్షల మందిలో 43,059 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం, కర్నూలు, కడప, కృష్ణా, నెల్లూరు, పశ్చిమగోదావరి, చిత్తూరులో రాష్ట్రం సగటుకన్నా ఎక్కువ పరీక్షలు నిర్వహించారు.
కోవిడ్ నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుత రాష్ట్రంలో పరీక్షలు బాగా చేస్తున్నామని తెలిపారు. చేస్తున్న పరీక్షల్లో 85 శాతం నుంచి 90 శాతం క్లస్టర్లు ఉన్న ప్రాంతాల్లోనే చేస్తున్నామని చెప్పారు. 104, 14410 కాల్ సెంటర్లు సమర్థవంతగా పని చేయాలన్నారు. ఈ రెండు నంబర్లు సరిగ్గా పని చేస్తున్నాయా? లేదా? అన్నది అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు. ప్రజలు కాల్ చేసిన వెంటనే స్పందించే వ్యవస్థ ఉండాలన్నారు.
139 ఆస్పత్రులు, కోవిడ్ కేర్ సెంటర్లలో భోజనం , పారిశుద్ధ్యంపై సీఎం ఆరా తీశారు. మెనూ కచ్చితంగా అమలు చేసేలా చూస్తున్నామని అధికారులు తెలిపారు. దీని వల్ల నాణ్యమైన భోజనం అందుబాటులోకి వస్తోందన్నారు. టెలిమెడిసిన్ కింద మందులు పొందిన వారికి మళ్లీ పోన్ చేసి సేవలపై ఆరా తీయాలని తెలిపారు. వ్యవస్థలు ఉన్నట్టు ఉంటాయి గాని, అవి స్థిరంగా పనిచేస్తున్నాయా? లేదా? అనేదానిపై పూర్తిస్థాయి పర్యవేక్షణ ఉండాలన్నారు. అధికారులు అప్పుడప్పుడూ కాల్చేసి అవి పనిచేస్తున్నాయా? లేదా? అని చూడాలని సూచించారు. కాల్ సెంటర్ సేవలపైన ప్రజలు సంతృప్తి వ్యక్తం చేయాలన్నారు. ఎప్పటికప్పుడు వస్తున్న లోపాలను సరిదిద్దుకోవాలన్నారు.
ఎదురవుతున్న లోపాలను అంగీకరించి వాటిని సరిదిద్దుకున్నప్పుడే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలమని తెలిపారు. అవసరాలకు అనుగుణంగా అత్యవసర మందులను అందుబాటులో ఉంచాలన్నారు. స్కూళ్లు తెరిచే సమయానికి పిల్లలకు మాస్కులు ఇవ్వాలని తెలిపారు. జగనన్న విద్యాకానుక ఇచ్చే సమయానికి మాస్కులు కూడా ఇవ్వాలన్నారు. కోవిడ్ ఆస్పత్రుల్లో సేవలపైన కూడా ఫీడ్ బ్యాక్ తీసుకోవాలన్నారు. ఆయా అంశాల్లో సేవలు ఎలా ఉన్నాయన్న దానిపై పీడ్ బ్యాక్ తీసుకోవాలని తెలిపారు.
గ్రామ, వార్డు సచివాలయాల్లో పోస్టర్లు పెట్టాలన్నారు. ఆరోగ్య శ్రీ సేవలందిస్తున్న ఆస్పత్రులు, ఇతర వివరాలు అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఏఎన్ఎం ఆరోగ్యశ్రీకి రిఫరెల్ పాయింట్గా ఉండాలన్నారు. కోవిడ్ ఆస్పత్రుల వివరాలు కూడా ఈ పోస్టర్లో ఉండాలని చెప్పారు. వైద్యం కోసం ఎక్కడకు వెళ్లాలన్నదానిపై ఏఎన్ఎం తగిన విధంగా మార్గనిర్దేశం చేయాలన్నారు. దీంట్లో వాలంటీర్ భాగస్వామ్యం కూడా ఉండాలన్నారు.
అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల వద్దా కోవిడ్ సోకిందని అనిపిస్తే ఏం చేయాలన్నదానిపై హోర్డింగ్స్, పోస్టర్లు పెట్టించాలని సూచించారు. కోవిడ్ ఉన్నట్టుగా అనుమానం ఉంటే.. ఏం చేయాలన్నదానిపై ప్రతి ఒక్కరికీ తెలియజేయాలన్నారు. కోవిడ్ నివారణా చర్యల్లో ఎమ్మెల్యేల భాగస్వామ్యం తీసుకోండన్నారు. ప్రజలను చైతన్య పరిచే కార్యక్రమాలను చేపట్టాలని ఆదేశించారు.