వ్యవస్థలు ప్రజాస్వామ్యం ప్రకారం నడుచుకుంటేనే అభివృద్ధి సాధ్యం, స్వాతంత్ర్య వేడుకల్లో సీఎం జగన్

  • Published By: naveen ,Published On : August 15, 2020 / 10:24 AM IST
వ్యవస్థలు ప్రజాస్వామ్యం ప్రకారం నడుచుకుంటేనే అభివృద్ధి సాధ్యం, స్వాతంత్ర్య వేడుకల్లో సీఎం జగన్

ప్రతి పౌరుడు దేశభక్తి పెంచుకోవాలని ఏపీ సీఎం జగన్ అన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 74వ స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించారు. సీఎం జగన్ పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయజెండాను ఎగురవేశారు. ఆ తర్వాత ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రజాస్వామ్యం ప్రకారం వ్యవస్థలు నడుచుకోవాలన్నారు. రాజ్యాంగం, చట్టప్రకారం నడుచుకుంటేనే అభివృద్ధి సాధ్యమన్నారు. ప్రజలకు కనీస అవసరాలు తీర్చాలన్న లక్ష్యంతో అధికారంలోకి వచ్చామన్నారు.



జాతీయ జెండా ఆవిష్కరణ తర్వాత సాయుధ దళాల నుండి గౌరవ వందనం స్వీకరించారు సీఎం జగన్. ప్రత్యేక వాహనంపై ప్రభుత్వ సంక్షేమ పథకాల శకటాలను వీక్షించారు. సంక్షేమ పథకాలు ప్రతిధ్వనించేలా ఏర్పాటు చేసిన శకటాలతో పాటు కరోనా కష్టకాలంలో ఆరోగ్య సేవలకు గాను ఏర్పాటు చేసిన శకటాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దీనిలో భాగంగా ముందుగా రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్‌.. ‘స్వాతంత్ర్య సమరయోధులకు పాదాభివందనం. స్వాతంత్ర్యం ప్రాణవాయువు లాంటిందని గాంధీజీ చెప్పారు. రాజ్యాంగం, చట్టప్రకారం నడుచుకుంటేనే అభివృద్ధి సాధ్యం. ప్రజాస్వామ్యం ప్రకారం వ్యవస్థలు నడుచుకోవాలి’ అని అన్నారు.



సీఎం జగన్‌ స్పీచ్ హైలైట్స్:
♦సామాజిక, ఆర్ధిక భరోసాను రాజ్యాంగం కల్పించింది
♦సమానత్వం పదాన్ని పుస్తకాలకే పరిమితం చేయకూడదు
♦పేదల జీవితాలు మార్చడానికి కృషి చేస్తున్నాం
♦రైతు భరోసా, వైఎస్ఆర్ చేయూత, అమ్మఒడి, ఆసరా పథకాలు ప్రవేశపెట్టాం
♦కులం, మతం, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నాం
♦ప్రజలందరి సంక్షేమమే ధ్యేయంగా 14 నెలల పాలన సాగింది
♦ఆర్ధిక పరిస్థితులు లేకున్నా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాం
♦విద్యాపరమైన అంటరానితనాన్ని రూపుమాపేందుకు ప్రయత్నిస్తున్నాం
♦ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం
♦రైతు భరోసా ద్వారా అన్నదాతలకు ఆర్ధిక సాయం చేస్తున్నాం
♦పేదలకు 30 లక్షల ఇళ్ల పట్టాలు అందిస్తున్నాం
♦అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకే పాలనా వికేంద్రీకరణ
♦సమన్యాయం జరిగేలా మూడు రాజధానుల బిల్లును చట్టంగా మార్చాం
♦త్వరలో విశాఖ కేంద్రంగా కార్యనిర్వాహక రాజధాని
♦కర్నూలు కేంద్రంగా న్యాయ రాజధాని ఏర్పాటుకు పునాదులు వేస్తాం
♦పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం.. ప్రత్యేక హోదాను అమలు చేయాలని గట్టిగా అడుగుతూనే ఉంటాం
♦కేంద్ర ప్రభుత్వం మిగతా పార్టీలపై ఆధారపడే పరిస్థితి లేదు.. కాబట్టి ఇప్పటికిప్పుడు హోదా ఇచ్చే అవకాశం కనిపించకపోయినా.. ప్రత్యేక హోదాను ఖచ్చితంగా సాధించాలనే ధృడసంకల్పంతో ఉన్నాం
♦ఈరోజు కాకపోతే భవిష్యత్‌లోనైనా..కేంద్ర ప్రభుత్వం మనసు మారి ప్రత్యేక హోదా వస్తుందన్న నమ్మకంతో హోదా కోసం కేంద్రాన్ని డిమాండ్ చేస్తూనే ఉంటాం
♦అవినీతి లేని వ్యవస్థ కోసం రివర్స్ టెండరింగ్‌, జ్యుడీషియల్ ప్రివ్యూ, డైరెక్ట్‌ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ విధానాన్ని అమలు చేస్తున్నాం
♦కేవలం మొదటి 14 నెలల పాలనలోనే వివిధ పథకాల ద్వారా దాదాపు రూ.46వేల కోట్లు ప్రజలకు నేరుగా అందించాం
♦చెట్టు ఎంత బాగా ఎదిగినా చీడ పురుగు పడితే ఎండిపోతుంది. అవినీతి అనేది చీడపురుగు. అవినీతి వల్ల ప్రజలకు అందాల్సిన ఫలాలు అందకుండా పోతాయి
♦ఈ నిజాన్ని గమనించబట్టే రివర్స్ టెండరింగ్‌, జ్యుడీషియల్‌ ప్రివ్యూ గత ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్ష ద్వారా రూ.4వేల కోట్లకు పైగా ఆదా చేశాం