వికేంద్రీకరణతోనే మూడు ప్రాంతాలకు సమన్యాయం, 3 రాజధానులపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

  • Published By: naveen ,Published On : August 15, 2020 / 11:24 AM IST
వికేంద్రీకరణతోనే మూడు ప్రాంతాలకు సమన్యాయం, 3 రాజధానులపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

ఏపీకి మూడు రాజధానులపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాలన వికేంద్రీకరణ లక్ష్యాన్ని మరోసారి వివరించారు. వికేంద్రీకరణతోనే మూడు ప్రాంతాలకు సమ న్యాయం జరుగుతుందని జగన్ స్పష్టం చేశారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో 74వ స్వాంతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం జగన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. ఆ తర్వాత ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.



గాయాలు మానాలన్నా, మరెన్నడూ తగలకుండా ఉండాలన్నా అదొక్కటే దారి:
‘‘రాష్ట్ర విభజన ద్వారా అయిన గాయాలు మానాలన్నా, అలాంటి గాయం మరెన్నడూ తగలకుండా జాగ్రత్తపడాలన్న రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు సమన్యాయం జరగాలి. ఇందుకు వికేంద్రీకరణే సరైన విధానం అని నిర్ణయించి సమన్యాయం జరిగేలా మూడు రాజధానుల బిల్లును చట్టంగా మార్చాం. త్వరలో విశాఖ కేంద్రంగా కార్యనిర్వాహక రాజధాని, కర్నూలు కేంద్రంగా న్యాయరాజధాని ఏర్పాటుకు పునాదులు వేస్తాం. రాజ్యాంగం మొదటి పేజీలో రాసిన జస్టిస్‌, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అనే పదాలకు నిజమైన అర్థం చెబుతూ గత 14 నెలల పాలన సాగింది. వాహనమిత్ర, రైతు భరోసా, పింఛన్‌ కానుక, సున్నా వడ్డీ, లా నేస్తం, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, అమ్మ ఒడి, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, వసతి దీవెన, విద్యా దీవెన, చేదోడు, కాపునేస్తం, గోరుముద్ద, 30లక్షల ఇళ్ల పట్టాలు, కంటి వెలుగు, చేయూత, పాఠశాలలు, ఆసుపత్రుల్లో నాడు-నేడు.. ఇలా ఏ పథకం తీసుకున్నా పేదరికం నుంచి బయటపడేందుకు చిత్తశుద్ధితో గట్టి ప్రయత్నం చేయాలన్న సంకల్పం నుంచి పుట్టినవే’’ అని సీఎం జగన్ అన్నారు.



రాజ్యాంగం, చట్టప్రకారం నడుచుకుంటేనే అభివృద్ధి సాధ్యం:
రాజ్యాంగం, చట్టప్రకారం నడుచుకుంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని జగన్ అన్నారు. ప్రతి పౌరుడు దేశభక్తిని పెంపొందించుకోవాలని సూచించారు. సమానత్వం అనే పదాన్ని పుస్తకాలకే పరిమితం చేయకూడదన్న సీఎం .. ఎస్సీ, బీసీ, మైనారిటీలు మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. 30లక్షల మంది పేదలకు ఇళ్లపట్టాలు అందిస్తున్నాం… రైతు భరోసా ద్వారా అన్నదాతలకు ఆర్థికసాయం చేస్తున్నామని వివరించారు. పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవకుండా అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని జగన్ ఆరోపించారు.



ఏదో ఒక రోజు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తారనే నమ్మకం ఉంది:
ఏపీకి ప్రత్యేక హోదా అంశంపైనా సీఎం జగన్ మాట్లాడారు. ప్రత్యేక హోదా సాధనపై ధృడ సంకల్పంతో ఉన్నామని తేల్చి చెప్పారు. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం.. ప్రత్యేక హోదాను అమలు చేయాలని గట్టిగా అడుగుతూనే ఉంటామన్నారు. కేంద్ర ప్రభుత్వం మిగతా పార్టీలపై ఆధారపడే పరిస్థితి లేదు.. కాబట్టి ఇప్పటికిప్పుడు హోదా ఇచ్చే అవకాశం కనిపించకపోయినా.. ప్రత్యేక హోదాను ఖచ్చితంగా సాధించాలనే ధృడసంకల్పంతో ఉన్నామని జగన్ వెల్లడించారు. ఈరోజు కాకపోతే భవిష్యత్‌లోనైనా..కేంద్ర ప్రభుత్వం మనసు మారి ప్రత్యేక హోదా వస్తుందన్న నమ్మకంతో హోదా కోసం కేంద్రాన్ని డిమాండ్ చేస్తూనే ఉంటామన్నారు.