మదనపల్లి డబుల్ మర్డర్..ఒళ్లు గగుర్పొడిచే వాస్తవాలు.. అంతా అలేఖ్యనే చేసిందా?

మదనపల్లి డబుల్ మర్డర్..ఒళ్లు గగుర్పొడిచే వాస్తవాలు.. అంతా అలేఖ్యనే చేసిందా?

Daily twist in Madanapalle sisters murder case  : మదనపల్లె ఘటనలో వెలుగులోకి వస్తున్న వాస్తవాలు ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తున్నాయి. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వారున్నారా అనే ఉలిక్కిపడేలా చేసింది. భక్తి ముసుగులో జరిగిన దారుణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మదనపల్లి అక్కాచెలెళ్ల హత్యలో రోజుకో విషయం వెలుగుచూస్తోంది. పోలీసుల రిమాండ్ రిపోర్టులో విస్తుపోయే వాస్తవాలు బయటకొస్తున్నాయి. కథంతా అలేఖ్య చుట్టూనే నడుస్తోంది. పెద్ద కుమార్తె అలేఖ్య వల్లే ఈ దారుణం జరిగిందన్న అనుమానాలు రోజురోజుకు బలపడుతున్నాయి. భోపాల్‌లో చదువుకుంటున్న సమయంలో తాంత్రిక పూజలకు ఆకర్షితురాలైన అలేఖ్య తర్వాత కుటుంబ సభ్యులందరినీ ఆ మూఢనమ్మకాల వైపు నడిపించినట్టు తెలుస్తోంది.

భోపాల్ దగ్గరలోని అటవీ ప్రాంతాల్లో అధికంగా సంచరించే తాంత్రిక మాయగాళ్ల వలలో అలేఖ్య పడినట్టు పోలీసులు భావిస్తున్నారు. వారిని తరుచుగా కలుస్తూ తాంత్రిక విద్య పట్ల అలేఖ్య ఆకర్షితురాలైంది. తాంత్రిక విద్య నేర్చుకుని పునర్జన్మలపై విశ్వాసం పెంచుకుంది. లాక్‌డౌన్‌లో ఇంటికి వచ్చిన ఆమె..కుటుంబ సభ్యులకూ వాటి గురించి అదే పనిగా వివరించి తాంత్రిక విద్యను నమ్మేలా చేసింది. లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన సమయంలో ఆధ్యాత్మిక పుస్తకాలు అధికంగా చదువుతూ ట్రాన్స్‌లోకి వెళ్లిపోయారు కుటుంబ సభ్యులు. ఇటు మానసిక సమస్యలతో బాధపడుతున్న పిచ్చి తల్లి ఆమెకు సహకరించింది. తండ్రిని నువ్వు గత జన్మలో అర్జునుడివని.. తల్లిని నువ్వే కాళిక అని చెప్పి నమ్మించింది.

హత్యలకు కొన్నిరోజుల ముందు చిన్నకుమార్తె సాయి దివ్య కుక్కను తీసుకుని వాకింగ్‌కు వెళ్లి ముగ్గులో ఉంచిన నిమ్మకాయను తొక్కింది. దేవుళ్లను, దెయ్యాలను విపరీతంగా నమ్మే కుటుంబం కావడంతో…నిమ్మకాయ తొక్కి ఇంటికి వెళ్లిన దగ్గరనుంచి సాయిదివ్యను అనుకోని భయం వెంటాడింది. ఆమె భయాన్ని పోగొట్టాల్సిన అక్క అలేఖ్య, పునర్జనలపై తనకున్న పిచ్చి నమ్మకంతో చెల్లెల్ని మరింత ఆందోళనకు గురిచేసింది. అక్క నమ్మకాలు, చెల్లి భయాలు…తల్లిదండ్రుల విచిత్ర మానసిక పరిస్థితి…హత్యలకు నేపథ్యంగా నిలిచాయి.

తాయత్తులు, ప్రత్యేక పూజలతో సాయిదివ్య భయం తొలగిపోలేదు. కుక్కపై పునర్జన్మ ప్రయోగం చేశానని, దాన్ని చంపి, బతికించానని అలేఖ్య పదే పదే చెప్పడంతో కుటుంబ సభ్యులు నిజమని నమ్మారు. శివుడు తన రూపంలో వస్తున్నాడని, కలియుగంలో చనిపోయి, సత్యలోకంలో పుట్టాలని అలేఖ్య చెప్పే మాటలపై వారికి గురి కుదిరింది. తర్వాత అనర్ధం జరిగిపోయింది. ఇటు పెద్దకుమార్తె అలేఖ్యను చంపేముందు..ఆమె నాలుకను తల్లి పద్మజ కత్తితో కోసివేసింది. అలేఖ్య ఆదేశం మేరకే పద్మజ అలా చేసినట్టు తెలుస్తోంది. పోస్టుమార్టంలో అలేఖ్య నాలుక సగం మాత్రమే ఉండటాన్ని వైద్యులు గుర్తించారు. నాలుక తొలగించుకుని మరణిస్తే…పునర్జన్మ లభిస్తుందన్న నమ్మకంతో అలేఖ్య అలా చేయమని కోరినట్టు తెలుస్తోంది.

ఇటు చిత్తూరు జిల్లా మదనపల్లె జంట హత్యల కేసులో నిందితులు పురుషోత్తం నాయుడు, పద్మజ తరపున సుప్రీంకోర్టు న్యాయవాది పీవీ.కృష్ణమాచార్య వాదించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దిశ కేసు ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా కృష్ణమాచార్య వాదిస్తున్నారు. పురుషోత్తం నాయుడు తరపున కేసును వాదించాలని.. ఆయన పూర్వ విద్యార్థులు కోరడంతో.. పీవీ.కృష్ణమాచార్య అంగీకరించారు. ఇప్పటికే కేసు వివరాలను తన జూనియర్‌ రజనీ ద్వారా సేకరించినట్లు తెలుస్తోంది. మొత్తంగా తాంత్రిక విద్యపై అలేఖ్య పిచ్చినమ్మకం తీర్చలేని నష్టానికి కారణమైందన్న ప్రచారం జరుగుతోంది. మరి ఈ కేసులో ఇంకెన్ని విషయాలు వెలుగు చూస్తాయో చూడాలి.