మీసం తిప్పిన పోలీస్ : వైసీపీలో చేరిన గోరంట్ల మాధవ్
అనంతపురం జిల్లా కదిరి సీఐగా పనిచేస్తూ ఇటీవల ఎంపీ జేసీదివాకర్ రెడ్డితో విభేధాల కారణంగా ఉద్యోగానికి రాజీనామా చేసిన గోరంట్ల మాధవ్ ఇవాళ(జనవరి 26, 2019) వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. మాధవ్ను పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి జగన్ ఆహ్వానించారు. మాధవ్తో పాటు ఆయన ప్రాంతానికి చెందిన పలువురు ఈ సందర్భంగా పార్టీలో చేరారు.
కానిస్టేబుల్గా ఉద్యోగ జీవితం ప్రారంభించి సీఐ వరకు ఎదిగిన మాధవ్కి నిజాయితీపరుడు, కమిట్మెంట్ ఉన్న వ్యక్తి అన్న పేరు ఉంది. హైదరాబాద్ లోటస్ పాండ్లో ఇవాళ జగన్ సమక్షంలో పార్టీలో చేరిన అనంతరం మాధవ్ మాట్లాడుతూ…జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. అనంతపురం జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. బడుగు, బలహీన వర్గాలకు పార్టీని చేరువ చేయడానికి కృషి చేయనున్నట్లు తెలిపారు.
తాడిపత్రిలోని ప్రభోదానంద ఆశ్రయ వివాద సమయంలో పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి అంతేస్థాయిలో మాధవ్ కౌంటర్ ఇచ్చారు. జేసీ పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే నాలుక తెగగోస్తా అంటూ మాధవ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.