యువశక్తి : టీడీపీ నేతల వారసులొస్తున్నారు

  • Published By: chvmurthy ,Published On : January 12, 2019 / 10:44 AM IST
యువశక్తి : టీడీపీ నేతల వారసులొస్తున్నారు

రానున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఏపీలో  తెలుగుదేశం పార్టీలో యువ‌నాయ‌కులు పోటికి సై అంటున్నారు. తండ్రుల వారసత్వం ఆసరాగా ఎన్నికల్లో  గెలిచి ఎలాగైనా స‌రే అసెంబ్లీలో అడుగుపెట్టాల‌ని తెగ ఆరాట‌ప‌డుతున్నారు. వీలైతే తండ్రుల‌తో పాటు త‌మ‌కి ఒక టికెట్ కావాల్సిందేన‌ని ఇప్ప‌టినుండే గ్రౌండ్  వర్క్ ప్రిపేర్  చేసుకుంటున్నారు టిడిపి యంగ్ టీమ్‌. మ‌రి చంద్ర‌బాబు ఒకే ఇంటిలో ఇద్ద‌రికి టికెట్ ఇవ్వ‌డానికి ఇంట్ర‌స్ట్ చూపుతారా? లేదా ? అన్న మీ మాంస యువ‌నాయ‌కుల‌ను వేధిస్తోంది. మ‌రి బాబు నో చెబితే ….. చినబాబు లోకేష్ వెంట ప‌డ‌దాం అనుకున్నా, వారిపై చిన‌బాబుకు అంత సదభిప్రాయం లేద‌నేది పార్టీ వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది.  
పార్టీ వ్య‌వ‌స్ధాప‌క అధ్య‌క్షుడు య‌న్‌టిఆర్ పార్టీ స్ధాపించిన స‌మ‌యంలో టీడీపీలో యువ‌కుల‌కు ఎక్కువ ప్రాధాన్య‌త ఇచ్చారు. య‌న్‌టిఆర్ స‌మ‌యంలో పార్టీలోకి వ‌చ్చిన వారంతా నేడు చంద్ర‌బాబు హ‌యాంలోనూ పార్టీలో సీనియ‌ర్స్‌గా కొన‌సాగుతున్నారు. అయితే నేడు సీనియ‌ర్ నేత‌ల వార‌సులు ఒక్కోరొక్కరుగా తెర‌పైకి వ‌స్తున్నారు. య‌న్‌టిఆర్ లాగా చంద్ర‌బాబు యువ‌త‌ను ప్రోత్స‌హించాల‌నే అభిప్రాయాన్ని వారు వ్య‌క్తం చేస్తున్నారు. ఇన్ని రోజులు నియోజ‌క‌వ‌ర్గాల్లో తండ్రికి చేదోడు, వాదోడుగా ఉంటూ పార్టీ వ్య‌వ‌హ‌రాలు చూస్తూ  నియోజకవర్గంలో పట్టుసాధించిన యువ‌నాయ‌కులు అంతా ఇప్పుడు టికెట్ పై క‌న్నేశారు. వారికి నియోజ‌క‌వ‌ర్గాల్లో కాస్త గ్రిప్ దొర‌క‌గానే ఇప్పుడు స‌మ‌రానికి సై అంటున్నారు. వీలైతే ఇంట్లో ఇద్ద‌రికీ, లేదా క‌నీసం త‌మ‌కు అయినా టికెట్ కావాల్సిందేన‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. వ‌చ్చే ఎన్నికల్లో పోటికి లోకేష్ కూడా రెడీ అవుతుండ‌టంతో ఇక యువ‌నాయ‌కులు ఆయ‌న వెంట అసెంబ్లీలో అడుగుపెట్టాల‌ని తెగ ఆరాట‌ప‌డుతున్నారు.
ఉత్తరాంధ్రలో చూస్తే
జిల్లాల వారీగా చూస్తే శ్రీ‌కాకుళం జిల్లాలో సీనియ‌ర్ ఎమ్మెల్యే అయిన గౌతు శ్యామ‌సుంద‌ర్ శివాజి కుమార్తె అయిన గౌతు శిరీష వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ఆశిస్తున్నారు. ప్ర‌స్తుతం ఆమె శ్రీ‌కాకుళం జిల్లా పార్టీ అధ్య‌క్షురాలిగా ప‌నిచేస్తున్నారు. ఇప్ప‌టికే చంద్ర‌బాబుకి ఆమె తండ్రి శివాజి సైతం త‌న బ‌దులు వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న కుమార్తెకు ఇవ్వాల‌ని కోరారు. విశాఖపట్నం పార్లమెంట్ సీటును దివంగత ఎంవిఎస్.మూర్తి మనవడు భరత్ ఆశిస్తున్నారు. ఇదే జిల్లాలో మంత్రి చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు కుమారుడు చింత‌కాయ‌ల విజ‌య్ పాత్రుడు వ‌చ్చే ఎన్నికల్లో పోటిపై గంపెడాశ‌లు పెట్టుకున్నారు.ఇటివ‌ల కాలంలో పార్టీలో యాక్టివ్‌గా తిరుగుతున్నారు. ఎలాగూ అయ్య‌న్న‌పాత్రుడు అసెంబ్లీకి పోటిచేస్తారు కాబ‌ట్టి త‌న‌కి పార్ల‌మెంట్  టికెట్ కావాల‌నే డిమాండ్ తెర‌పైకి తీసుకువ‌స్తున్నారు విజ‌య్‌పాత్రుడు. ఇక ఇదే జిల్లాలో మాజీమంత్రి, ప్ర‌స్తుత ఎమ్మెల్యే బండారు స‌త్య‌నారాయ‌ణ మూర్తి కుమారుడు అప్ప‌లనాయుడు టికెట్ ఆశిస్తున్నారు. శ్రీ‌కాకుళం ఎంపి రామ్మోహ‌న్‌నాయుడుకి అప్ప‌ల‌నాయుడు బావ‌మ‌రిది కావ‌డం, ఒక‌వైపు త‌న తండ్రి ఎప్ప‌టి నుండో సీనియ‌ర్ ఎమ్మెల్యేగా ఉండ‌టంతో త‌న‌కి ఈసారి టికెట్ వ‌స్తే బాగుంటుంద‌ని ఆశిస్తున్నారు. ఇక విజ‌య‌న‌గ‌రంలో మాజీ కేంద్ర మంత్రి అశోక్‌గ‌జ‌ప‌తి రాజు కుమార్తె పేరు బాగా వినిపిస్తోంది. 
కోస్తా విషయానికి వస్తే 
తూర్పుగోదావరి  జిల్లాలో ఎమ్మెల్యే జోత్యుల నెహ్రు కుమారుడు, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కుమారుడు వాసు లు టికెట్స్ ఆశిస్తున్నారు. ఇక ప‌శ్చిమ‌ంలో సీనియ‌ర్ నేత బోళ్ళ బుల్లిరామ‌య్య మ‌న‌వడు బోళ్ళ రాజీవ్ ఏలూరు ఎంపి టికెట్ ఆశిస్తున్నారు. కృష్ణా జిల్లాలో దేవినేని అవినాష్‌, దేవినేని చందు ఇద్ద‌రు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ఆశిస్తున్నారు. గుంటూరు జిల్లాలో స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు త‌న‌యుడు కోడెల శివ‌రామ్ టికెట్ ఆశిస్తున్నారు. స‌త్తెన‌ప‌ల్లి, న‌ర్స‌రావుపేట రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ పార్టీ వ్య‌వ‌హ‌రాలు కోడెల శివ‌రామ్ ద‌గ్గ‌రుండి ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ఇక ఎంపి రాయ‌పాటి సాంబ‌శివ‌రావు కుమారుడు రాయ‌పాటి రంగబాబు టికెట్ పై గంపెడాశ‌లు పెట్టుకున్నారు. ప్ర‌కాశం జిల్లాలో సీనియ‌ర్ నేత, ప్ర‌స్తుత ఎమ్మెల్సీ అయిన క‌ర‌ణం బ‌ల‌రామ్ కుమారుడు క‌ర‌ణం వెంక‌టేష్ నియోజ‌క‌వ‌ర్గం అన్వేష‌ణ‌లో ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో అద్దంకి నుండి పోటిచేసిన వెంక‌టేష్ గోట్టిపాటి ర‌వి చేతితో ఓడిపోయారు. ఆ త‌ర్వాత ప‌రిణామాల‌తో గోట్టిపాటి ర‌వి టిడిపి గూటికి చేరారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఖ‌చ్చితంగా అద్దంకి నుండి గోట్టిపాటి ర‌వికుమార్ పోటిచేస్తారు కాబ‌ట్టి క‌ర‌ణం వెంక‌టేష్ జిల్లాలో ఏదో ఒక నియోజ‌క‌వ‌ర్గం కావాల‌ని ఇప్ప‌టినుండే ప్ర‌య‌త్నాలు ముమ్మరం చేశారు. ఇక ఇదే జిల్లాలో మంత్రి శిద్దారాఘ‌వ‌రావు కుమారుడు శిద్దా సుధీర్ టికెట్ ఆశిస్తున్నారు.
రాయలసీమలో 
చిత్తురు జిల్లాలో మాజీ మంత్రి బొజ్జ‌ల గోపాల‌కృష్ణారెడ్డి కుమారుడు బొజ్జ‌ల సుధీర్‌రెడ్డి పోటికి సై అంటున్నారు. త‌న తండ్రికి ఆరోగ్యం స‌రిగా స‌హ‌క‌రించ‌క‌పోవ‌డంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటికి రెడీ అంటున్నారు. ఇక ఇదే జిల్లాలో ఇటివ‌లే మ‌ర‌ణించిన గాలిముద్దుకృష్ణ‌మ‌నాయుడు కుమారులు గాలి జ‌గ‌దీష్‌, గాలి భాను ఇద్ద‌రు టికెట్‌పై గంపెడాశ‌లు పెట్టుకున్నారు. ఐతే ఇటీవ‌ల చంద్రబాబు నాయుడు ఇద్ద‌రినీ పిలిపించి మాట్లాడారు. వీరిలో భానుకు టికెట్ ఇచ్చేందుకు చంద్ర‌బాబు సుముఖంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.  అనంత‌లో మంత్రి ప‌రిటాల సునీత త‌న‌యుడు ప‌రిటాల శ్రీ‌రామ్ పోటికి సై అంటున్నారు. ప‌రిటాల సునీత బ‌దులుగా ఈసారి చంద్ర‌బాబు శ్రీ‌రామ్ కు టికెట్ ఇస్తార‌నే ప్రచారం  జోరుగా సాగుతోంది. ఇక ఇదే జిల్లాలో ఎంపి జేసి దివాక‌ర్‌రెడ్డి త‌న‌యుడు జేసి ప‌వ‌న్ కుమార్ రెడ్డి వ‌చ్చే ఎన్నిక‌ల్లో అనంత ఎంపిగా పోటిచేసే అవ‌కాశాలు ఎక్కువగా క‌నిపిస్తున్నాయి. జేసి నే అనేక సంద‌ర్బాల్లో  ఈ విష‌యం ప్ర‌క‌టించారు. ఇక ఈ సారి తాడిప‌త్రి నుండి జేసి ప్ర‌భాక‌ర్ రెడ్డి  కుమారుడు ఆస్మిత్ రెడ్డి పోటి చేస్తారు అని  వినికిడి. ఇక కర్నూల్ జిల్లాలో డిప్యూటి సియం కేఈ కృష్ణమూర్తి త‌న‌యుడు కేఈ శ్యామ్ పోటికి సై అంటున్నారు. కేఈ కృష్ణ‌మూర్తి సైతం త‌న కుమారుడు వైపే మొగ్గుచూపిన‌ట్లు తెలుస్తుంది. ఇదే జిల్లాలో రాజ్య‌స‌భ స‌భ్యులు టిజి వెంక‌టేష్ కుమారుడు టిజి భ‌ర‌త్ టికెట్ ఆశిస్తున్నా కొద్ది రోజుల క్రితం క‌ర్నూల్ జిల్లా ప‌ర్య‌ట‌న‌లో లోకేష్ లేద‌ని తేల్చేశారు. దీంతో టిజి భ‌ర‌త్ పోటి నుండి కాస్త వెనక్కి త‌గ్గిన‌ట్లు తెలుస్తోంది.
చంద్రబాబు నిర్ణయం ఎటువైపు
ఎన్నికల్లో పోటీకి యువ‌నాయ‌కులు తెగ ఆరాట‌ప‌డుతున్నారు. కానీ అధినేత చంద్ర‌బాబు వారిపై క‌రుణ చూపిస్తారా, లేదా అన్న సందేహం మ‌రోవైపు వారిని వెంటాడుతోంది. ఇంత క్లిష్ట ప‌రిస్దితుల్లో ఒకే ఇంట్లో ఇద్ద‌రికి టికెట్ అడిగితే చంద్ర‌బాబు ఎలా రియాక్ట్ అవుతారో అన్న సందేహం వారిని వేధిస్తోంది. కొంద‌రు సీనియ‌ర్ నేత‌లు వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటికి దూరంగా ఉండాల‌ని ఇప్ప‌టికే నిర్ణ‌యం తీసుకున్నారు. వ‌య‌సు రీత్యా కావ‌చ్చు…వేరే ఏద‌యినా కార‌ణం కావ‌చ్చు కానీ కొంద‌రు సీనియ‌ర్స్ అయితే పోటికి దూరంగా ఉండాల‌ని డిసైడ్ అయ్యారు. ఇదే విష‌యాన్ని  ఆనాయకులు తమ అభిప్రాయాన్ని ఇప్ప‌టికే చంద్ర‌బాబుకి చెప్పారు. చంద్ర‌బాబుకి చెప్ప‌డంతో పాటు త‌న బ‌దులు వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న వార‌సుడికి టికెట్ ఇవ్వాల‌నే డిమాండ్‌ను బాబు ముందుంచారు. కాగా వీరిలొ కొంద‌రికి చంద్ర‌బాబు కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు తెలిసింది.
కొంత మంది విషయంలో చంద్ర‌బాబు టికెట్ ఇవ్వకపోతే, టికెట్ కోసం చిన‌బాబుని అయినా ఒప్పిద్దాం అనుకున్నా అక్క‌డ వారి ప‌ప్పులు ఏమి ఉడికేలా లేవు. చంద్ర‌బాబుని టికెట్ అడిగే ధైర్యం చేయ‌లేని యువ‌నాయ‌కులు చిన‌బాబు వెంట ప‌డుతున్నారు. అయితే చిన‌బాబు సైతం వారికి ఎలాంటి హామీ ఇవ్వ‌లేక‌పోతున్నారు. చంద్ర‌బాబుని కాద‌ని లోకేష్ సైతం ఎలాంటి హామీ ఇవ్వ‌లేరని తెలుసు. అయినా ఏదో ఒక ప్ర‌య‌త్నం చేద్దాం లే అని లోకేష్ చుట్టు తిరుగుతున్నారు యంగ్ టీం. 2014 ఎన్నిక‌ల త‌ర్వాత కొద్ది రోజులు లోకేష్ యువ‌నాయ‌కుల‌తో స్నేహంగానే ఉండేవారు. కానీ నియోజ‌క‌వ‌ర్గాల ప్ర‌జ‌ల నుండి యువ‌నాయ‌క‌ుల‌పై వ‌స్తున్న‌ ఫిర్యాదుల‌తో కాల‌క్ర‌మేణ లోకేష్ సైతం వారితో అప్ప‌టినుండి ఇప్ప‌టివ‌ర‌కు అంటిముట్ట‌న‌ట్లుగానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కొంద‌రి సిట్టింగ్‌ల‌కు టికెట్ లు ఇవ్వ‌ర‌నే ప్ర‌చారం జ‌ర‌గుతున్న నేప‌ధ్యంలో అలా అయినా అదృష్టం వ‌రిస్తుందో ఏమో న‌ని గంపెడాశ‌లు పెట్టుకున్నారు యువ‌నాయకులు. మ‌రి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలా అయినా అసెంబ్లీలో అడుగుపెట్టాలని  తెగ ఆరాట‌ప‌డుతున్న టిడిపి యువ‌నాయ‌కుల ఆశ‌లు నెరవేరతాయో లేదో  వేచి చూడాలి మ‌రి.