KA PAUL : వరుస మీటింగ్లతో జోరు పెంచిన పాల్..అమిత్ షాతో భేటీ వెనుక పెద్ద కథే ఉందంట..!
ఇంతకాలం పార్ట్ టైమ్ పాలిటిక్స్కే పరిమితమైన కేఏ పాల్... ఇప్పుడు ఫుల్ టైమ్ పొలిటీషియన్గా మారినట్లుంది. వరుస హిట్టింగ్లు వరుస మీటింగ్లతో పాల్ జోరు పెంచడం వెనుక ఓ ఆసక్తికరమైన చర్చ చక్కర్లు కొడుతోంది.
KA Paul praja shanthi party : మీరు గల్లీ లీడర్లను చూసింటారు.. దేశ్ కీ నేతల గురించి విని ఉంటారు.. కానీ అతను దునియాకే నేత..! ప్రపంచాన్నే చుట్టొచ్చిన లీడర్. అతను ఏం మాట్లాడినా వింటారు..! అతను ఎవరిని విమర్శించినా చూస్తారు..! ఇంతకాలం పార్ట్ టైమ్ పాలిటిక్స్కే పరిమితమైన కేఏ పాల్… ఇప్పుడు ఫుల్ టైమ్ పొలిటీషియన్గా మారినట్లుంది. వరుస హిట్టింగ్లు వరుస మీటింగ్లతో పాల్ జోరు పెంచడం వెనుక ఓ ఆసక్తికరమైన చర్చ చక్కర్లు కొడుతోంది.
కేఏ పాల్ పెద్దగా పరిచయం అవసరం లేని వ్యక్తి. 2009లో ప్రజాశాంతి పార్టీతో తెలుగు రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. అతను పార్ట్ టైమ్ పొలిటీషియన్గా ఉన్నా.. ఎప్పుడు వార్తల్లో ఆయనదే టాప్ ప్లేస్. ఇప్పటి వరకు ఆయన ఎన్నికల్లో పోటీ చేసిందీ లేదు… గెలిచిందీ లేదు ! అయినా పాల్ వస్తున్నారంటే హడావుడి ఓ రేంజ్లో ఉంటుంది. మీడియా కూడా ఆయనకు అదే స్థాయి ప్రమోషన్ ఇచ్చేస్తుంది. ఇంకేముంది..కేఏ పాల్ కనపడితే రాజకీయం రసవత్తరంగా మారుతుంది. నిజానికి పాల్ని ఏ పార్టీలు అంత సీరియస్గా తీసుకోవు. అసలు అతడు మన ప్రత్యర్థి అన్న ఆలోచన కూడా మెదడులోకి రానివ్వవు. అతను ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోవు. తెలుగు రాష్ట్రాల్లో జనాలు కూడా అంతేలెండి… పాల్ను అస్సలు సీరియస్గా తీసుకోరు. అతడ్ని రాజకీయ నాయకుడి కోణంలో చూడనే చూడరు. కానీ పాల్ మాత్రం.. తాను పక్కా పొలిటిషయన్ను అంటారు. గల్లీ రాజకీయాల నుంచి అమెరికా రాజకీయాల వరకూ అన్ని అలవోకగా మాట్లాడేస్తారు. ఎప్పుడూ ఎన్నికల టైమ్లో హడావుడి చేసే పాల్.. ఈ సారి మాత్రం కాస్త ముందుగానే బరిలోకి దిగేశారు. తెలంగాణలో పూటకో ప్రెస్మీట్.. రోజుకో గొడవతో రచ్చరచ్చ చేస్తున్నారు. ఎవరికీ అంత సులభంగా సాధ్యం కాని పనులు చేస్తూ… అధికార పార్టీల అధినేతల్నే ఆలోచనలో పడేస్తున్నారు పాల్.
Also read : AP Politics : వెయింటింగ్ లిస్ట్ లోనే నటుడు అలీ పేరు..ఏ పదవి ఇస్తారోనని ఆశగా ఎదురుచూస్తున్నాడట పాపం..
ఆ మధ్య సిరిసిల్లలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల్ని పరామర్శించడానికి వెళ్తున్న సమయంలో కేఏ పాల్పై దాడి జరిగింది. ఈ ఘటన రాష్ట్రంలో పెద్ద కలకలమే సృష్టించింది. తనపై టీఆర్ఎస్ దాడి చేయించిందని కేఏ పాల్ ఆరోపించారు. అంతేకాదు స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి ఫిర్యాదు చేశారు. సాధారణంగా మహా మహులకే అంత సులభంగా అమిత్ షా అపాయింట్మెంట్ దొరికే అవకాశమే ఉండదు. ఎంత పెద్ద నేతలైనా ఢిల్లీలో రెండు మూడు రోజులు వెయిట్ చేస్తే కానీ అమిత్ షాను కలవలేరు. అలాంటిది కేఏ పాల్ ఈజీగా అపాయింట్మెంట్ సంపాదించారు. ఈ భేటీలో రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ విషయాల గురించి అమిత్ షా వద్ద ప్రస్తావించారు. అంతేకాదు తనపై జరిగిన దాడిలో కేసీఆర్, కేటీఆర్ హస్తముందని… ఆ దాడి తాలూకా పరిణామాలు త్వరలోనే చెప్తానంటూ హెచ్చరికలు చేశారు. అడిగిన వెంటనే కేఏ పాల్కి అమిత్ షా అపాయింట్మెంట్ దొరకడం.. నేరుగా సీఎం కేసీఆర్నే హెచ్చరించడం లాంటి పరిణామాలన్నీ కొంచెం కొత్తగా కనిపిస్తున్నాయి. అమిత్ షా – పాల్ భేటీ వెనుక రీజన్ ఏంటన్నదానిపై ఆసక్తికరమైన ప్రచారం సాగుతోంది. పైగా మీడియా ముందుకు వచ్చి కావల్సినంత మసాలా ఇస్తుండడంతో.. పాల్కు ఫుల్ కవరేజ్ దొరుకుతోంది.
Also read : AP Politics : ఆర్. కృష్ణయ్య బీసీల కోసం పోరాటం చేశారా? వైసీపీలో పదవి కోసం పోరాటం చేశారా? : బుద్దా వెంకన్న
వచ్చే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాలను తమ ఖాతాలో వేసుకోవాలని బీజేపీ తెగ ట్రై చేస్తోంది. దీనికోసం వచ్చే ఏ అవకాశాన్ని వదులకునేందుకు సిద్ధంగా లేదు. అయితే కేఏ పాల్ని కూడా రానున్న ఎన్నికల్లో ఓ
అస్త్రంగా వాడుకునేందుకు బీజేపీ సిద్ధమైనట్లుగా కనిపిస్తోంది. అందుకే కేఏ పాల్ను ఎంకరేజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో క్రైస్తవ ఓటు బ్యాంకు ప్రభావం చూపేలా బీజేపీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కేవలం తెలుగు రాష్ట్రాలే కాదు క్రిస్టియన్లు ఎక్కువగా ఉండే ఈశాన్య రాష్ట్రాల్లోనూ ప్రజాశాంతి పార్టీతో పోటీ చేయించి.. కాంగ్రెస్ క్రైస్తవ ఓటు బ్యాంక్కు గండి కొట్టాలన్నది కమల వ్యూహంగా కనిపిస్తోంది. అడిగిన వెంటనే కేఏ పాల్కి అపాయింట్మెంట్ ఇవ్వడం వెనుక ఇంత కథ దాగుందా.. ! అని అంతా ఆశ్చర్యపోతున్నారు.
గత సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ రాజకీయాల్లో హడావుడి చేసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్… ఇప్పుడు తెలంగాణను టార్గెట్ చేశారు. ప్రజాశాంతి పార్టీతోనే బంగారు తెలంగాణ సాధ్యమని కొత్త నినాదం అందుకున్నారు. అంతేకాదు తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర కూడా చేపట్టేందుకు పాల్ ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఇప్పటి వరకు కేఏ పాల్ని లైట్ తీసుకున్న పార్టీలే ఇప్పుడు ఆయన జోరు చూసి ఏంచేయాలా అని ఆలోచిస్తున్నట్లు సమాచారం.