వైసీపీ నుంచి సస్పెండ్ అయిన ఆ ఇద్దరితో నాకు ప్రాణహాని ఉంది, పోలీసులను ఆశ్రయించిన ఎమ్మెల్యే శ్రీదేవి

  • Published By: naveen ,Published On : November 7, 2020 / 11:47 AM IST
వైసీపీ నుంచి సస్పెండ్ అయిన ఆ ఇద్దరితో నాకు ప్రాణహాని ఉంది, పోలీసులను ఆశ్రయించిన ఎమ్మెల్యే శ్రీదేవి

mla undavalli sridevi : గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి… తనకు ప్రాణహాని ఉందంటూ పోలీసుల్ని ఆశ్రయించారు. ఇద్దరు వ్యక్తుల నుంచి తనకు ముప్పు ఉందని… పోలీసులకు ఫిర్యాదు చేశారు. పార్టీ నుంచి సస్పెండైన ఇద్దరు వైసీపీ కార్యకర్తల నుంచి తనకు హాని జరిగే ప్రమాదముందంటూ పోలీసులకు కంప్లైంట్‌ ఇచ్చారు. వైసీపీ నుంచి సస్పెండైన సందీప్‌, సురేశ్‌ అనే కార్యకర్తలు… తనపై సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. సందీప్‌, సురేశ్‌పై చర్య తీసుకోవాలని పోలీసుల్ని కోరారు. ఎమ్మెల్యే శ్రీదేవి ఫిర్యాదుతో సందీప్‌, సురేశ్‌పై గుంటూరు జిల్లా నగరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు.

చలివేంద్రపు సురేష్, శృంగారపాటి సందీప్‌లు ఇటీవలే వైసీపీ నుంచి బహిష్కరించబడ్డారు. వారిద్దరి నుంచి తనకు ప్రాణాహాని ఉందన్నారు ఎమ్మెల్యే శ్రీదేవి. వారిద్దరు తనను బ్లాక్‌మెయిల్ చేస్తూ, బెదిరిస్తున్నారని ఆమె గుంటూరులోని నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సందీప్‌, సురేష్‌ చట్ట వ్యతిరేకంగా మద్యం వ్యాపారం చేస్తూ, పేకాట ఆడిస్తూ పెదకాకాని పోలీసులకు పట్టుబడ్డారని శ్రీదేవి గుర్తుచేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న కారణంగా వీరిని వైసీపీ మండల పార్టీ నాయకులు వారిద్దరిని పార్టీ నుంచి బహష్కించారని తన ఫిర్యాదులో తెలిపారు.

తాను అధిష్టానానికి చెప్పడం వల్లే.. వారిద్దరిని పార్టీ నుంచి బహిష్కరించారని శ్రీదేవి తెలిపారు. దీంతో సురేష్, సందీప్‌ బెదిరిపులకు పాల్పడుతున్నారని చెప్పారు. ఫోన్‌లో బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. తన గొంతు మార్ఫింగ్ చేసి మాట్లాడుతూ అవమానపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను బయటకు వెళ్లినప్పుడ వెంటపడుతూ ప్రాణహాని తలపెట్టేలా ఉన్నారని వాపోయారు. వారిద్దరిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు ఎమ్మెల్యే శ్రీదేవి. ఇద్దరు వ్యక్తుల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఎమ్మెల్యే శ్రీదేవి పోలీసులను ఆశ్రయించడం.. తాడికొండ నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఎమ్మెల్యే ఆరోపణలు చేసిన ఇద్దరు వ్యక్తులు కూడా గతంలో ఆమె అనుచరులేనన్న ప్రచారం జరుగుతోంది.