2021 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తాం : మంత్రి అనిల్
AP minister Anil kumar : పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత కేంద్రానిదేనని ఏపీ మంత్రి అనిల్ కుమార్ అన్నారు. విభజన చట్టం ప్రకారం పోలవరాన్ని పూర్తిచేసే బాధ్యత కేంద్రానిదేనని ఆయన స్పష్టం చేశారు.
నిర్వాసితుల పునరావాస బాధ్యత కూడా కేంద్రానిదేనని తెలిపారు. ఆలస్యమయ్యే కొద్దీ ప్రాజెక్టు వ్యయం పెరుగుతుందని అన్నారు. చంద్రబాబు తప్పిదాల వల్లే పోలవరం నిర్మాణంలో ఇబ్బందులు ఉన్నాయని అనిల్ విమర్శించారు.
పోలవరం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని.. 2021 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టును 2016లో రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించారని అనిల్ కుమార్ అన్నారు. ఇంకా లక్ష మంది నిర్వాసిత కుటుంబాలకు పరిహారం, పునరావసం చెల్లించాల్సి ఉందన్నారు.
పోలవరం ప్రాజెక్టుపై ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం జగన్ లేఖ రాశారు. ప్రధానితో పాటు ఆర్థిక, జలశక్తి మంత్రులకు లేఖ రాశారు.
జాతీయ ప్రాజెక్టు పోలవరాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని ఆయన లేఖలో పేర్కొన్నారు. పోలవరం ఏపీకి జీవనాడి లాంటిదన్నారు.
ప్రాజెక్టు పనులతో పాటు నిర్వాసితుల సమస్యలపై కేంద్రం దృష్టి పెట్టాలని కోరారు. నిధుల విడుదల జాప్యం, పనులు ఆలస్యంతో అంచనా వ్యయం పెరిగే అవకాశం ఉందని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు.