Andhra Pradesh : విద్యుత్ సంక్షోభం దిశగా ఆంధ్రప్రదేశ్..కరెంట్ కోతలు తప్పవా?
ఏపీలో త్వరలోనే కరెంటు కోతలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాబోయే ఐదారు నెలలు.. జనం విద్యుత్ ఆదా చేయాల్సిందే. లేదంటే.. కోతలు తప్పవు. దేశంలో పడిపోయిన బొగ్గు నిల్వలే ఇందుకు కారణం.
power crisis in Andhra Pradesh : ఏపీలో త్వరలోనే కరెంటు కోతలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాబోయే ఐదారు నెలలు.. జనం విద్యుత్ ఆదా చేయాల్సిందే. లేదంటే.. కోతలు తప్పవు. దేశంలో పడిపోయిన బొగ్గు నిల్వలే ఇందుకు కారణం. కానీ.. కేంద్రం మాత్రం అలాంటిదేమీ లేదు.. అంతా ఓకే అంటోంది. మరి.. గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాస్తవ పరిస్థితేంటి?
ఏపీ ప్రజలారా.. ఇప్పటి నుంచే ప్రిపేర్ అయిపోండి. ఎందుకంటే.. కరెంటు కోతలు మొదలయ్యాయి. భవిష్యత్తుల్లో మరిన్ని కోతలు తప్పేలా కనిపించడం లేదు. త్వరలోనే.. కరెంటు కొరత రావొచ్చు. ఎందుకంటే.. రాష్ట్రంలో విద్యుత్ సమస్య చాలా తీవ్రంగా ఉంది. దేశీయంగా బొగ్గు నిల్వలు పడిపోవటం, యూనిట్ ఛార్జీలు పెరగడంతో.. కరెంటు సమస్య తలెత్తింది. ఎంత డబ్బు పెట్టినా.. కొరత తీర్చలేని పరిస్థితి నెలకొంది. అందుకే.. ఇప్పటి నుంచే విద్యుత్ను పొదుపుగా వాడుకోండి. ఇప్పటికే.. ఏసీల వినియోగాన్ని తగ్గించుకోవాలని రాష్ట్ర విద్యుత్ శాఖ కూడా సూచించింది.
AP Coal : విద్యుత్ సంక్షోభం, ఆ సమయంలో…ఏసీలు ఆపేయండి
ఏపీలో విద్యుత్ సంక్షోభం తలెత్తే పరిస్థితి ఉందని.. సమస్యను పరిష్కరించాలని సీఎం జగన్.. ప్రధాని దృష్టికి కూడా తీసుకెళ్లారు. భవిష్యత్తులో అధికారికంగా కరెంట్ కోతలు అమలు చేయాల్సి రావొచ్చని.. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సైతం చెప్పారు. దేశంలో బొగ్గు కొరతే లేదని, విద్యుత్ సంక్షోభం అసలే లేదంటూ కేంద్రమంత్రి చేసిన ప్రకటనను ఖండించి.. అసలు విషయాలు బయటపెట్టారు సజ్జలు.
గతంలో ఎన్నడూ లేని విధంగా.. ఏపీలో విద్యుత్ డిమాండ్ పెరిగింది. బొగ్గు కొరతతో పాటు, విద్యుత్ కొనుగోలు రేట్లు కూడా పెరిగాయి. కొనుగోలు చేద్దామన్నా.. బొగ్గు దొరకడం లేదు. అటు ఎక్సేంజ్లోను పీక్.. ఆఫ్ పీక్ టైమ్తో సంబంధం లేకుండా యూనిట్ ధర 20 రూపాయలు పలుకుతోంది. ఇంత ధరకు కరెంటు కొని ఇవ్వడం విద్యుత్ పంపిణీ సంస్థలకు సాధ్యం కావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో.. ఇళ్లలో కరెంటు వినియోగాన్ని తగ్గించుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. రాబోయే అయిదారు నెలలు.. ప్రజలు విద్యుత్ ఆదా చేయాలని సూచిస్తోంది.
Coal Shortage : ముంచుకొస్తున్న విద్యుత్ సంక్షోభం..నాలుగు ప్రధాన కారణాలు ఇవే
బొగ్గు కొరత, విద్యుత్ సమస్యపై.. కేంద్రం కూడా దృష్టిసారించింది. హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో.. బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్, ఎన్టీపీసీ అధికారులు సమావేశమయ్యారు. దేశంలో నెలకొన్న కోల్ క్రైసిస్ని ఎదుర్కోవడంపై చర్చించారు. ఇప్పటికిప్పుడు సంక్షోభం తలెత్తే పరిస్థితి లేదని కేంద్రం చెబుతోంది. వారానికి సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఎన్టీపీసీ దగ్గరున్న 4 కోట్ల టన్నుల బొగ్గును.. థర్మల్ విద్యుత్ కేంద్రాలకు తరలిస్తామని హమీ ఇచ్చింది కేంద్రం.
కానీ.. కేంద్రం చెబుతున్నదానికి.. రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులకు అస్సలు సంబంధం లేదు. బొగ్గు కొరతతో పంజాబ్లో 3, కేరళలో 4, మహారాష్ట్రలో 13 థర్మల్ విద్యుత్ కేంద్రాలు మూతపడ్డాయి. కేంద్ర విద్యుత్ అథారిటీ డాటా ప్రకారం.. థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో రోజు రోజుకు బొగ్గు నిల్వలు పడిపోతున్నాయి. దీని కారణంగా విద్యుత్ కొరత తప్పదనే సంకేతాలు వస్తున్నాయి. అక్టోబరు 5 నాటి లెక్కల ప్రకారం.. దేశంలోని 135 థర్మల్ ప్లాంట్లలో 106 ప్లాంట్లలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. పరిస్థితులు ఇలానే కొనసాగితే.. దేశవ్యాప్తంగా చీకట్లు తప్పవనే ఆందోళన వ్యక్తమవుతోంది.