Tirupati : శోభాయమానంగా శ్రీ కోదండరాముని పుష్పయాగం
తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో శనివారం పుష్పయాగ మహోత్సవం శోభాయమానంగా జరిగింది.
Tirupati : తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో శనివారం పుష్పయాగ మహోత్సవం శోభాయమానంగా జరిగింది. ఆలయంలో మార్చి 30 నుండి ఏప్రిల్ 8వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం తెలిసిందే. ఈ బ్రహ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్త దోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు.
ఈ సందర్భంగా ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు స్వామి, అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. మధ్యాహ్నం 3గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు ఆలయంలోని ఊంజల మండపంలో అర్చకుల వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ పుష్పయాగం శాస్త్రోక్తంగా జరిగింది.
తులసి, చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, రోజా, కలువలు వంటి 11 రకాల పుష్పాలు, ఐదు రకాల పత్రాలు కలిపి మొత్తం 3 టన్నుల పుష్పాలు, పత్రాలతో స్వామి, అమ్మవార్లకు యాగం నిర్వహించారు. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి పుష్పాలు విరాళంగా అందాయి. మొదటగా అర్చకులు 108 సార్లు విష్ణుగాయత్రి మంత్రాన్ని పఠించి పుష్పాలకు అధిపతి అయిన పుల్లుడు అనే దేవుణ్ణి ప్రసన్నం చేసుకున్నారు. ఇలా చేయడం వల్ల ప్రకృతిమాత పులకించి ఎలాంటి వైపరీత్యాలు తలెత్తకుండా స్వామివారు కరుణిస్తారని నమ్మకం. పుష్పయాగం అనంతరం శ్రీసీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగించారు.
Also Read : TTD: మే 25 నుంచి 29 వరకు హనుమజ్జయంతి ఉత్సవాలు