Online Games : ఆన్లైన్ గేమ్స్ రీచార్జ్ కోసం దొంగగా మారిన బాలుడు
ఆన్లైన్ గేమ్స్ ఓ చిన్నారి భవిష్యత్ ను నాశనం చేశాయి. గేమ్స్ ముందుకు సాగేందుకు అవసరమైన రీచార్జ్ డబ్బుల కోసం దొంగగా మారాడు. ఈ నేపథ్యంలో నార్పలలోనే మూడు ఇళ్లలో చోరీ చేశాడు.
boy became a thief : ఆన్లైన్ గేమ్స్ ఓ చిన్నారి భవిష్యత్ ను నాశనం చేశాయి. గేమ్స్ ముందుకు సాగేందుకు అవసరమైన రీచార్జ్ డబ్బుల కోసం దొంగగా మారాడు. పోలీసుల కథనం ప్రకారం నార్పలకు చెందిన ఓ బాలుడు ఆన్లైన్ గేమ్స్కు అలవాటు పడ్డాడు. 8వ తరగతితోనే చదువు మానేశాడు. నిరంతరం ఆన్లైన్ గేమ్స్ ఆడేవాడు. అయితే గేమ్స్ ముందుకు సాగాలంటే రీచార్జ్ చేయాల్సి రావడంతో సులభంగా డబ్బు సంపాదించేందుకు చోరీలకు పాల్పడుతున్నాడు.
ఈ నేపథ్యంలో నార్పలలోనే మూడు ఇళ్లలో చోరీ చేశాడు. ఆ తర్వాత సెప్టెంబర్ 1న తాడిపత్రిలో, సెప్టెంబర్ 4న రూరల్ పరిధిలో వరుస చోరీలు చేసి రూ.3.79 లక్షల నగదు, రూ.3 లక్షల విలువైన బంగారు ఆభరణాలు చోరీ చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పట్టణ, రూరల్ పోలీసులు కేసులు నమోదు చేసుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో బుధవారం ఆటోనగర్లో వాహనాల తనిఖీ చేస్తున్న పోలీసులు..ఆ దారి గుండా వెళుతున్న బాలుడిని ప్రశ్నించారు.
పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అదుపులోకి తీసుకుని బాలుడిని విచారించగా చోరీల విషయం వెలుగు చూసింది. దీంతో బాలుడి దగ్గర నుంచి రూ.3.79 లక్షల నగదుతో పాటు రూ.3 లక్షల విలువైన బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు బాలుడిని అరెస్టు చేశారు. నార్పలలో జరిగిన చోరీ ఘటనల్లోనూ అతనిపై మూడు కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ వీఎన్కే చైతన్య వెల్లడించారు.