విషవాయువుతో ఉలిక్కిపడ్డ విశాఖ, ముగ్గురు మృతి, 1000మందికి అస్వస్థత, లీక్ అయిన్ విషవాయువు ఇదే

  • Published By: naveen ,Published On : May 7, 2020 / 03:10 AM IST
విషవాయువుతో ఉలిక్కిపడ్డ విశాఖ, ముగ్గురు మృతి, 1000మందికి అస్వస్థత, లీక్ అయిన్ విషవాయువు ఇదే

విషవాయువు లీక్ తో విశాఖ నగరం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. 5 గ్రామాలకు చెందిన వెయ్యి మంది ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. విషవాయువు లీక్ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. వీరిలో ఇద్దరు వృద్ధులు, ఎనిమిదేళ్ల చిన్నారి ఉన్నారు. అస్వస్థతకు గురైన వారిలో 20మంది పరిస్థితి విషమంగా ఉంది. అస్వస్థతకు గురైన వారికి వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఆర్ ఆర్ వెంకటాపురం, కంపరపాలెం కాలనీ, ఎస్సీ, బీసీ కాలనీ, నందమూరి నగర్, పద్మాపురం గ్రామాల ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి లీక్ అయిన విషయవాయువును సైరిన్ మోనోమర్ గా అధికారులు గుర్తించారు. ఈ గ్యాస్ మూడు కిలోమీటర్ల మేర వ్యాపించింది. వందలాది మంది అపస్మారక స్థితిలోకి వెళ్లారు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. చర్మంపై దద్దుళ్లు వచ్చాయి. మరీ ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

విషవాయువు లీక్ తో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు:
విశాఖలోని గోపాలపట్నం పరిధిలోని ఆర్‌ఆర్‌ వెంకటాపురంలోని ఎల్‌జి పాలిమర్స్ పరిశ్రమలో గురువారం(మే 7,2020) తెల్లవారుజామున భారీ ప్రమాదం చోటుచేసుకుంది. పరిశ్రమ నుంచి భారీగా రసాయన వాయువు లీక్ అయ్యింది. 3 కిలోమీటర్ల​ మేర గ్యాస్ వ్యాపించింది. లీకైన రసాయన వాయువు పీల్చడంతో స్థానిక ప్రజలు ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డారు. దీంతో పాటు చర్మంపై దద్దుర్లు వచ్చాయి. కళ్లలో మంటలతో ఇబ్బంది పడ్డారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి. భయాందోళనకు గురైన స్థానికులు ఇల్లు ఖాళీ చేసి మేఘాద్రి గడ్డ డ్యామ్ వైపు పరుగులు తీశారు. 

లాక్ డౌన్ లో ఉన్న కంపెనీని తెరిపించే క్రమంలో ప్రమాదం:
రసాయన గాలి పీల్చడంతో కొంతమంది అస్వస్థతకు గురై అపస్మారకస్థితిలో రోడ్డుపైనే పడిపోయారు. ఇటీవల కాలం వరకు లాక్ డౌన్ లో ఉన్న కంపెనీని తెరిపించే క్రమంలో తెల్లవారుజామున 4గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గ్యాస్‌ లీకేజీ ఘటనపై అధికార యంత్రాంగం తక్షణమే స్పందించి  సైరన్‌ మోగించి ప్రజలను అప్రమత్తం చేశారు. దీంతో పాటు గ్యాస్‌ లీకేజీపై పోలీసులకు సమాచారమందించారు. 

5 గ్రామాల ప్రజల తరలింపు:
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని భయంతో తలుపులు వేసుకొని ఉండిపోయిన ప్రజలను ఇళ్లను ఖాళీ చేయాల్సిందిగా హెచ్చరించి వేరే చోటికి తరలిస్తున్నారు. ఈ ప్రమాదంలో అస్వస్థతకు గురైన వారిలో ఎక్కువగా చిన్నారులు, మహిళలు, వృద్ధులు ఉన్నారు. ఎల్‌జి పాలిమర్స్‌లో రసాయన గ్యాస్‌ లీకైన ఘటనపై సీఎం జగన్ కలెక్టర్‌ వినయ్‌చంద్‌కు ఫోన్‌ చేసి ఆరా తీశారు. తక్షణమే సహాయ కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. రసాయన వాయువు విడుదలైన బాధిత ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

పరిశ్రమకు 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతాల ప్రజలను ఇళ్ల నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. 25 అంబులెన్స్ లు, పోలీసు వాహనాల ద్వారా అస్వస్థతకు గురైన వారిని విశాఖ కేజీహెచ్ కు తరలిస్తున్నారు. సింహాచలం డిపో నుంచి ఆర్టీసీ బస్సులను తీసుకొచ్చి పరిశ్రమకు ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న వారిని తరలిస్తున్నారు.

Also Read | విశాఖలో భారీ ప్రమాదం.. విషవాయువు లీక్, ఇళ్లు వదిలి పరుగులు తీసిన ప్రజలు