వీడు మామూలోడు కాదు…ప్లేబోయ్ దేవరాజ్

  • Published By: murthy ,Published On : September 10, 2020 / 03:57 PM IST
వీడు మామూలోడు కాదు…ప్లేబోయ్ దేవరాజ్

టీవీ నటి శ్రావణి సూసైడ్ కేస్‌లో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. టిక్‌టాక్‌ను అడ్డుపెట్టుకొని దేవరాజ్‌ అమ్మాయిలను వేధించినట్లు పోలీసులు గుర్తించారు. పలువురు అమ్మాయిలతో దేవరాజ్‌ ప్రేమాయణం నడిపినట్టుగా గుర్తించారు. ఒకరికి తెలియకుండా మరొకరితో దేవరాజ్‌ ప్రేమాయణం నడిపాడు. దేవరాజ్ ను ప్రశ్నిస్తుంటే ఒక్కో విషయం బయటకు వస్తోంది.

టీవీ సీరీయల్స్ నటి శ్రావణి డెత్‌ కేసు గంట గంటకో కొత్త మలుపు తిరుగుతోంది. శ్రావణి మరణం వెనుక నమ్మలేని నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె జీవితం అర్దాంతరంగా ముగియడానికి ప్రేమే కారణమని తెలుస్తుండగా.. శ్రావణి సూసైడ్‌ కేసులో సస్పెన్స్‌ కొనసాగుతోంది. ప్రేమ పేరుతో వంచనకు గురైన శ్రావణి మరణంలో దిగ్బ్రాంతికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటి వరకు ప్రధానంగా దేవరాజ్‌ రెడ్డి, సాయి ఇద్దరి పేర్లే వినిపిస్తుండగా.. తాజాగా సినీ నిర్మాత అశోక్‌ రెడ్డి పాత్ర కూడా ఉన్నట్లు తేలుస్తోంది.



కేసులో సాయి, దేవరాజ్‌లు.. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. శ్రావణి సూసైడ్‌కు నువ్వంటే నువ్వే, కారణమంటూ రచ్చ చేస్తున్నారు. అయితే ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరాజ్‌ రెడ్డిని మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక సాయి, శ్రావణి కుటుంబ సభ్యుల స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనున్నారు. సూసైడ్‌ కేసులో అసలు గుట్టువిప్పేందుకు ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసు క్రైమ్‌ థ్రిల్లర్‌కు మించిన సస్పెన్స్‌ను క్రియేట్‌ చేస్తోంది. ఈ కేసులో శ్రావణి, దేవరాజు, సాయిల మధ్య ట్రయాంగిల్‌ స్టోరీ జరిగినట్టు స్పష్టమవుతోంది. దీంతో ఈ కేసు ముడి విప్పేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. టీవీ సీరియల్స్ నటి శ్రావణి గత ఎనిమిదేళ్లుగా తెలుగు సీరియల్స్ లో నటిస్తోంది. కెరీర్‌ సాఫీగా వెళ్తున్న సమయంలో కాకినాడకు చెందిన దేవరాజ్ తో టిక్‌టాక్‌ ద్వారా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఆ తర్వాత దేవరాజ్ నుంచి వేధింపులు మొదలయ్యాయి. ఆ క్రమంలో మంగళవారం రాత్రి మధురా నగర్‌లోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకుంది.



శ్రావణి ఆత్మహత్య కేసులో దేవరాజ్ రెడ్డి అలియాస్‌ సన్నీ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. కాకినాడకు చెందిన దేవరాజ్.. టిక్‌టాక్‌ ద్వారా శ్రావణికి పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. తనకు అమ్మానాన్న ఎవరూ లేరని.. శ్రావణిని నమ్మించి దగ్గరయ్యాడు. శ్రావణి ప్లాట్‌లోనే దేవరాజ్ మకాం పెట్టాడు.

పలుమార్లు ఆమె ప్లాట్‌ ఖాళీ చేయాలని కోరినా అతడు అక్కడే అంటిపెట్టుకుని ఉన్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత కొద్ది రోజులకు అతడి నిజ స్వరూపం తెలిసి.. దేవరాజ్ ను శ్రావణి దూరం పెట్టింది. దేవరాజ్‌ వేధింపులపై జూన్‌లోనే ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసులకు శ్రావణి ఫిర్యాదు చేసింది. కేసు విచారణలో ఉండగానే శ్రావణి సూసైడ్‌ చేసుకుంది.



ఎప్పుడైతే తనను శ్రావణిదూరం పెట్టిందో.. అప్పటి నుంచి దేవరాజ్‌ కక్ష పెంచుకున్నాడు. వ్యక్తిగత ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పెడతానని.. తాను అడిగిన మనీ ఇస్తేనే వాటిని డిలీట్‌ చేస్తానని బెదిరింపులకు పాల్పడినట్టు పోలీసులు చెబుతున్నారు. గత్యంతరం లేక విడతల వారీగా దేవరాజ్‌ కు శ్రావణి నగదు కూడా పంపినట్లు తెలుస్తోంది.

దేవరాజ్‌ నుంచి వేధింపులు మరింత ఎక్కువవ్వడంతో.. జూన్‌లో అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరోవైపు శ్రావణి కేసులో ఆర్‌ఎక్స్ 100 సినిమా నిర్మాత అశోక్ రెడ్డి పేరు వెలుగులోకి వచ్చింది. దేవరాజ్ పై శ్రావణి పెట్టిన కేసు వ్యవహారంలోనే నిర్మాత అశోక్‌ రెడ్డి పేరు వెలుగులోకి వచ్చింది.



టీవీ ఆర్టిస్ట్ శ్రావణి కేసులో మరో కోణం కూడా బయటకు వచ్చింది. సాయి అనే వ్యక్తి వల్లే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని దేవ్‌రాజ్ ఆరోపిస్తుంటే.. అదంతా అబద్ధమని కొట్టిపారేస్తున్నాడు సాయి. శ్రావణి – దేవ్‌రాజ్ ల మధ్య జరిగిన సంభాషణలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. తాను చనిపోతే సాయి వల్లే అంటూ మొదటి ఆడియో క్లిప్‌లో శ్రావణి చెప్పినట్లుగా ఉంది.

ఇక రెండో ఆడియో క్లిప్‌లో మాత్రం కాస్త భిన్నంగా ఉంది. ఇక్కడితో ఆపేద్దాం అంటూ శ్రావణి అంటుంటే.. తనతో స్పెండ్ చేయాలని.. మాట్లాడకుంటే జరిగే పరిణామాలకు తనకు సంబంధం ఉండదంటూ దేవ్‌రాజ్ శ్రావణిని బెదిరించడం వినిపిస్తోంది. ఇందులో దేవరాజ్‌ శ్రావణిపై బెదిరింపులకు పాల్పడినట్టుగా తెలుస్తోంది.



మర్యాదగా వచ్చి తనతో గంట సమయం గడపాలని బెదిరించినట్టు ఆడియోలో ఉంది. తన దగ్గరికి రాకపోతే.. తర్వాత జరిగే పరిణామాలకు తనను అడగవద్దని హెచ్చరించాడు. దీనికి స్పందించిన శ్రావణి.. ఇంతటితో ఆపెయ్‌.. నీకు విశ్వాసం లేదు.. నాతో ఆడుకోకు దేవా అంటూ ప్రాధేయపడింది.

శ్రావణి సూసైడ్‌ కేసులో తనపై వస్తున్న ఆరోపణలపై దేవరాజ్ రెడ్డి స్పందించారు. శ్రావణి ఆత్మహత్యతో తనకెలాంటి సబంధం లేదని తెలిపాడు. శ్రావణి కుటుంబ సభ్యులతోపాటు.. సాయి అనే వ్యక్తివల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు ఆరోపించాడు.

సాయి శ్రావణిని తన ముందే చంపాలని చూశాడని, అతడిని పెళ్లి చేసుకోవాలని శ్రావణిపై ఒత్తిడి తెచ్చాడని దేవరాజ్ ఆరోపించాడు. పెళ్లి చేసుకోకపోతే చంపేస్తాడనే భయంతోనే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. ఇక శ్రావణిని బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నట్లు ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో తనపై నమోదైంది తప్పుడు కేసని తెలిపాడు.



అయితే దేవరాజ్ రెడ్డి ఆరోపణలపై సాయి అనే వ్యక్తి కూడా స్పందించాడు. తాను శ్రావణి ఫ్యామిలీకి ఫ్రెండ్‌నని.. ఆమె చనిపోయినప్పటి నుంచి మృతదేహంతోనే ఉన్నానని.. తాను ఎక్కడికీ పారిపోలేదని స్పష్టం చేశాడు. మరో వైపు కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరాజ్ రెడ్డి ఎస్సార్ నగర్ పోలీసుల ఎదుట లొంగిపోయారు.

దీంతో దేవరాజ్ రెడ్డిని పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. అలాగే కేసుతో సంబంధం ఉన్న ప్రతిఒక్కరిని విచారిస్తామని.. కాల్‌డేటాను కూడా సేకరిస్తున్నట్లు సీఐ నరసింహారెడ్డి తెలిపారు. శ్రావణి కుటుంబ సభ్యులు దేవరాజ్ రెడ్డిపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శ్రావణి ఆత్మహత్యకు దేవరాజే కారణమని ఆరోపిస్తున్నారు.



శ్రావణి సూసైడ్‌ మిస్టరీ గుట్టు విప్పేందుకు అన్ని కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసులో ఇప్పటికే ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసలు దేవరాజ్‌ రెడ్డిని విచారిస్తున్నారు. శ్రావ‌ణి కాల్ డేటాని పోలీసులు క్షుణ్ణంగా ప‌రిశీలిస్తున్నారు. కాల్ రికార్డ్స్ ద్వారా ఈ కేసుని ఛేదించాల‌ని ప్రయ‌త్నిస్తున్నారు.

మొత్తానికి శ్రావ‌ణి ఆత్మహ‌త్యలోనూ కొన్ని వెలుగు చూడ‌ని ర‌హ‌స్యాలు ఉన్నాయేమో అనిపిస్తోంది. మరోవైపు సాయి, శ్రావణి పేరెంట్స్‌ స్టేట్‌మెంట్‌ను కూడా పోలీసులు రికార్డు చేయనున్నారు. దేవరాజ్‌, సాయి ఇద్దరినీ కూడా లోతుగా విచారిస్తేనే శ్రావణి మృతిపై చిక్కుముడి వీడే అవకాశం ఉంది.