రూటు మార్చిన చైన్ స్నాచర్స్….
chain snatching cases : నిన్న, మొన్నటి వరకు ఎక్కువగా పట్టణాల్లో బైక్ లపై వచ్చి ఒంటరి మహిళల మెడలో గొలుసులు తెంచుకు పోయే చైన్ స్నాచర్స్ ఇప్పడు రూటు మార్చి పల్లెబాట పట్టారు. తాజాగా కృష్ణా జిల్లాలో రెండు చోట్ల చైన్ స్నాచింగ్ లు జరిగాయి.
పామర్రు లో వైష్ణవాలయం వద్ద ఉండే సుబ్బరత్తమ్మ అనే మహిళ శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో తన ఇంటి నుంచి కిరాణా షాపునకు వెళ్తుండగా దుండగులు బైక్పై వచ్చి బండిని ఆమె పక్కగా పోనిచ్చారు. ఇది గమనించిన ఆమె పక్కకు తప్పుకుంది. ఆ గుర్తు తెలియని దుండగులు వెనుకగా వచ్చి ఆమె ముందు బండి తిప్పి మెడలో ఉన్న నానుతాడు లాక్కెళ్లడానికి ప్రయత్నించారు.
సుబ్బరత్తమ్మ గట్టిగా అరిచి ప్రతిఘటించటంతో, బలంగా ఆమె గొంతునొక్కారు. ఇది గమనించిని మరోక మహిళ గట్టిగా కేకలు వేయటంతో దుండగులు పారిపోయారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలోనే ఇలాంటి ఘటన జరగటం పట్ల ప్రజలు భయపడుతున్నారు.
మరో ఘటన మండలంలోని జమీగొల్వేపల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన నాగమణి అనే మహిళ ఉదయం 8 గంటల ప్రాతంలో ఇంట్లోని చెత్తను బయట పారబోసి వస్తుండగా బైక్ పై వచ్చిన దొంగలు ఆమె మెడలోని గొలుసు లాక్కుని పారిపోయారు. పామర్రు,జమీగొల్వేపల్లిలో జరిగిన రెండు ఘటనలు ఒకే మాదిరిగా ఉండటంతో ఈ రెండు ఒకరే చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.