YSRCP : జగన్ను ఎదుర్కోవాలంటే అవతలి వైపు కూడా జగనే ఉండాలి, ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకున్నా జగనే సీఎం- వైసీపీ నేతలు
రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు కలిసి పోటీ చేసినా చివరికి గెలిచేది జగనే. YSRCP - Janasena
YSRCP – Janasena : పొత్తులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచేశాయి. టీడీపీతో పొత్తు గురించి పవన్ కల్యాణ్ ఓపెన్ అయిపోయారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని చెప్పేశారు. రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబుతో భేటీ తర్వాత పొత్తులపై కీలక ప్రకటన చేశారు పవన్ కల్యాణ్. టీడీపీ, జనసేనతో కలిసి రావాలని బీజేపీని కోరారు పవన్ కల్యాణ్.
”టీడీపీ పొత్తుపై పవన్ కల్యాణ్ చేసిన ప్రకటనపై వైసీపీ నేతలు భగ్గుమన్నారు. పవన్ టార్గెట్ గా విరుచుకుపడ్డారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న ముసుగు తొలగిపోయిందని మంత్రి ఉషశ్రీ చరణ్ అన్నారు. టీడీపీ-నసేన కలిసి వచ్చినా, ఏ ఎజెండాతో వచ్చినా మాకు వచ్చే నష్టమేమీ లేదన్నారామె.
వై నాట్ 175 నినాదంతోనే ముందుకెళ్తామని, భారీ మెజార్టీతో గెలిచి మరోసారి జగన్ సీఎం కాబోతున్నారని మంత్రి ఉషశ్రీ చరణ్ జోస్యం చెప్పారు. జగన్ ను ఎదుర్కోవాలంటే అవతలి వైపు కూడా జగనే ఉండాలి అని డైలాగ్ పేల్చారు. జనసేన-టీడీపీలు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా వైసీపీ ముందు పని చేయవన్నారు. 2019 నుంచి ఇప్పటివరకు కుల మత పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందించామన్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి విషయంలో దేశంలో ఎక్కడా లేని విధంగా చేశాము కనుకనే గడపగడపకు కార్యక్రమంలో కాలర్ ఎగరేసుకుని తిరగగలుగుతున్నాం” అని మంత్రి ఉషశ్రీ చరణ్ అన్నారు.
అన్ని పార్టీలు కలిసి పోటీ చేసినా గెలిచేది జగనే..
ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకున్నా నెక్ట్స్ సీఎం జగన్ మోహన్ రెడ్డే అని ఆమంచి కృష్ణమోహన్ విశ్వాసం వ్యక్తం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకోవటం అందరూ ఊహించిందే అన్నారాయన. జనసేన నాయకులతో మాట మాత్రం చెప్పకుండా చంద్రబాబుతో ములాఖత్ అనంతరం పవన్ పొత్తుపై ప్రకటన చేయడం జనసేన కేడర్ ను అవమానించినట్లే అన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు కలిసి పోటీ చేసినా చివరికి గెలిచేది జగనే అని ఆమంచి కృష్ణమోహన్ ధీమా వ్యక్తం చేశారు.