Margani Bharat : పౌరుషం ఉంటే ఈటలలా రాజీనామా చేయండి, వైసీపీ ఎంపీ సవాల్
నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజుపై వైసీపీ ఎంపీ మార్గాని భరత్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎంపీ రఘురామపై అనర్హత వేటు వేయడం ఖాయమని భరత్ స్పష్టం చేశారు.
Margani Bharat : నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజుపై వైసీపీ ఎంపీ మార్గాని భరత్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎంపీ రఘురామపై అనర్హత వేటు వేయడం ఖాయమని భరత్ స్పష్టం చేశారు. ఆర్టికల్ 10 ప్రకారం స్పీకర్ తప్పనిసరిగా చర్యలు తీసుకుంటారని ఆయన అభిప్రాయపడ్డారు. స్పీకర్ ఓం బిర్లాను కలిసినంత మాత్రాన ఆయనను బర్తరఫ్ చేయడం నిలిచిపోదని అన్నారు. అంతేకాదు రఘురామకృష్ణరాజుకు తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు లింకు పెట్టి సవాల్ కూడా విసిరారు. రఘురామకృష్ణరాజుకు పౌరుషం ఉంటే తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ లాగా రాజీనామా చేయాలన్నారు.
సీఎం జగన్ కి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం వల్లే రఘురామకు ఈ పరిస్థితి వచ్చిందని భరత్ అన్నారు. రఘురామ అనర్హత వేటుపై లోక్ సభ స్పీకర్ కు రిమైండర్ నోటీస్ కూడా ఇచ్చామన్నారు. ఆర్టికల్ 10 ప్రకారం పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న రఘురామ డిస్ క్వాలిఫై ఖాయమని మార్గాని భరత్ అన్నారు. రాజీనామా చేసి పోటీ చేస్తే రఘురామకు డిపాజిట్ కూడా దక్కదన్నారు.
పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని ఇటీవలే లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు వైసీపీ ఎంపీ మార్గాన్ని భరత్ ఫిర్యాదు చేశారు. అంతేకాదు రాజ్యాంగంలోని 10 షెడ్యూల్ ప్రకారం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అతిక్రమించిన రఘురామను వెంటనే డిస్ క్వాలిఫై చేయాలని విజ్ఞప్తి చేశారు.