టిక్ టాక్ వీడియోలు చేయొద్దన్నందుకు తల్లీ, కొడుకులపై దాడి
రాత్రి 9 గంటల సమయంలో తమ ఇంటిముందు టిక్టాక్ వీడియోలు తీయవద్దని చెప్పినందుకు ఓ యువకుడిని, అతని తల్లిపై కొంత మంది దాడి చేసిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
బంజారాహిల్స్ రోడ్ నెం.10లోని సింగాడికుంట దోభీఘాట్ బస్తీలో నివాసం ఉంటున్న సురేష్ సీఎం క్యాంప్ కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ విభాగంలో అటెండర్గా పని చేస్తుంటాడు. శనివారం రాత్రి 9గంటల సమయంలో 10 మంది యువకులు అతడి ఇంటివద్ద టిక్ టాక్ వీడియోలు చేస్తూ న్యూసెన్స్ కు పాల్పడ్డారు. ఇది గత కొన్నిరోజులుగా జరుగుతోంది.
రాత్రి పూట కర్ఫ్యూ అమల్లో ఉండగా రాత్రి పొద్దుపోయే దాకా యువకులు సురేష్ ఇంటివద్ద న్యూసెన్స్ చేయటం నచ్చని సురేష్…. రాత్రి పూట ఇలా చేయవద్దని వారిని అడ్డుకున్నాడు. దీంతో ఆగ్రహించిన యువకులు అతడిపై దాడి చేశారు. దాడిని అడ్డుకోటానికి వెళ్లిన సురేష్ తల్లి నాగమ్మపైనా యువకులు దాడి చేశారు.
తనపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలని బాధితుడు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజీని కూడా పోలీసులకు అందించడంతో కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read: మహారాష్ట్రలో సాధువును హత్యచేసిన రౌడీ షీటర్