karimnagar Maoists : కరీంనగర్ జిల్లాకు మావోయిస్టు లింకులపై ఆరా తీస్తున్న పోలీసులు
ఒకప్పుడు నక్సల్స్ కార్యకలాపాలు విస్తృతంగా జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వం, పోలీసుల చొరవతో ఉద్యమం పూర్తిగా తుడిచి పెట్టుకుపోయిందనుకుంటున్న సమయంలో మావోయిస్టుల కదలికలు ఆంద
karimnagar Maoists : ఒకప్పుడు నక్సల్స్ కార్యకలాపాలు విస్తృతంగా జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వం, పోలీసుల చొరవతో ఉద్యమం పూర్తిగా తుడిచి పెట్టుకుపోయిందనుకుంటున్న సమయంలో మావోయిస్టుల కదలికలు ఆందోళన కలిగిస్తున్నాయి. మావోయిస్టులకు పేలుడు పదార్ధాలు తీసుకువెళ్తున్న వారిని చత్తీస్ ఘడ్ పోలీసులు అరెస్ట్ చేయటంతో కరీంనగర్ జిల్లాకు మవోయిస్టులతో ఉన్నసంబంధాలు మరో సారి బయటపడ్డాయి.
జిల్లాలోని గ్రానెట్ వ్యాపారస్తులకు మావోయిస్టులతో ఉన్న లింకులపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ కేసులో కరీంనగర్ లోని ఎన్టీఆర్ ,తమిళ కాలనీలకు చెందిన రాజా గోపాల్,ఖాసిమ్ లను గడ్చిరోలి జిల్లా దామ్రాoచ పోలీసులుఅరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మావోయిస్టులకు కార్డెక్స్ కేబుల్స్ తరలిస్తుండగా పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ నేపధ్యంలో కరీంనగర్ రూరల్ సిఐ విజ్ఞాన్ రావు ఆధ్వర్యంలో పోలీసు బృందం గడ్చిరోలి వెళ్లింది. మావోయిస్టుల సంబంధాల పై జిల్లా పోలీసులు ఆరా తీస్తున్నారు. తమిళ కాలనీ,బావుపేట,కశ్మీర్ గడ్డ,ఫజల్ నగర్,కిసాన్ నగర్ లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ముకరంపురాలో పురుషోత్తం అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతడిని గడ్చిరోలి తీసుకు వెళ్లారు.
గడ్చిరోలి జిల్లా ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం… తెలంగాణ నుంచి ఛత్తీస్గఢ్కు పేలుడు పదార్థాల్లో ఉపయోగించే కార్డెక్స్ వైర్ బండిల్స్ను సరఫరా చేస్తున్న నలుగురు ఫిబ్రవరి 20 ఆదివారం నాడు గడ్చిరోలి జిల్లా పోలీసులకు పట్టుబడినట్లు ఎస్పీ అంకిత్ గోయల్ ప్రకటించారు. అహేరి తాలూకా దామ్రాంచ–బంగారంపేట గ్రామాల అటవీ ప్రాంతాల మీదుగా 20 కార్డెక్స్ వైర్ బండిల్స్ రవాణా చేస్తున్నారనే సమాచారంతో పీఎస్సై సచిన్ ఘడ్కే ఆధ్వర్యంలో క్యూఆర్టీ పోలీసుల బలగాలతో మాటువేసి పట్టుకున్నారు.
మావోయిస్టు సానుభూతిపరులైన తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకు చెందిన రాజాగోపాల్ సల్ల, మహ్మద్ ఖాసీం షాదుల్లా, గడ్చిరోలి జిల్లాకు చెందిన కాశీనాథ్, సాధుల లచ్చాతలండి పట్టుబడగా, వీరి నుంచి 3,500 కార్డెక్స్ వైర్ బండిల్స్ను స్వాధీనం చేసుకున్నారు. మరొకరు పరారీలో ఉన్నారు. విచారణలో స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలు, వివిధ లాంచర్లు, హ్యాండ్గ్రనేడ్లు, ఐఈడీఎస్ తయారు చేసేందుకు వినియోగిస్తున్నట్లు తెలిపారు.
దీంతో మరోసారి కరీంనగర్ జిల్లాలో మావోయిస్ట్ లింకులు బయట పడినట్లయింది. పట్టుబడిన నిందితులు గ్రానైట్ పరిశ్రమకు కేంద్రంగా ఉన్న ప్రాంతం వాసులు కావడం, నిరంతరం గ్రానైట్ కోసం పేలుడు పదార్థాలు వినియోగించడం సర్వ సాధారణం కావడంతో ఎవరికీ అనుమానం రాకుండా పేలుడు పదార్థాలను ఎక్కడి నుంచి తీసుకువచ్చారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : Jharkhand : ఝార్ఖండ్ లో పడవ బోల్తా..16 మంది గల్లంతు..రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్
ఇది కాక మరోక ఘటనలో మావోయిస్ట్ పార్టీతో సంబంధాలు కలిగి ఉండి పార్టీలో చేరేందుకు సిద్ధమైన వ్యక్తిని జనవరిలో పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో మావోయిస్టు లింకులు జిల్లాలో బయటపడ్డాయి. గంగాధర మండలం కొండన్నపల్లికి చెందిన ఒకరు వికారాబాద్కు చెందిన మరో ఇద్దరితో కలిసి మావోయిస్ట్ పార్టీలో చేరేందుకు వెళ్తున్నట్లు గుర్తించి వారందరినీ అదుపులోకి తీసుకున్నారు.