Bihar Cyber Gang : బీహార్లో రెచ్చిపోయిన సైబర్ ముఠా.. హైదరాబాద్ పోలీసులపై కాల్పులు
బీహార్ లో సైబర్ ముఠా రెచ్చిపోయింది. ఓ సైబర్ ఫ్రాడ్ కేసు విచారణలో భాగంగా బీహార్ వెళ్లిన హైదరాబాద్ పోలీసులపైన కాల్పులు జరిపింది. పోలీసులపై కాల్పులు జరుపుతూ ప్రధాన నిందితుడు మిథిలేష్ తప్పించుకున్నాడు.
Bihar Cyber Gang : బీహార్ లో సైబర్ ముఠా రెచ్చిపోయింది. ఓ సైబర్ ఫ్రాడ్ కేసు విచారణలో భాగంగా బీహార్ వెళ్లిన హైదరాబాద్ పోలీసులపైన కాల్పులు జరిపింది. పోలీసులపై కాల్పులు జరుపుతూ ప్రధాన నిందితుడు మిథిలేష్ తప్పించుకున్నాడు. అటు దుండగులు జరిపిన కాల్పుల నుంచి పోలీసులు క్షేమంగా బయటపడ్డారు. నిందితుల నుంచి కోటి 25 లక్షల 77వేల రూపాయల నగదుతో పాటు మూడు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే మూడు విదేశీ మద్యం బాటిళ్లను సైతం స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
సైబర్ నేరగాళ్లను పట్టుకునేందుకు హైదరాబాద్ పోలీసులు బీహార్ వెళ్లారు. పక్కా సమాచారం మేరకు.. అక్కడి పోలీసుల సాయం వారిని పట్టుకునేందుకు సంయుక్త బృందం భవానీ బిగా గ్రామంలోని నిందితుడు మిథిలేశ్ ప్రసాద్ ఇంటికి వెళ్లారు. పోలీసుల రాకను గమనించిన మిథిలేష్ ఇంటి వెలుపల వాహనంలో ఉన్న నలుగురు వ్యక్తులు పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో పోలీసులు సైతం కాల్పులు జరిపారు.
ఆ తర్వాత నలుగురు నిందితులు పారిపోయేందుకు యత్నించగా.. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఆ నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. నలుగురు నిందితులు పలు సైబర్ నేరాలకు సంబంధించిన ముఠా సభ్యులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులను పీటీ వారెంట్పై హైదరాబాద్ కు తీసుకురానున్నారు పోలీసులు.