హైదరాబాద్ లో డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు

  • Published By: murthy ,Published On : June 22, 2020 / 02:47 AM IST
హైదరాబాద్ లో డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు

హైదరాబాద్ లో భారీ డ్రగ్స్ రాకెట్ ముఠా గుట్టు రట్టు చేశారు ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ పోలీసులు.  ఆదివారం జూన్ 21న అమీర్ పేటలో నిర్వహించిన తనిఖీల్లో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి నిషేధిత డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో 105 గ్రాముల ఎండీఎంఏ, 25 గ్రాముల కొకైన్, 25 గ్రాముల హషిష్‌ ఆయిల్, 4 బ్లాట్స్‌ ఎల్‌ఎస్‌డీ, 250 డ్రై గంజాయి నిందితుల వద్ద లభించింది. 

ముగ్గురు నిందితుల వద్ద నుంచి 7 సెల్ ఫోన్లు, 2 కార్లు, ఒకబైక్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్ దందాకు సూత్రధారిగా భావిస్తున్న మధురానగర్‌కు చెందిన భరత్‌ తుక్రాల్‌(48)తోపాటు బల్కంపేట్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ రాణాప్రతాప్‌(29), షేక్‌ ఫిరోజ్‌ అహ్మద్‌(29)లను పోలీసులు అరెస్టు చేశారు. ఎండీఎంఏ డ్రగ్స్‌ను బెంగళూరుకు చెందిన జేమ్స్, ఢిల్లీకి చెందిన జెమీ, చెన్నైకు చెందిన అబ్దుల్‌ వద్ద కొనుగోలు చేసినట్లు నిందితులు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. 

కాగా….నిందితులు నగరంలోని పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలకు నిషేధిత డ్రగ్స్‌ను సరఫరా చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. జేమ్స్, జెమీ, అబ్దుల్‌ ప్రస్తుతం పరారీలో ఉన్నారని…. తదుపరి విచారణ కోసం కేసును అమీర్‌ పేట్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌కు అప్పగించినట్లు అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ అంజిరెడ్డి చెప్పారు.

Read: ఆషాఢమాసం ప్రారంభం-బోనాల ఉత్సవాలు