ఇంటిలో నిమ్మకాయలు,పసుపు,కుంకుమ..కుటుంబమంతా అనుమానాస్పద మృతి

  • Published By: nagamani ,Published On : August 14, 2020 / 12:18 PM IST
ఇంటిలో నిమ్మకాయలు,పసుపు,కుంకుమ..కుటుంబమంతా అనుమానాస్పద మృతి

వనపర్తి జిల్లాలో ఓ కుటుంబంలోని నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా మృతి చెందారు. ఇంట్లో చెల్లాచెదురుగా పడి ఉండటంతో మృత్యువు కరాళ నృత్యం చేసినట్లుగా కనిపిస్తోంది. అంతేకాదు ..ఆ ప్రాంతమంతా మృతదేహాలు, ఇంట్లో నిమ్మకాయలు, పసుపు కుంకుమలు, చెంబులు..కుండలు..గాజులు, పువ్వులు, ఎర్రరంగు కలిపిన అక్షింతలు పడు ఉండటంతో భీతావహంగా మారింది. దీంతో వీరివి హత్యలా? ఆత్మహత్యలా?లేక క్షుద్రపూజల వల్ల భయపడి చనిపోయారా? అనే పలు అనుమానాలకు దారి తీసింది.

వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగపూర్‌లో ఆ దృశ్యాలను చూసి స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఏం జరిగిఉంటుందో ఊహించుకోవటానికి హడలిపోతున్నారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని పరిశీలించి కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. క్షుద్రపూజలే కారణమా లేదా మరేదైనా కారణమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

అజీరాం బీ(63), ఆమె కూతురు ఆస్మా బేగం (35), అల్లుడు ఖాజా పాషా (42), మనవరాలు హసీనా (10) అనుమానస్పదంగా చనిపోయారు. ఇంట్లో వీరంతా హాల్‌, డైనింగ్ హాల్, వంటగది, ఇంటి వెనకలా ఇలా అంతా వేర్వేరు ప్రాంతాల్లో చనిపోయి ఉన్నారు. దీంతో ఇది ఆత్మహత్యా, హత్యా అనే అనుమానాలు కలుగుతున్నాయి. నిమ్మకాయలు, పసుపు కుంకుమ, అగర బత్తీలు ఉండటంతో పాటు ఇంటి ఆవరణలో పలుచోట్ల గుంతలు తవ్వి ఉండటం పోలీసులు గుర్తించారు. దీంతో క్షుద్రపూజలు జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ సంఘటనతో స్థానికులు భయాందోళనకు గురౌతున్నారు.