Ramayampet : తల్లికొడుకు ఆత్మహత్య-రామాయంపేటలో ఉద్రిక్తత
కామారెడ్డిలోని ఓ లాడ్జిలో తల్లీ కొడుకులు ఈరోజు తెల్లవారుఝామున ఆత్మహత్య చేసుకున్న ఘటనలో వారి స్వస్ధలం రామయం పేటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రామాయంపేట మున్సిపల్ చైర్మన్, టీఆర్ఎస్
Ramayampet : కామారెడ్డిలోని ఓ లాడ్జిలో తల్లీ కొడుకులు ఈరోజు తెల్లవారుఝామున ఆత్మహత్య చేసుకున్న ఘటనలో వారి స్వస్ధలం రామాయం పేటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రామాయంపేట మున్సిపల్ చైర్మన్, టీఆర్ఎస్ కు చెందిన జితేంద్ర గౌడ్ నిందితుల్లో ఒకరుగా ఉండటంతో ఆయన ఇంటి దగ్గర ఉద్రిక్తత పరిస్ధితి తలెత్తింది.
గత కొన్నినెలలుగా రామాయంపేట మున్సిపల్ చైర్మన్ జితేంద్రగౌడ్ తో సహా మరో ఆరుగురు తనను వేధించారని వారి పేర్లు చెపుతూ బాధితులు …రామాయంపేటకు చెందిన సంతోష్, తల్లి పద్మ సెల్ఫీ వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఈరోజు తెల్లవారుఝామున పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కామారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలకు పోస్టు మార్టం పూర్తిచేసి బాధితుల కుటుంబ సభ్యులకు అందచేశారు.
సూసైడ్ కు ముందు సెల్ఫీ వీడియో తీసుకున్న బాధితులు తాము ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందో వివరించారు. ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ తోపాటు ఐరెని పృథ్వి రాజ్ అలియాస్ బాలు, రామాయంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, తోట కిరణ్, కన్నా పురం కృష్ణా గౌడ్, సరాఫ స్వరాజ్, అప్పటి సీఐ నాగార్జున గౌడ్ కలిసి వేధించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యాపారం చేయటానికి అప్పుగా జితేంద్రగౌడ్ వద్ద డబ్బులు తీసుకుంటే …. వ్యాపారంలో 50 శాతం వాటా ఇవ్వాలని రామాయంపేట మున్సిపల్ చైర్మన్ వేధించారని సెల్ఫీ వీడియోలో చెప్పాడు మృతుడు సంతోష్. ఫేస్ బుక్ లో ఎవరో చైర్మన్ గురించి పోస్టు పెడితే గతంలో తనను పోలీస్టేషన్ కు పిలిపించి వేధించారని కన్నీరు పెట్టుకున్నాడు. ప్రస్తుతం నాగార్జున గౌడ్ తుంగతుర్తి సీఐగా విధులు నిర్వహిస్తున్నట్టు సంతోష్ చెప్పారు.
Also Read : Kamareddy : తల్లి,కొడుకు ఆత్మహత్య..మా చావుకి ఆ ఏడుగురే కారణం
కుటుంబ సభ్యులు రెండు మృతదేహాలను తీసుకుని జితేంద్ర గౌడ్ ఇంటివద్దకు చేరుకునే సరికి వారికి స్ధానికులు కూడా మద్దతు తెలపటంతో అక్కడ పరిస్ధితి ఉద్రిక్తంగా మారింది. రెండు మృతదేహాలను జితేంద్ర గౌడ్ ఇంటివద్ద ఉంచి కుటుంబ సభ్యులు ఆందోళన చేయటంతో కోపం పట్టలేని స్ధానికులు విధ్వంసానికి పాల్పడ్డారు. జిల్లా ఎస్పీ వచ్చి వారికి సర్ది చెప్పినా పరిస్ధితి సద్దుమణగలేదు. మెదక్ జిల్లా ఎస్పీ రోహిణీ ప్రియదర్శిని బాధిత కుటుంబ సభ్యులతో పలు దఫాలుగా చర్చలు జరపటంతో వారు ఆందోళన విరమించారు.