Mangaluru Auto Blast Case : మంగళూరు ఆటో బాంబ్ బ్లాస్ట్ కేసులో నిందితుడు అరెస్ట్
కర్నాటకలో కలకలం రేపిన మంగళూరు ఆటో బాంబ్ బ్లాస్ట్ కేసులో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. పేలుడు పదార్ధాలు నింపిన వ్యక్తిని షరీఖ్ గా గుర్తించారు పోలీసులు.
Mangaluru Auto Blast Case : కర్నాటకలో కలకలం రేపిన మంగళూరు ఆటో బాంబ్ బ్లాస్ట్ కేసులో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. పేలుడు పదార్ధాలు నింపిన వ్యక్తిని షరీఖ్ గా గుర్తించారు పోలీసులు. షరీఖ్ కు సిమ్ కార్డు అందించిన మరో నిందితుడిని ఊటీలో అరెస్ట్ చేశారు పోలీసులు.
నిందితుడు నకిలీ ఆధార్ కార్డు కలిగున్నట్లు పోలీసులు గుర్తించారు. 5 కిలోల ప్రెషర్ కుక్కర్ లో నిందితుడు పేలుడు పదార్దాలు నింపాడు. మంగళూరు రైల్వే స్టేషన్ నుంచి ఘటనా స్థలానికి అద్దెకు తీసుకున్న ఆటో రిక్షాలో నిందితుడు వచ్చినట్లు విచారణలో తేలింది.
కోయంబత్తూరు, మంగళూరు ఘటనలకు దగ్గరి పోలికలు ఉండటంతో ఎన్ఐఏ అధికారులు ఈ కేసుపై దృష్టి పెట్టారు. ఆటోలో దొరికిన ఆధార్ కార్డు నకిలీదని తేల్చారు పోలీసులు. ఘటన జరిగినప్పుడు ఆటోలో ప్రయాణిస్తున్న వ్యక్తి ప్రేమ్ రాజ్ అని మొదట అందరూ భావించినా.. దర్యాఫ్తులో కాదని తేల్చారు.
ఆధార్ కార్డులోని అడ్రస్ తో హుబ్లీ వెళ్లిన పోలీసులు.. ప్రేమ్ రాజ్ ఒక రైల్వే ఉద్యోగి అని గుర్తించారు. పోయిన ఆధార్ కార్డు మరొకరు ఉపయోగిస్తున్నట్లు దర్యాఫ్తులో తేలింది. మొదట ఇది ప్రమాదవశాత్తు జరిగిన పేలుడుగా భావించినప్పటికి.. ఆ తర్వాత సిటీలో బ్లాస్ట్ కు ప్లాన్ చేయగా, అది ముందే పేలిపోయిందని నిర్ధారించారు. ఎన్ఐఏ బృందాలు సైతం ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించాయి.