సైన్ కోసం లక్షలు డిమాండ్ చేసిన డిప్యూటీ తహసీల్దార్
ఒకప్పుడు ప్రభుత్వ ఆఫీసుల్లో పనులు కావాలంటే కొంతమంది అధికారులు సీల్డ్ కవర్లో కరెన్సీ నోట్లను సీక్రెట్గా తీసుకునేవాళ్లు. కానీ ఇప్పుడు లంచాధికారులు ముదిరిపోయారు. ఏం కావాలో.. ఎంత కావాలో.. డైరెక్ట్గా డిమాండ్ చేస్తున్నారు. సర్కారు కార్యాలయాలను బ్రోకర్ సెంటర్లుగా మార్చేసి.. పనికి తగ్గ పైకం ఇవ్వాల్సిందేనని హుకుం జారీ చేస్తున్నారు. సరిగ్గా ఇలాంటి సిన్మానే చూపించిందో ఆఫీసర్. ఇంతకీ ఎవరీమె.. ? జస్ట్ వాచ్ కరప్షన్ కథా చిత్రమ్.
ఒక్క సంతకం విలువ ఎంతో తెలుసా.. ? ఒకటి రెండు వందలూ, వేలు కాదు… ?అక్షరాల పదమూడు లక్షలు… సైన్ కావాలంటే లక్షలు సమర్పించుకోవాల్సిందేనని బల్లగుద్ది మరీ డిమాండ్ చేసింది. సంతకానికి వెలకట్టి మరీ వేలం వేసింది ఈమె. పేరు జయలక్ష్మి. చేసేది డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం. నాగర్ కర్నూల్ కలెక్టరేట్లోని సి బ్లాక్ను ఏకంగా అవినీతికి అడ్డాగా మార్చేసింది. సాధారణంగా తన దగ్గరికి ఎవరూ రారు. అందుకే తనే డైరెక్ట్గా సీన్లోకి ఎంట్రీ ఇస్తుంది. పిలిచి మరీ పెండింగ్ పనులను చక్కబెడుతానంటుంది. కండిషన్స్ అప్లయ్ అంటూ కరప్షన్ కథ రివీల్ చేస్తుంది.
జయలక్ష్మి ఆఫర్ ఇచ్చింది వెంకటయ్యకి. ఉండేది నాగర్కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలం మారేపల్లిలో. వెంకటయ్య 2016లో 3ఎకరాల 15 గుంటల భూమిని కొనుగోలు చేశాడు. భూమి తన పేరు మీద మార్చాలని తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు కూడా చేసుకున్నాడు. అంతలోనే రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్లకు చెందిన మల్లేష్ కూడా ఆ భూమి తనదేనన్నాడు. వెంకటయ్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేయొద్దంటూ కంప్లయింట్ ఇచ్చాడు. నాలుగేళ్లుగా ఈ వివాదం నడుస్తూనే ఉంది. ఇదే పనిమీద కలెక్టరేట్కు వెళ్లాడు వెంకటయ్య. అక్కడ జయలక్ష్మి కంటపడ్డాడు. మ్యాటర్ ఏంటని ఆరాతీసిన ఆమె.. పనులు ఊరికే కావని బంపర్ ఆఫర్ ఇచ్చింది.
ల్యాండ్ రిజిస్ట్రేషన్కి 13లక్షలు డిమాండ్ చేసింది డిప్యూటీ తహసీల్దార్. కానీ వెంకటయ్య మాత్రం 10 లక్షలు దగ్గరే ఆగిపోయాడు. మంచి బేరం.. మించితే దూరం అవుతుందని భావించిన జయలక్ష్మి.. వెంటనే ఒప్పేసుకుంది. అంతేకాదు డేట్, స్పాట్కూడా ఫిక్స్ చేసింది. డిప్యూటీ తహసీల్దార్ డర్టీ డీల్ చిత్రమ్తో వెంకటయ్య మైండ్ బ్లాంక్ అయింది. లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీకి సమాచారమిచ్చాడు. దీంతో అడ్వాన్స్గా ఇచ్చిన లక్ష రూపాయలు లెక్కబెడుతూ అధికారులకు చిక్కింది. జయలక్ష్మీని అరెస్ట్ చేసి, నగదు స్వాధీనం చేసుకున్న ఏసీబీ డీఎస్పీ.. లంచం ఎవరు అడిగినా దైర్యంగా ఫిర్యాదు చేయాలన్నారు.
ల్యాండ్ రిజిస్ట్రేషన్ కోసం చెప్పులరిగేలా తిరిగినా అధికారులెవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు బాధితుడు వెంకటయ్య. డబ్బు డిమాండ్ చేయడంతోనే ఏసీబీకి సమాచారం ఇచ్చానని అన్నాడు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంకా చాలామంది జయలక్ష్మీలు ఉన్నారు. కానీ దొరకనంత వరకు దొరల్లాగే చెలామణి అవుతున్నారు. పెట్టుబడి లేక దిక్కులు చూస్తున్న రైతులకు లంచాల పేరుతో చుక్కలు చూపిస్తున్నారు.
కనీసం సాయం చేయకపోగా.. అడిగినంత ఇవ్వాలని డిమాండ్లు పెడుతున్నారు. గ్రామసభలతో రైతులకు పాస్బుక్లు ఇవ్వాలని సాక్షాత్తు సీఎం కేసీఆర్ ఆదేశాలిచ్చినా పట్టించుకోవడం లేదంటే.. వీళ్లెంతగా ముదిరిపోయారో అర్థం చేసుకోవచ్చు. లంచావతారుల్ని కేవలం సస్పెన్షన్లతో కాకుండా ఏకంగా డిస్మిస్ చేయాలంటున్నారు బాధితులు.
Read More >>నువ్వు నెలనెలా బిచ్చమేస్తేనే ప్రజలు బతుకుతున్నారా బాబూ? – విజయసాయి