Madhya Pradesh : స్కూటర్ సరిగ్గా నడపమన్నందుకు డిప్యూటీ కలెక్టర్ పై దాడి చేసిన దంపతులు
రోడ్డు మీద స్టూటర్ సరిగ్గా నడపమని చెప్పినందుకు.. జిల్లా డిప్యూటీ కలెక్టర్ ను చితక బాదిన ఘటన మధ్య ప్రదేశ్ లో చోటు చేసుకుంది.
Madhya Pradesh : రోడ్డు మీద స్టూటర్ సరిగ్గా నడపమని చెప్పినందుకు.. జిల్లా డిప్యూటీ కలెక్టర్ ను చితక బాదిన ఘటన మధ్య ప్రదేశ్ లో చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ లోని మందసౌర్ జిల్లాలో అరవింద్ మహోర్ డిప్యూటీ కలెక్టర్ గా పని చేస్తున్నారు. ఇటీవల పిప్లియా మండీలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు విధుల్లో పాల్గోనేందుకు బుధవారం ఉదయం కారులో వెళుతున్నారు.
ఈ క్రమంలో మోహన్ లాల్, అతని భార్య భావన అదే రోడ్డులో స్కూటర్ పై వెళుతున్నారు. స్కూటర్ నడుపుతున్న మోహన్ లాల్ తన వెహికల్ ను అడ్డదిడ్డంగా నడుపుతూ, విన్యాసాలు చేస్తూ పలుమార్లు డిప్యూటీ కలెక్టర్ కారుకు అడ్డం వచ్చాడు. ఓ దశలో డిప్యూటీ కలెక్టర్ కారు ఆపి మోహన్ లాల్ తో మట్లాడారు.
రోడ్డుపై ఫీట్లు చేయకుండా స్కూటర్ సరిగా నడిపి గమ్యం చేరుకోమని సూచించారు. వెంటనే మోహన్ లాల్ అతడి భార్య కోపోద్రిక్తులయ్యారు. మాకే చెబుతావా అంటూ డిప్యూటీ కలెక్టర్ పై దాడికి తెగబడ్డారు. భావన ఆయన కాలర్ పట్టుకుని చెప్పుతో కొట్టింది. పోలీసులకు ఫోన్ చేస్తానని ఆయన చెప్పినా వినకుండా ..ఫోన్ చేస్తావా చేయ్ అంటూ ఆయన్ని కొట్టారు.
వారి నుంచి తప్పించుకున్న డిప్యూటీ కలెక్టర్ పోలీసులకు ఫోన్ చేశారు. కొద్దిసేపట్లో పోలీసులు ఘటనాస్ధలానికి వచ్చి దంపతులను అరెస్ట్ చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకున్నాక తాము కొట్టింది డిప్యూటీ కలెక్టర్ ని అని తెలియటంతో ఆ జంట క్షమించమని వేడుకోవటం మొదలెట్టారు.
నిందుతులిద్దరినీ అదుపులోకి తీసుకున్నపోలీసులు వారి గురించి విచారించారు. నిందితులిద్దరూ రోడ్డు పక్కన టీ స్టాల్ నడుపుకుంటున్నట్లు తెలుసుకున్నారు. ఆ టీ కొట్టు ప్రభుత్వ స్ధలంలో నిబంధనలకు విరుధ్ధంగా ఏర్పాటు చేశారని తెలియటంతో దాన్ని అక్కడ నుంచి తొలగించారు. ప్రభుత్వ ఉన్నతోద్యోగి విధులకు ఆటంకం కలిగించిన కేసులో వారిపై విచారణ జరుగుతోంది.
Also Read : Bull Attack : రెచ్చిపోయిన ఆంబోతు..10 మందికి గాయాలు